Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎస్టీ భారం తగ్గించే యోచనలో సర్కారు
- వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు
- ష్వాష్ల ధరలూ దిగివచ్చే అవకాశం!
- 28% శ్లాబ్లో కేవలం విలాస, సిన్ వస్తువులే!
- మరో 100 వస్తువులపై పన్ను తగ్గే అవకాశం
- వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: దేశంలో కొత్తగా అమలులోకి తెచ్చిన వస్తుసేవల పన్నుపై (జీఎస్టీ) అసంతృప్తి పెరుగుతున్న వేళ సర్కారు మరో భారీ వెనుకడుగుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గత వారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భాగంగా దాదాపు 178 వస్తువులను తక్కువ శ్లాబ్లోకి మార్చిన ప్రభుత్వం.. ఇప్పుడు తదుపరి దిశగా మరిన్ని వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. గౌహతిలో జరిగిన సమావేశంలోనే వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రుల నుంచి తీవ్ర అసంతృప్తి వచ్చిన నేపథ్యంలో సర్కారు జీఎస్టీ హేతుబద్ధీకరణలో భాగంగా పలు వస్తువులపై పన్ను భారాన్ని తగ్గిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కౌన్సిల్కు హామీ ఇచ్చినట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే త్వరలో జరగనున్న తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎలక్ట్రానిక్ గృహోపకరణాలపై పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం 28 శాతం పన్ను శ్లాబ్లో ఉన్న వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్స్, డిష్ వాషర్లపై జీఎస్టీ పన్ను భారం తగ్గనుంది. ఈ క్రమంలోనే విద్యుత్ ఉపకరణాలు, కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ పన్ను రేట్లు 18 శాతానికి దిగిరానున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే రిఫ్రిజిరేటర్లు, ఎసిలు, వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్స్ తదితర గృహోపకరణాల ఉత్పత్తులు ఇకపై ఖరీదు వస్తువుల జాబితా నుంచి రద్దు కానున్నాయి. అన్ని రకాల కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తే, దేశీయ తయారీదారులకు ఎంతో మేలు చేకూర్చినట్టు అవుతుందని డెలాయిట్ ఇండియా పార్టనర్ ఎంఎస్ మని పేర్కొన్నారు. దీంతో ధరలు తగ్గడానికి అవకాశం ఉందన్నారు. అదే విధంగా డిమాండ్ పుంజుకుంటుందని తెలిపారు.
పన్ను తగ్గాలంటూ పెరుగుతోన్న డిమాండ్
జీఎస్టీలో భాగంగా తొలత సర్కారు పలు శ్లాబుల్లో ప్రజోపయోగకరమైన వస్తువులను చేర్చుతూ వచ్చింది. అయితే వీటిపై అసంతృప్తి జ్వాలలు పెరుగుతున్న వేళ సంస్థ ఒక్కొక్క మెట్టు దిగుతూ ఆయా వస్తువులపై పన్ను భారాన్ని తగ్గిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా అత్యధిక (28%) పన్ను శ్లాబ్ పరిధిలో ఉన్న వస్తువులను కేవలం 50కి పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే వీటిలో కూడా చాలా వస్తువులు సాధారణ ప్రజలు ఉపయోగించే విభాగంలో ఉండడంతో వాటిని కూడా తక్కువ పన్ను శ్లాబ్లోకి మార్చాలన్న డిమాండ్ రాష్ట్రాల నుంచి వినవస్తోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో కేంద్రం మరో మెట్టు దిగిరానున్నట్టుగా సమాచారం. తాజా జీఎస్టీ హేతుబద్దీకరణ చర్యల్లో భాగంగా 28% పన్ను శ్లాబ్లో కేవలం విలాసవంతమైన వస్తువులు, పొగాకు ఉత్పత్తుల వంటి సిన్ వస్తువులను మాత్రమే కొనసాగిస్తూ.. మిగతా వస్తువులను 18 లేదా 12 శాతం పన్ను శ్లాబ్లో చేర్చాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఇదే జరిగితే వినియోగదారులకు జీఎస్టీ నుంచి పెద్ద ఊరటే లభించినట్టువుతుంది. జీఎస్టీ అమలు తీరును పర్యవేక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సూచనలు చేసేందుకు గాను జీఎస్టీ కౌన్సిల్ ప్రతినెల సమావేశమవుతూ వస్తోంది.
మరో 100 వస్తువుల జీఎస్టీ తగ్గించాల్పిందే
ఎక్కువగా ప్రజలు వినియోగించే దాదాపు మరో 100 వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించాలని రాష్ట్రాలు ప్రధానంగా కోరుతున్నట్టుగా సమాచారం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, బీజేపీయేతర రాష్ట్రాల నుంచి ఈ తరహా డిమాండ్లు ఎక్కువగా వస్తున్నాయి. వచ్చే కౌన్సిల్ సమావేశంలో సర్కారు ఈ దిశగా సమాలోచనలు జరిపి సానుకూల నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 28 శాతం పన్ను శ్లాబ్లో ఉన్న వస్తువులను సర్కారు ఎక్కువగా తగ్గిస్తూ వస్తోంది. అయితే రాష్ట్రాలు దీనిని ఆక్షేపిస్తూ వస్తున్నాయి. పెద్ద పన్ను పరిధిలోని వస్తువులపై జీఎస్టీ భారాన్ని తగ్గించడం వల్ల సంపన్నులు, సంపన్న-మధ్య తరగతి ప్రజలకు మాత్రమే మేలు జరుగుతోందని.. పేదలకు పెద్దగా ఒరిగేది ఏమి లేదన్నది రాష్ట్రాల వాదన. పేదలకు మేలు చేసేలా 18 శాతం, 12 శాతం పన్ను శ్లాబ్లలో వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించాలని ఆయా రాష్ట్రాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. గుజరాత్లో ఎన్నికల నేపథ్యంలో త్వరలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సర్కారు ప్రజలకు పెద్ద ఊరటినిస్తున్న భావన తెచ్చేందుకు గాను కొన్ని వస్తువులపై పన్ను భారం తగ్గించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.