Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరింతగా పతనమైన రూపాయి
- ఆజ్యంపోసిన జీఎస్టీ ఆందోళనలు
- సెన్సెక్స్ 281 పాయింట్లు కిందకి..
ముంబయి : దేశంలో మళ్లీ ద్రవ్యోల్బణం ఎగిసిపడనుందన్న అంచనాలకు తోడు పలు కార్పొరేట్ కంపెనీల నిరాశకర ఆర్ధిక ఫలితాలు ప్రకటించడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అదానీ పోర్ట్సు, కోల్ ఇండియా, ఎల్అండ్టీ, రిలయన్స్ ఇండిస్టీస్ తదితర కంపెనీల షేర్ల అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 300 పాయింట్ల మేర పతనమయ్యింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ ఓ దశలో 35 పైసల మేర క్షీణించడం మదుపర్లను మరింత నిరాశకు గురి చేసింది. తుదకు 25 పైసలు కోల్పోయి డాలర్తో రూపాయి విలువ 65.42 వద్ద నమోదయ్యింది. మరోవైపు జీఎస్టీ కౌన్సిల్ పలు పన్ను రేట్లను తగ్గించడంతో కేంద్రానికి రూ.20,000 కోట్ల ఆదాయం తగ్గనుందని, దీంతో ప్రభుత్వ ద్రవ్య లోటు పెరగనుందన్న అంచనాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ పరిణామాల మధ్య బీఎస్ఈ సెన్సెక్స్ 281 పాయింట్లు క్షీణించి 33,033.56 పాయింట్లకు పడిపోయింది. ఇంట్రా ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా 33,417 గరిష్ట స్థాయిని తాకింది అనంతరం ప్రతికూల ఊహాగానాల మధ్య మరో దశలో 32,999.98 కనిష్ట స్థాయికి కూడా దిగజారి ఆ తరువాత కాస్త కోలుకుంది.
మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 96.8 పాయింట్లు తగ్గి 10,224.95 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈలో రంగాల వారిగా లోహ సూచీ అత్యధికంగా 1.84 శాతం క్షీణించింది. ఇదే క్రమంలో కన్సూమర్ డ్యూరెబుల్స్ 1.76 శాతం, కాపిటల్ గూడ్స్ 1.55 శాతం, రియాల్టీ 1.5 శాతం చొప్పున నష్టపోయి మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. మరోవైపు రియాల్టీ 1.5 శాతం, అదానీ పోర్ట్సు 4.11 శాతం, వోఎన్జీసీ 3.41 శాతం, కోల్ ఇండియా 3 శాతం, హెచ్డీ ఎఫ్సీ 2.15 శాతం, ఎల్అండ్టీ 1.87 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్లో ఉన్నాయి. శుక్రవారం విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.529.22 కోట్ల విలువ చేసే ఈక్విటీలను విక్రయించారు.