Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: దక్షిణాసియాలో అతిపెద్ద పౌల్ట్రీ ఎక్స్పో హైదరాబాద్లో రేపటి నుంచి ప్రారంభం కానుంది. నగరంలో హైటెక్స్లో 'ఇండియాన్ పౌల్ట్రీ ఇక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్' (ఐపీఈఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ఎక్స్పో బుధవారం (22న) ప్రారంభమై 24 వరకు కొనసాగనుంది. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) ఉపాధ్యక్షుడు కేవీఎస్ సుబ్బరాజు, జోనల్ చైర్మెన్ గుర్రం చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణా పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ఐపీఈఎంఏ అధ్యక్షుడు హరీష్ గర్వేర్ పౌల్ట్రీ ప్రదర్శన విశేషాలను వెల్లడించారు. పౌల్ట్రీ పరిశ్రమలో నూతన పోకడలు, అందుబాటులోకి వచ్చిన సరికొత్త ఉపకరణాలను పరిచయం చేసేందుకు ఈ ప్రదర్శన ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. పౌల్ట్రీ నిర్వహణ, ఆరోగ్యం-పౌష్టికాహరం, పౌల్ట్రీ బ్రీడింగ్లలో కొత్త టెక్నాలజీలతో పాటు పౌల్ట్రీ దాణాలో కొత్త విధానాలను ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయని వారు తెలిపారు. దక్షిణ ఆసియాలోనే అతిపెద్దదైనా ఈ ఎక్స్ఫోలో దేశ, విదేశాల నుంచి దాదాపు 300 కంపెనీలు పాల్గొంటాయని వారు తెలిపారు. మొత్తం అయిదు హాల్స్లలో ఈ ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేశామని, దాదాపు 30వేల మంది వ్యాపార సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్టు వివరించారు.
ఫిబ్రవరిలో గుడ్ల ధరలు దిగిరావొచ్చు
బహిరంగ మార్కెట్లో గుడ్ల ధరలు చుక్కలనంటుతున్న ప్పటికీ వాస్తవంగా రైతుకు మాత్రం ఆమేరకు లాభం లభించడం లేదని పౌల్ట్రీ రంగ ప్రముఖులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా గుడ్ల ధరలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో రైతులు నష్టాల్లోకి జారుకున్నారని వారు అన్నారు. ఒక్కో గుడ్డుకు ఆయ్యే నిర్వహణ వ్యయం దాదాపు రూ.4.00లుగా ఉంటే మార్కెట్లో ధర అంతకంటే తక్కువగా పలుకుతూ వచ్చిందని వారు తెలిపారు. దీంతో నష్టాలు వచ్చినట్టుగా వివరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఉత్పత్తిని తగ్గించేయడంతో డిమాండ్కు తగ్గట్టుగా గుడ్ల సరఫరా జరగడం లేదని వారు తెలిపారు. దీనికి తోడు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు తగ్గిపో వడం, ఉత్తరాదిన చలి ఎక్కువగా ఉండి గుడ్ల వాడకం పెరిగిపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని వారు వెల్లడించారు. ఈ పరిస్థితి మరో మూడు నెలల పాటు కొనసాగే అవకాశ ఉందని వారు అన్నారు. ఫిబ్రవరి నాటికి కోడిగుడ్డు ధరలు దిగిరావొచ్చని వారు వెల్లడించారు.