Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్ల గరిష్టానికి వాణిజ్య లోటు
- ఆరు నెలల అత్యధికానికి ద్రవ్యోల్బణం
- అంతంత మాత్రంగానే పారిశ్రామిక వృద్ధి
- ఏడు మాసాల ఎగువకు రిటైల్ ఇన్ప్లెషన్
- సేవల రంగంలో పురోగతీ అంతంతే
- స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం
నవతెలంగాణ వాణిజ్య విభాగం: దేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వెలిగిపోతోందని ఊదరగొడుతున్న పాలకుల మాటలు పూర్తిగా నీటి మూటలేనని మరోమారు రుజువైంది. తాజాగా వెలువడుతున్న సూక్ష్మ గణాంకాలు దేశ ఆర్థిక పరిస్థితిలో ఆందోళనకర పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. తాజాగా మంగళవారం కేంద్ర గణాంకాల శాఖ వెలువరించిన లెక్కల ప్రకారం దేశ వాణిజ్య లోటు మూడేండ్ల గరిష్టానికి చేరింది. మరో వైపు హోల్సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ అనూహ్యంగా 3.59 శాతానికి పెరిగి ఆరు నెలల గరిష్ట స్థాయిలో కూర్చొంది. సోమవారం ప్రభుత్వం వెల్లడించిన వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ కూడా 3.58 శాతం మేర ఎగిసి దాదాపు ఏడు నెలల ఎగువకు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశయంగా స్టాక్ మార్కెట్లలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు జంకుతున్నారు. ఇప్పటికే పొజిషన్లలో ఉన్న వారు అధిక ధరల వద్ద స్టాక్స్ను విక్రయించి లాభాలను వెనుకేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో వరుసగా రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
అంతకంతకు పడిపోతున్న ఎగుమతులు
అంతర్జాతీయ మార్కెట్లో భారత ఎగుమతులు క్రమంగా పడిపోతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో ముఖ్యంగా వస్త్ర, ఔషద, తోలు, రత్నాలు, అభరణాల ఎగుమతులు క్షీణించాయి. దీంతో దేశ స్థూల ఎగుమతులు 1.12 శాతం తగ్గి 23 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని కేంద్ర గణంకాల శాఖ మంగళవారం ఒక నివేదికలో విడుదల చేసింది. ఇదే సమయంలో దిగుమతులు 7.6 శాతం ఎగిసి 37.11 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది ఇదే మాసంలో దిగుమతులు 34.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
14 బిలియన్ డాలర్లకు వాణిజ్య లోటు..
ఎగుమతులు తగ్గడం, దిగుమతులు పెరగడంతో గత అక్టోబర్లో వాణిజ్య లోటు 14 బిలియన్ డాలర్లకు ఎగిసింది. దీంతో లోటు మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరినట్లయ్యింది. 2016 ఇదే మాసంలో 11.13 బిలియన్ల వాణిజ్య లోటు నమోదు అయింది. కాగా గత మాసంలో పసిడి దిగుమతులు 16 శాతం తగ్గి 2.94 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు, చమురేతర ఉత్పత్తుల దిగుమతులు వరుసగా 27.89 శాతం, 2.19 శాతం చొప్పున పెరిగి 9.28 బిలియన్లు, 27.83 బిలియన్లకు చేరాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో భారత ఎగుమతులు 9.62 శాతం పెరిగి 170.28 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతులు 22.21 శాతం ఎగిసి 256.43 బిలియన్లుగా ఉన్నాయి. ఈ కాలంలో వాణిజ్య లోటు 86.14 బిలియన్ డాలర్లకు పెరిగాయి. క్రితం అక్టోబర్లో పెట్రోలియం, ఇంజినీరింగ్, రసాయనాల ఎగుమతులు వరుసగా 14.74 శాతం, 11.77 శాతం, 22.29 శాతం చొప్పున పెరిగాయి. వస్తు సేవల పన్ను (జిఎస్టి) అమలులో నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల కారణంగానే ఎగుమతులను దెబ్బతిన్నాయని పరిశ్రమ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
పడకేసిన పారిశ్రామికోత్పత్తి..
దేశీయ తయారీ రంగంలో మందగమన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో తాజాగా ప్రభుత్వం వెల్లడించిన సెప్టెంబరు మాసం గణాంకాల ప్రకారం పరిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 0.5 శాతం మేరనే పెరిగి 5 శాతానికి చేరింది. అంతకు ముందు ఆగస్టు మాసంలో ఇది 4.5 శాతంగా నమోదు అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మొదలు కొని సెప్టెంబరు వరకు అంటే మొదటి ఆరు నెలల కాలానికి విశ్లేషించి చూస్తే ఐఐపీ కేవలం 2.5 శాతం వృద్దిని మాత్రమే నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 5.8 శాతంగా నమోదు అయింది.
సేవలు అంతంతే..
ఎగుమతుల్లో అత్యంత కీలకమైన సర్వీసు సెక్టార్ ప్రగతి అంతంతగానే కనిపిస్తోంది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్లో భారత సర్వీసు సెక్టార్ ఎగుమతులు యథాతథంగా 13.73 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరో నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో సేవల రంగం దిగుమతులు 8.45 బిలియన్ డాలర్లకు చేరినట్లు పేర్కొంది. గతేడాది సెప్టెంబర్లో భారత సేవల ఎగుమతులు 13.77 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో దిగుమతులు 1.7 శాతం పెరిగి 8.30 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి. కాగా 2017 ఆగస్టులో సేవల రంగం ఎగుమతులు 13.7 బిలియన్లుగా, దిగుమతులు 8.66 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో రోజూ ధరల భయం కొనసాగింది. ప్రస్తుత ఏడాది అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ ఏడు నెలల గరిష్టానికి చేరడం, మరోవైపు టోకు ద్రవ్యోల్బణం కూడా ఆరు మాసాల గరిష్టానికి ఎగిసిందన్న గణంకాలు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. ఈ పరిణామాలతో బీఎస్ఈ సెన్సెక్స్ 91.69 పాయింట్లు పతనమై 32,941.87 పాయింట్ల జారింది. అక్టోబర్ 26న సూచీ ఈ స్థాయిలో నమోదయ్యింది. ఉదయం 32,990 వద్ద మొదలైన సూచీ ఓ దశలో 33,126 గరిష్ట స్థాయికి చేరింది. అనంతరం అమ్మకాల ఒత్తిడితో ఓ దశలో 32,907 కనిష్ట స్థాయి వద్ద ట్రేడింగ్ అయ్యింది. సోమవారం సెషన్లో 300 పాయింట్ల మేర కోల్పోయిన విషయం తెలిసిందే. ఎన్ఎస్ఇ నిఫ్టీ 38.35 పాయింట్లు లేదా 0.38 శాతం క్షీణించి 10,186.60 వద్ద ముగిసింది. ఇంట్రా ట్రేడింగ్లో నిఫ్టీ 10,248-10,175 మధ్య ట్రేడింగ్ అయ్యింది.
అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరగనున్నాయని డిబిఎస్ గ్రూపు రీసెర్చ్ ఎకనామిస్టు రాధిక రావు పేర్కొన్నారు. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరుగొచ్చన్న ఊహాగానాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. ధరల పెరుగుదల వల్ల రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్ల కోతకు ప్రధాన అండంకిగా మారనుందన్న సంకేతాలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది.