Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ఆర్థిక పరిస్థితిపై నోరు విప్పని ప్రధాని
- అంతకంతకు పెరుగుతున్న అనుమానాలు
- నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో అత్యుత్సాహం
- స్వయంగా రంగంలోకి దిగి మరీ ప్రకటనలు
- క్లిష్ట కాలంలో కనిపించిన మోడీ భరోసా!
- ఆశగా ఎదురు చూస్తున్న మార్కెట్ వర్గాలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. వృద్ధి రేటు మూడేండ్ల కనిష్టానికి పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం, ద్రవ్యోలోటు అంచనాలను దాటేయటం, ఎగుమతులు పడిపోవడం, నిరుద్యోగిత అంతకంతకు పెరుగుతుండడం ఆర్థిక వ్యవస్థ పనితీరుపై కొత్త అనుమాలను కలిగిస్తోంది. దీనికి తోడు మందగించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు తాము త్వరలో ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించనున్నట్టుగా స్వయంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీయే ప్రకటించడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వాస్తవానికి ఉద్దీపన ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థ మరీ బలహీనంగా.. లేవలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దన్నుగా ఉండేలా సర్కారులు ప్రకటిస్తుంటాయి. అయితే మన సర్కారు మాత్రం ఆర్థిక వ్యవస్థ భేషుగా ఉందంటూనే.. మరోవైపు ఉద్దీపనల మంత్రం జపిస్తోంది. దీంతో స్టాక్ మార్కెట్లలో మదుపరి సెంటిమెంట్ దెబ్బతింటోంది. ఫలితంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీగా పతనమై దాదాపు రూ.మూడు లక్షల కోట్ల వరకు మదుపరుల సంపద ఆవిరైపోయింది. మరోవైపు అంతర్జాతీయంగా కూడా భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి ఇప్పటికే పలు ఆర్థిక విశ్లేషణ, రేటింగ్ సంస్థలు ముందస్తు హెచ్చరికలతో నివేదికలను వెల్లడిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఆర్థిక వ్యవస్థ పనితీరుపై మౌనంగా ఉండడం దేశ ప్రజలను మరింత ఆవేదన, ఆందోళనలకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ మదుపరులు మోడీ వివరణ కోసం ఆశగా వేచి చూస్తున్నారు.
అప్పుడున్న ఉత్సాహం ఏదీ...?
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలను అమలులోకి తెచ్చే విషయంలో ప్రధాని మోడీ చాలా చురుగ్గా వ్యవహరించడం తెలిసిందే. పెద్దనోట్ల రద్దును స్వయంగా మీడియా ముందుకు వచ్చి జాతికి తెలియపరిచిన ప్రధాని.. జీఎస్టీ అమలులోకి తెచ్చే విషయంలోనూ అదే తరహా ఆసక్తి కనబరిచారు. అర్థరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం ఏర్పాటు చేయించి కొత్త పన్ను విధానాన్ని రాష్ట్రపతితో కలిసి ప్రారంభించారు. అయితే ప్రస్తుతం నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగానే ఆర్థిక వ్యవస్థ మందగించిందని నివేదికలు వస్తున్నాయి. ప్రభుత్వ వర్గాలు కూడా దీనిని పరోక్షంగా అంగీకరిస్తూ వస్తున్నాయి. ఈ రెండు సంస్కరణలను దగ్గరుండి ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి.. ఇప్పుడు ప్రతికూల ఫలితాల నేపథ్యంలో ముఖం చాటేయడమేమిటన్న ప్రశ్న సామాన్యులను తొలచి వేస్తోంది. ప్రధాని మౌనం దేనికి నిదర్శనమన్న వాదనలు వినవస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ నిజంగానే మరీ దిగజారి ప్రమాదకర స్థితిలోకి జారుతోందా.. లేక ఎలాంటి సంజాయిషీతో ప్రజల ముందుకు వెళ్లాలని మోడీ సంశయంలో ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఆ మాటలే నిజమైతే వివరణేది..
నోట్లరద్దు, జీఎస్టీల కారణంగా ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో మంచి జరుగుతుందని చెప్పుకొచ్చిన సర్కారు వర్గాలు.. ప్రస్తుతం ఎదురైన స్వల్ప ప్రతికూలత నేపథ్యంలోనే ముఖం చాటేయడం పట్ల దేశ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలనాటి మాటలే నిజమైతే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మౌన సమాధానం ఎందుకన్నది వారి ప్రశ్న. మోడీ ధైర్యంగా దేశ ప్రజల ముందుకు వచ్చి ఆర్థిక వ్యవస్థలో భరోసా నింపాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే మార్కెట్లు పతనమవడంతో పాటు అంతర్జాతీయంగా దేశ ఆర్థిక ప్రతిష్ట కూడా దిగజారుతోంది. ఈ నష్టం మరింతగా పెరగక ముందే ఈ ప్రధాని మౌనం వీడాలని.. కల్పించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.