Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టాలను తట్టుకోలేక తప్పకొన్న 'టాటా'
- జియోకు పోటీగామార్కెట్లో బలపడనున్న భారతీ
- ఏకీకరణ దిశగా టెలికాం రంగంలో కొత్త అడుగులు
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో కంపెనీల ఏకీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం టెలికం రంగంలో మరో పెద్ద విలీనానికి తెర లేచింది. టాటా టెలీ సర్వీసెస్ సంస్థ వైర్లెస్ వ్యాపారాన్ని టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కొనుగోలు చేయనుంది. దీంతో కనుమరుగు కాబోతున్న టాటా టెలీసర్వీసెస్ సంస్థను ఎవరు కొనబోతున్నారా అన్న ఆసక్తికి తెరపడినట్లయింది. టాటా టెలీసర్వీసెస్ విలీనంపై ఇరు కంపెనీలు గురువారం అధికారికంగా ప్రకటన చేశాయి. టాటా టెలీసర్వీసెస్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్లో విలీనమవుతుందని వెల్లడించాయి. ఈ విలీనంతో టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్ (టీటీఎస్ఎల్), టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్(టీటీఎంఎల్) కంపెనీలు ఎయిర్టెల్ చేతిలోకి వెళ్లనున్నాయి. దీంతో సుమారు 4 కోట్ల మంది వినియోదారులు ఎయిర్టెల్ నెట్వర్క్లోకి అదనంగా వచ్చిచేరనున్నారు. తాజా ఒప్పందం కారణంగా భారతీ ఎయిర్టెల్ మరింత బలోపేతం కానుంది. వరుస నష్టాల నేపథ్యంలో టాటా టెలీసర్వీసెస్ను మూసివేయాలని టాటా గ్రూప్ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో టాటా గ్రూపు గత నాలుగు నెలలుగా భారతీ ఎంటర్ప్రైజ్ అధినేత సునిల్ మిట్టల్తో జరిపిన చర్చలకు సార్థకత ఏర్పడినట్టయింది. ఈ ఒప్పందంలో భాగంగా టాటాకు చెందిన రూ.10వేల కోట్ల స్పెక్ట్రమ్ బాధ్యతను కూడా భారతీ తీసుకోనుంది. టాటా టెలి దేశవ్యాప్తంగా 19 సర్కిళ్లలో 800, 1800, 2100 మెగాహెడ్జ్ బ్యాండుల్లో 178.5 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్ను కలిగి ఉంది. ఈ విషయంపై గురువారం భారతీ బోర్డు సమావేశమై ఈ ప్రతిపాదనను అంగీకరించింది. విలీనం విలువ ఎంతనేది మాత్రం ఇరు కంపెనీలు వెల్లడించలేదు. అయితే ఈ విలీనం రుణ రహిత, నగదు రహితంగా జరగనుందని తెలుస్తోంది. టీటీఎస్ఎల్ రుణాలు, చెల్లింపులు అన్ని టాటా కంపెనీయే సర్దుబాటు చేసుకోనుంది. ఈ విలీనంతో 4జీ విస్తరణలో మరింత బలం చేకూరుతుందని ఎయిర్టెల్ భావిస్తోంది.
అప్పుల భారం..
టాటా టెలీ బ్యాంకులకు రూ.31,000 కోట్లకు పైగా అప్పులు చెల్లించాల్సి ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో టాటా టెలీసర్వీసెస్ ఏకంగా రూ.4,517 కోట్ల నష్టాలను చవి చూసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టం రూ.2,023 కోట్లతో పోలిస్తే నష్టాలు రెట్టింపు అయ్యాయి. టర్నోవర్ రూ.9,419 కోట్లుగా ఉంది. ప్రస్తుతం టెలికం మార్కెట్లో ఈ కంపెనీ మార్కెట్ వాటా 3.5 శాతంగా ఉంది. ప్రస్తుతం టెలికం రంగంలో నెలకొన్ని తీవ్ర పోటీ మరింత నష్టాలకు గురి చేయనుందని, అప్పుల భారం భారీగా పెరగనుందన్న అంచనాల్లో టాటా టెలీ ఈ విభాగం నుంచి వైదొలగడమే ఉత్తమమని భావించినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ముగిసిన 21ఏళ్ల ప్రస్థానం
టాటా టెలీ సర్వీసెస్ సేవల నుంచి వైదొలగాలని టాటా గ్రూపు నిర్ణయించడంతో తన 21 ఏళ్ల వైర్లెస్ ఫోన్ సర్వీసు వెంచర్ ప్రస్థానం ముగిసినట్లయ్యింది. తాము ఈ సేవల నుంచి వైదొలుగుతున్నామని గత వారంలోనే టాటా గ్రూప్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం తాము కలిగి ఉన్న స్పెక్ట్రమ్ హౌల్డింగ్స్ను విక్రయించాలని భావిస్తున్నట్టు తెలిపింది. 149 ఏళ్ల టాటా గ్రూప్ చరిత్రలో తొలిసారి అతిపెద్ద ఒక టాటా గ్రూప్ మూతపడటం ఇదే మొదటిసారి. జనవరిలో 5.19 కోట్ల మంది ఉన్న ఖాతాదారుల సంఖ్య జులై ముగింపు నాటికి 4.2 కోట్లకు పడిపోయింది.