Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వల్పంగా రేటింగ్ సవరించిన సంస్థ
- బీఏఏ3 నుంచి బీఏఏ2కు అప్గ్రేడ్
- దీర్ఘకాలిక కృషి వల్లేనని వెల్లడించిన సంస్థ
- 13ఏండ్ల కృషితో మేటి రేటింగ్స్లో ఎగువకు
- అంతా తమ గొప్పేనంటున్న మోడీ సర్కారు
- సర్కారుల కృషియేలేనట్టుగా ప్రచారాలు..
- కొత్త రేటింగ్ మూనాళ్ల ముచ్చటే కానుందా!
నవతెలంగాణ, వాణిజ్య విభాగం
అనగనగా ఒక మధ్యతరగతి వ్యక్తి ఉదయం టిఫిన్ చేసి ఉపాధి వేటలో మార్కెట్లోకి బయలుదేరాడు.. మధ్యాహ్నం అయ్యే సరికి ఆయనకు దారిలో ఆకలేసింది.. చేసేది లేక సమీపంలో చిన్న జామ కాయలు లభిస్తే తీసుకొని తినడం మొదలు పెట్టాడు.. బాగా ఆకలితో ఉండడంతో వేగంగా అయిదు కాయలను తినేశాడు. ఆరో కాయ కూడా సగం తినే సరికి ఆయన ఆకలి తీరినట్ట అనిపించింది... కడుపూ నిండిపోయింది. అప్పుడా సదరు వ్యక్తి ఇలా అలోచించడం మొదలు పెట్టాడు.. అరే..! అనవసరంగా మొదట్లో అయిదు కాయలు తిన్నానే.. డబ్బులు దండగయ్యాయి. మొదటే ఈ ఆరో జామ కాయ తినుంటే బాగుండేది. ఆరో జామ కాయ ఎంత గొప్పది.. అయిదు కాయలు చేయలేని పని కేవలం
అమెరికా కేంద్రంగా పని చేసే మూడిస్ సంస్థ శుక్రవారం భారత సావరిన్ రేటింగ్ను స్వల్పంగా సవరిస్తున్నట్టుగా ప్రకటించగానే భాజపా నేతలు చేస్తున్న ప్రచారం చూస్తే పై కథలో అమాయకపు వ్యక్తి గుర్తుకు వస్తోంది. భారత్ తన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకొనేందుకు గత కొంత కాలంగా నిరంతరాయంగా చేపడుతున్న సంస్కరణల మూలంగా రానున్న రోజుల్లో భారత్ మేటి ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని పేర్కొంటూ సావరిన్ రేటింగ్ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచింది. దాదాపు 13 సంవత్సరాల తరువాత మూడీస్ భారత రేటింగ్లో ఈ స్వల్ప సవరణ చేసింది. దీనిని ఆసరాగా చేసుకొని మోడీ సర్కారు వర్గాలు తమ సంస్కరణల మూలంగానే ఈ ఘనత దేశానికి దక్కినట్టుగా ప్రచారం చేస్తున్నారు. మోడీ కంటే ముందు పని చేసిన ప్రభుత్వాలు అసలు సంస్కరణలే చేపట్టనట్టు.. తమ మూలంగానే ఆర్థిక వ్యవస్థ వెలిగిపోనుందన్నట్టుగా వారు ప్రచారం చేస్తున్నారు.
గొప్ప పురోగతేమీ కాదు...
భారత్ నిరంతరాయంగా సంస్కరణల పర్వాన్ని ముందుకు తీసుకుపోతున్న కారణంగానే ఆ దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైన దిశగా సాగుతోందని.. ఇక్కడ పెట్టుబడులు పెడితే గతంలో కంటే కొంత రిస్క్ తక్కువేనని మూడీస్ రేటింగ్ సవరణ అంతర్యం. అంటే మరోవిధంగా చెప్పాలంటే భారత్ గతంలో స్వల్ప కాలిక రుణాలను తీర్చే విషయంలో పరవాలేదు (బీఏఏ-3) అనే స్థాయిలో ఉండేది. ఇప్పుడు దానిని మూడిస్ కొంత మేర సవరిస్తూ స్వల్పకాలిక రుణాలను తీర్చడంలో భారత్ మేటి సామర్థ్యం లేదా పరవాలేదనిపించే సామర్థ్యం కలిగిన దేశం (బీఏఏ-2) అని వెల్లడించింది. దీనిని ప్రభుత్వ వర్గాల వారు గొప్పగా చేసి చూపే ప్రయత్నం మొదలు పెట్టారు. మరోవైపు ఇదే నివేదికలో దీర్ఘకాలిక విదేశీ కరెన్సీ బాండ్ల సీలింగ్ విషయంలోనూ మూడిస్ కొంత మెరుగైన రేటింగ్ను ప్రకటించింది. భారత్ ఈ విషయంలో ఇప్పుడు బీఏఏ2 ర్యాంకులో ఉంది. దీనిని బీఏఏ1కు సవరించింది. దీర్ఘకాలిక కరెన్సీ బ్యాంక్ డిపాజిట్ సీలింగ్ ర్యాంకింగ్ను కూడా బీఏఏ-3 నుంచి బీఏఏ-2కు మార్చింది. మూడీస్ విధించుకున్న మెరుగైన క్రెడిట్ రేటింగ్ విధానాన్ని విశ్లేషించి చూస్తే రేటింగ్ల జాబితాలో అట్టడుగున ఉన్న 10వ స్థానం నుంచి 9వ స్థానానికి భారత్కు ప్రమోట్ అయిందన్నట్టు. బీఏఏ-2కు పైన ఇంకా ఎనిమిది మేటి స్థానాలు ఉన్నాయి. ఒక్క స్థానం పెరిగినందుకే సర్కారు ఏదో ఘనత సాధించినట్టుగా పొంగిపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
వెనువెంటనే అద్భుతాలు జరగకపోవచ్చు..
భారత సంస్థలకు విదేశాల నుంచి రుణాలను తీసుకోవడం సులభం కానుంది. దీనికి తోడు తక్కువ ధరకు విదేశీ అప్పులు విరివిగా లభించే అవకాశం ఉంది. ఫలితంగా మూలధన ఖర్చు దిగిరానుంది. దేశంలోకి గతంలో కంటే మెరుగ్గా ఈక్విటీలు, ఎఫ్డీఐల రాక పెరగేందుకు, రూపాయి మరింతగా బలపడేందుకు ఆస్కారం ఉంది. అయితే ఇది ఆశించినంత త్వరగా కార్యరూపంలోకి వచ్చి ఆర్థిక వ్యవస్థలో అద్భుతం జరిగే అవకాశాలు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గి మందగన పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో విదేశీ పెట్టుబడులకు ఎర్రతివాచీ పరిచి సర్వసౌకర్యాలు కల్పిస్తామని దండోరా వేసినా పెట్టుబడులు అంతగా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మూడిస్ ర్యాంకింగ్ చూసి భారత్కు పెట్టుబడుల రాక పెరుగుతుందనుకోవడం అంత వివేకమైన చర్యకాదనే చెప్పొచ్చు.
రేటింగ్ పెరగడం కేవలం పాలపొంగే..
మూడిస్ సంస్థ భారత సావరిన్ రేటింగ్లో స్వల్ప సవరణ చేసినప్పటికీ అది ఎక్కువ రోజులు నిలిచే అవకాశాలు కనిపించడం లేదు. ప్రధానంగా దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో వేగంగా పెరగుతున్న నిరర్థ ఆస్తుల విషయంలో మూడిస్ ఈ నివేదికలో కొంత ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ దేశంలో ఆర్థిక స్థిరీకరణకు కట్టుబడి పని చేస్తోందని పేర్కొంది. ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు మేటి కృషి చేస్తోందని వెల్లడించింది. అయితే ఇక్కడొక విషయం గుర్తు చేసుకోవాలి భారత్ ద్రవ్యలోటు ఇప్పటికే ప్రమాదకర స్థాయి చేరి నిర్దేశించుకున్న నియంత్రణ లక్ష్యాన్ని దాటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల ప్రభుత్వ బ్యాంకులకు మూలధనీకకరణ కొసం పరోక్షంగా లక్షల కోట్ల వరకు ఉద్దీపన ప్రకటన చేసింది. దీంతో ద్రవ్యలోటు రానున్న కాలంలో మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. బ్యాంకుల ఎన్పీఏలు కూడా అంతకంతకు పెరుగుతుండడం, జీఎస్టీ సమస్యలు కొలిక్కి రాక ఖజానాకు కాసుల రాక తగ్గిపోతుండడం, వృద్ధి రేటు అంచనాలకు మించి తగ్గుతుండడంతో మూడీస్ రేటింగ్ ముచ్చట స్వల్ప కాలానికే పరిమితం కావచ్చన్న భావన స్ఫురిస్తోంది.
గతంలో ఇంతకంటే మెరుగైన రేటింగ్
గ్లోబల్ రేటింగ్ సంస్థ మూడీస్ భారత రేటింగ్ను సవరించడం తమ పని తీరుకపు నిదర్శనం అని మోడీ ప్రభుత్వ అధికారులు మంత్రులు భుజాలు చరుచుకుంటే ప్రకటనలిస్తున్నారు. అయితే గతాన్ని విశ్లేషించి చూస్తే 1988లో రాజీవ్గాంధీ హయాంలో మన ఆర్థిక వ్యవస్థ పనితీరును చూసి ఇదే మూడిస్ సంస్థ భారత్కు ఏ2 రేటింగ్ను ఇచ్చింది. 1984 నుంచి 89 వరకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా కష్టాల్లో కూరుకుపోయిన ఆర్థికాన్ని గట్టెక్కించేందుకు అనేక సంస్కరణలు చేపట్టారే. లైసెన్సు విధానంలో మార్పులు తెచ్చారు. కంప్యూటర్లు, ఫార్మ్, టెక్స్టైల్ సెక్టార్ను సరళీకరణలాంటి నిర్ణయాల తీసుకున్నారు. ఇదే మాదిరిగా 1989-90లో వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు భారత రేటింగ్ బీఏఏ1గా నమోదు అయింది. అంతటే ప్రస్తుత రేటింగ్ కంటే మెరుగైందనన్నట్గు.1991 నుంచి 1994 వరకు,1998 నుంచి 2002 వరకు భారత్ రేటింగ్ బీఏఏ2గా ఉన్నది. ఇది బలహీనమైన రేటింగ్. 1991.94 మధ్య పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో.. 1998.. 2002లో వాజ్పారు ప్రధానిగా ఉన్నప్పుడు బీఏఏ2 రేటింగ్ ఉండేది. ఆ తర్వాత 2002 నుంచి 2004 మధ్య ప్రధానిగా వాజ్పారు హయాంలోనూ రేటింగ్ మెరుగుపడలేదు.ఆరో కాయం సగంలోనే చేసేసింది అనుకున్నాడు ఆ అమాయక వ్యక్తి.