Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోకు ద్రవ్యోల్బణ గణాంకాలూ ప్రాధాన్యమే
- దీపావళి సందర్భంగా గురు, శుక్రవారం మార్కెట్లకు సెలవు
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికానికి చెందిన బ్లూచిప్ కంపెనీల ఫలితాలు, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లకు కీలకంగా మారనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటితో పాటు పలు దేశీయ అంశాలు, ప్రపంచ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలరుతో రూపాయి మారకం కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి వంటి తదితర అంశాలు మార్కెట్పై తగినంత ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఇక మెరుగైన సూక్ష్మ గణాంకాల నేపథ్యంలో మదుపరులు శుక్రవారం భారీగా స్టాక్స్ కొనుగోలుకు ఆసక్తి చూపారు. దీనికిి తోడు సానుకూల అంతర్జాతీయ పరిణామాలు కూడా తగిన దన్నునివ్వడంతో మార్కెట్లు కొత్త రికార్డులకు చేరువయ్యాయి. దీంతో ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 71.05 పాయింట్లు పెరిగి 10,167.45 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది నిఫ్టీ జీవిత కాలపు గరిష్ట స్థాయి కావడ విశేషం. మరోవైపు బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 250.47 పాయింట్లు రాణించి 32,432.69 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు దీపావళి పండుగ సందర్భంగా గురువారం (19), శుక్రవారం (20న) మార్కెట్లకు సెలవు. అయితే దీపావళి (గురువారం) మూహురాత్ సందర్భంగా ఒక గంట పాటు మార్కెట్లు ట్రేడ్ అవుతాయని మార్కెట్ వర్గాలు పేర్కాన్నాయి. మరోవైపు ఈ వారం స్టాక్ మార్కెట్లు మూడు రోజులకే పరిమితం కానుంది.
కంపెనీల ఫలితాలు
దేశీయ కార్పొరేట్ కంపెనీల ఫలితాల సందడి ఇప్పటికే మార్కెట్లలో మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ వారం దేశీయ అతిపెద్ద మూడో ఐటీ సేవల దిగ్గజం విప్రో ఫలితాలు మంగళవారం (17న) వెలువడున్నాయి. దీంతో పాటు అదే రోజు బజాజ్ ఆటో, ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు, ఏసీసీ ఆర్థిక ఫలితాలు రానున్నాయి. మరోవైపు బుధవారం (18న) అల్ట్రాటెక్ సిమెంట్ తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇటువైపు దృష్టి సారించనున్నారు.
టోకు ద్రవోల్బణం
సెప్టెంబర్ నెలకు సంబంధించిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) గణాంకాలను సోమవారం (16న) ప్రభుత్వం వెల్లడించనుంది. ఆగస్టు నెలలో డబ్ల్యూపీఐ 3.24శాతానికి పెరిగింది. దీంతో ఈ సూచీ నాలుగు నెలల గరిష్టానికి చేరింది. జులైతో పోల్చితే ఈ నెలలో డబ్ల్యూపీఐ భారీగా పెరిగింది. ఈ గణాంకాల నేపథ్యంలో సోమవారం ప్రధాన సూచీలపై తగినంత ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారత ఫైనాన్షియల్, ఇండస్ ఇండ్ విలీన అంశం
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజిన్ సంస్థ(బీఎఫ్ఐఎల్)ను విలీనం చేసుకునే ప్రక్రియపై రమేష్ సోబ్తి సారథ్యంలోని ఇండస్ ఇండ్ బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రతీ వేయ్యి భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజిన్ షేర్లకు గానూ 639 ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లను జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ డీల్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుందని.. ఇదే విషయాన్ని స్టాక్ ఎక్స్ఛ్ంజీల ఫైలింగ్లో బ్యాంకు తెలిపింది. గత కొన్ని రోజులుగా ఇరు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కిరావడంతో ఈ నిర్ణయం ప్రకటించినట్టు బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.
లిస్ట్కు రానున్న గోద్రేజ్ అగ్రోవేట్
గోద్రేజ్ అగ్రోవేట్ ప్రాథమిక స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది. గతవారం పబ్లిక్ ఇనీషియల్ ఆఫర్కు (ఐపీవో) వచ్చిన ఈ కంపెనీ విజయవంతంగా ముగిసింది. రూ.1,157 కోట్ల ఐపీవోకుగానూ ఇన్వెస్టర్ల నుంచి అనుహ్యా స్పందన లభించింది. దీంతో ఈ కంపెనీ ఇష్యూకి 95.41 రెట్లు అధిక స్పందన లభించింది. దీనికితోడు దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండిస్టీస్ ఆకర్షణీయమైన ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవ్సతరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 12.5శాతం వృద్ధితో రూ.8,109 కోట్లకు చేరింది. కాగా కంపెనీ మొత్తం ఆదాయం 24శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ట్రేడింగ్లో ఆ సంస్థ షేర్లు వెలుగులోకి రానున్నాయి.