Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ ధరల పోటు మొదలైంది. గత నెలలో (అక్టోబర్లో) రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఏకంగా ఏడు మాసాల గరిష్టానికి ఎగిసినట్టుగా సర్కారు సోమవారం గణాంకాలతో సహా వెల్లడించింది. గత మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.58 శాతానికి పెరిగిందని సోమవారం కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది.ముఖ్యంగా అహారోత్పత్తులు, ఇంధన ధరలు పెరగడమే ఇందుకు కారణమని తన గణాంకాలలో విశ్లేషించింది. ఇంతక్రితం సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణ సూచీ 3.28 శాతంగా నమోదయ్యింది. ధరల పెరుగుదల కారణంగా ఆర్బీఐ వచ్చే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించేందుకు వెనుకడుగు వేయవచ్చన్న అనుమానాలు మొదలయ్యాయి. వచ్చే నెల 6న ఆర్బీఐ తదుపరి విడుత పరపతి భేటీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్లో వినియోగదారుల అహారోత్పత్తుల ధరలు 1.9 శాతం పెరిగాయి. ఇంతక్రితం మాసంలో ఇది 1.25 శాతంగా ఉంది. ఇదే సమయంలో కూరగాయల ధరలు రెట్టింపై 7.47 శాతానికి ఎగిశాయి. సెప్టెంబర్లో వీటి ద్రవ్యోల్బణం 3.92 శాతంగా ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశీయంగా ఇంధన ధరలు అక్టోబర్లో 6.36 శాతం మేర ఎగిశాయి. సెప్టెంబర్లో ఈ సూచీ పెరుగుదల 5.56 శాతంగా ఉంది.