Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనీ కోసం 'మినీ రత్న' విక్రయం
- బిడ్లు ఆహ్వానిస్తూ సర్కారు ప్రకటన
- అంతర్జాతీయ సంస్థలకూ ఆహ్వానం
- వాటాతో పాటు యాజమాన్యం అప్పగింత
- మరో నాలుగు సంస్థల్లోనూ ప్రయి'వేటు'
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: విమానయాన రంగంలో ప్రభుత్వ పాత్రను పూర్తిగా తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియా విక్రయానికి జోరుగా సన్నాహాలు చేస్తున్న సర్కారు.. మరోవైపు ప్రభుత్వ ఆధీనంలోని హెలికాప్టర్ సేవల సంస్థ పవన్ హన్స్ను కూడా ప్రయివేటు చేతికి అప్పగించాలని నిర్ణయించింది. న్యూఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న మినీ రత్న కంపెనీ పవన్ హన్స్లో సర్కారు 51 శాతం వాటా ఉంది. ఇప్పుడు దీనినే పూర్తిగా ప్రయివేటుకు విక్రయించాలని సర్కారు నిర్ణయించింది. వాటా కొనుగోలుకు ఆసక్తి గల ప్రయివేటు సంస్థల నుంచి సర్కారు బిడ్లను ఆహ్వానించింది. దేశీయంగానే కాకుండా విదేశీ సంస్థల నుంచి కూడా సర్కారు బిడ్లను ఆహ్వానించడం విశేషం. పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఈ మినీ రత్న కంపెనీలో చమురు దిగ్గజ సంస్థ ఓఎన్జీసీ 49% వాటాను కలిగి ఉంది. సంస్థలో వాటా కోనుగోలుకు ఆసక్తి గల సంస్థలు డిసెంబరు 8వ తేదీ లోపు బిడ్లు దాఖలు చేయాలని సర్కారు ఒక ప్రకటనలో కోరింది. ముందుగా నిర్ణయించిన వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో వపన్ హన్స్లో వాటాను విక్రయించనున్నట్టుగా సర్కారు ఆ ప్రకటనలో తెలిపింది. వాటా విక్రయంతో పాటు సంస్థ నిర్వహణ నియంత్రణను కూడా తాము కొనుగోలు సంస్థకు అధికారికంగా అప్పగించనున్నట్టు సదరు ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించడం విశేషం.
వరుసబెట్టి అమ్మకం..
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సర్కారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.72,509 కోట్ల మేర నిధుల సమీకరణను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దాదాపు రూ.15,000 కోట్ల మేర నిధులను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ మార్గంలో సమీకరించాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో సర్కారు పన్ను ఆదాయం తగ్గడం, ద్రవ్యలోటు అంతకంతకు పెరుగుతుండడంతో సర్కారు ఇతర ఆదాయ వనరులపై దృష్టి మళ్లించినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే 'డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెష్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్' (డీఐపీఏఎం) సంస్థ చురుగ్గా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయపు ప్రకటనలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత గురువారమే దాదాపు నాలుగు ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మకంగా వాటా విక్రయానికి బిడ్లు ఆహ్వానించిన డీఐపీఏఎం. ఒక్క రోజూ కూడా గడవక ముందే పవన్హన్స్ విక్రయానికి తెరలేపింది. ప్రభుత్వం తన వాటాను మొత్తంగా ఉపసంహరించుకొనేందుకు నిర్ణయించిన సంస్థల్లో 'హాస్పిటల్ సర్వీస్ కన్సెల్టెన్సీ కార్పొరేషన్', 'ఇంజినీర్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్', 'నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన'్తో పాటు 'బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ'లు ఉన్నాయి.
దక్షిణాసియాలోనే అతిపెద్ద సంస్థ..
హెలికాప్టర్ సేవల సంస్థ పవన్హన్స్ 1985 నుంచి తన సేవలను ప్రారంభించింది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా దేశంలో వివిధ రూపాల్లో తనదైన రీతిలో హెలికాప్టర్ సేవలను అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ వస్తోంది. దాదాపు 50కి పైగా హెలికాప్టర్లతో 25 లక్షల ల్యాండింగ్ రికార్డులు ఈ సంస్థ సొంతం. 30 ఏండ్లుగా దేశంలోని మూలమూలకు సంస్థ అంకిత భావంతో హెలికాప్టర్ సేవలను అందిస్తూ వస్తోంది. అత్యధిక ఫ్లీట్తో వపన్హన్స్ దక్షిణాసియాలో దిగ్గజ హెలికాప్టర్ రవాణా సంస్థగా ఎదుగుతూ వచ్చింది. రోడ్డు మార్గంలో చేరలేని ప్రాంతాలకు ప్రయాణికులను, వీఐపీలను, యాత్రికులను చేరవేస్తూ వస్తోంది. ఎక్కువగా రాజకీయ నాయకులకు, ప్రభుత్వ వర్గాలకు, అధికారులకు, చమురు సంస్థలకు వాయు రవాణా సంస్థగా పవన్హన్స్ ఎనలేని సేవలను అందిస్తోంది. లాభాల్లో ఉన్న ఈ సంస్థ 2027 నాటికి తమ ఫ్లీట్ను 100 హెలికాప్టర్ల స్థాయికి పెంచుకొనే దిశగా కృషి చేస్తూ వస్తోంది. తీర ప్రాంతాల్లోనూ విపత్తుల సమయంలో వాయు సేనకు తోడుగా ప్రజలకు సేవలను అందించడం పవన్హన్స్ దేశ సేవలో తన వంతు పాత్రను పోషిస్తూ వచ్చింది. ఇంత మేటి రికార్డు కలిగిన సంస్థను సర్కారు 'స్ట్రాటజిక్ డిజిన్వెష్ట్మెంట్' పేరుతో ప్రయివేటుకు అప్పగిస్తుండడం పట్ల సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.