Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే మూడో అతిపెద్ద ఐటి సేవల సంస్థ విప్రో లిమిటెడ్ బ్యాంకింగ్, ఫైనాన్సీయల్ సర్వీసెస్ విభాగాల్లో మెరుగైన పనితీరు కనబర్చడంతో క్రితం సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయ ఆర్ధిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో 5.5 శాతం వృద్ధితో రూ.2,192 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.2,076 కోట్ల లాభాలు నమోదు చేసింది. గత త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 1 శాతం పెరిగి రూ.13,169 కోట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో ఇది రూ.13,026 కోట్లుగా చోటు చేసుకుంది. కాగా వచ్చే డిసెంబర్ త్రైమాసికంలో ఐటీ సేవల వ్యాపారం నుంచి 2,014 మిలియన్ డాలర్ల నుంచి 2,054 మిలియన్ డాలర్ల రెవెన్యూను విప్రో అంచనా వేస్తుంది. కాగా తాము గత త్రైమాసికంలో 2 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటామని విప్రో సీఈవో అబిదాలి జడ్ నీముచ్వాలా పేర్కొన్నారు. తమ ఎత్తుగడలు ఇందుకు దోహదం చేశాయన్నారు. క్రితం రెండో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 1,66,790 నుంచి 1,63,759కు తగ్గింది. మంగళవారం బీఎస్ఈలో విప్రో లిమిటెడ్ షేర్ 0.19 శాతం తగ్గి రూ.289.50 వద్ద ముగిసింది.