Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2030 నాటికి 100 శాతం విద్యుత్తు వాహనాలు
- కరెంటు బండ్లతో ఖజానాకు మేలు
- భారత్కు రూ.20,00,000 కోట్లు మేర ఆదా
- కొత్తగా 4.60 కోట్ల ఈవీలు వ్యవ్థలోకి..
- దేశంలో భారీగా తగ్గనున్న వాయు కాలుష్యం..
- పెరగనున్న ఉపాధి, ఉద్యోగావకాశాలు
నవతెలంగాణ - బిజినెస్ డెస్క్: దేశంలో విద్యుత్తు వాహనాలను (ఈ-వాహనాల) అందుబాటులోకి తెచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇంధన వనరులు తరిగిపోతుండడం.. ప్రజల రవాణా అవసరాలు అంతకంతకు పెరుగుతుండడం.. వాయు కాలుష్యం.. నేపథ్యంలో సర్కారు విద్యుత్తు వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ విషయమై ఇటీవలే ప్రభుత్వం వాహన తయారీ సంస్థలతో ఒక సమావేశం ఏర్పాటు చేసిన ఉపరితల రవాణా శాఖ రానున్న దశాబ్దం, దశాబ్దపునర కాలంలో దేశంలో కొత్తగా వచ్చే వాహనాలన్నీ నూటికి నూరు శాతం కరెంటుతో నడిచేవిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు దేశంలో అత్యున్నత విధానపరమైన నిర్ణయాలు తీసుకొనే నితి ఆయోగ్ సంస్థ కూడా ఈ దిశగా మార్గనిర్దేశకాలను జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లోనూ ఇదే తరహా ఆలోచనలు సాగుతున్నాయి. మరికొన్ని దేశాలైతే ఇప్పటికే ఈ దిశగా తమ కార్యాచరణను మొదలు పెట్టేశాయి.
భారత ఖజానాకు భారీ మేలు..
2030 నాటికి దేశంలో పూర్తిగా విద్యుత్తు వాహనాలనే మార్కెట్లోకి తేవాలన్న తలంపుతో సర్కారు చర్యలు చేపడుతుండగా.. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు గాను కంపెనీలు కూడా ఈ దిశగా ఇప్పటికే పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. 2030 నాటికి పూర్తిగా విద్యుత్తు వాహనాలను రాక మూలంగా భారత ఖజానాకు రూ.20,00,00కోట్ల మేర ఇంధన భారం తగ్గనుందని ఫీక్కీ తన తాజా నివేదికలో తెలిపింది. ఫిక్కీ-రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్లు సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం రానున్న దశాబ్ద కాలంలో భారత జనాభా మరో 60 కోట్ల మేర పెరగనుందని.. ఫలితంగా రోజుకు మరో 50 కోట్ల ట్రిప్పుల మేర ప్రయాణ అవసరాలు పెరగనున్నట్టుగా ఈ నివేదిక లెక్కగట్టింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ప్రజా రవాణాను మెరుగు పరచాల్సిన అవసరం ఎంతగానో ఏర్పడనుందని నివేదిక తెలిపింది. విద్యుత్తు వాహనాలు, మెట్రో, భాగస్వామ్య ప్రయాణాలకు రానున్న రోజుల్లో బహుళ ఆదరణ లభించే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా 4,60,00,000 మేర విద్యుత్తు వాహనాలు కొత్తగా అవసరమయ్యే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. 2030 నాటికి ద్విచక్ర, తిచక్ర వాహనాలతో సహా కార్లు, బస్సులు అన్ని కలుపుకొని 4.6 కోట్ల వాహనాలు అవసరం కావచ్చని తెలిపింది.
కొత్తగా కొలువులు అందుబాటులోకి..
విద్యుత్తు వాహనాల రాక మూలంగా కొత్తగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న సంప్రదాయం ఫిల్లింగ్ స్టేషన్లలో.. విద్యుత్తు బ్యాటరీ చార్జీంగ్ సౌకర్యాలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. విద్యుత్తు చార్జీంగ్ అంత ప్రమాదకరం కాకపోవడంతో ఔత్సాహికులు ఎవరు ముందుకు వస్తే వారికి చార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకొనేందుకు సర్కారు అనుమతులు జారీ చేయాలని మార్గనిర్దేశకాల్లో ఉంది. దీంతో కొత్తగా లక్షలాది చార్జీంగ్ కేంద్రాలు దేశంలో అందుబాటులోకి రానున్నాయి. వీటికి తోడు బ్యాటరీల నిర్వహణ. కొత్త టెక్నాలజీల కారణంగా కొత్తగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
ధర ఎక్కువైనా.. సబ్సిడీతో సాకారం..
ప్రస్తుతం మార్కెట్లో పలు సంస్థలు ఈ-వాహనాలను తయారు చేసి అందుబాటులోకి తెచ్చాయి. అయితే వీటి ధర సాధారణ వాహనాల కంటే దాదాపు 10 నుంచి 40 శాతం వరకు ఎక్కువ పలుకుతోంది. బ్యాటరీ ధరలు అధికంగా ఉండడం వల్ల రానున్న రోజుల్లోనూ ఇదే ధోరణి కనిపించే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లోనైనా ఈ-వాహనాలు సామాన్యుడికి అందేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే సర్కారు ఈ-వాహన ప్రోత్సహక చర్యల్లో భాగంగా పలు విద్యుత్తు వాహనాలకు సబ్సిడీలను ప్రకటించనుంది. దీంతో ఇప్పుడున్న సాధరణ ధరల కంటే స్వలం అధిక మొత్తంలో ఈ -వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటిని కొనడమే కొంత భారమనినిర్వహణ ఖర్చులు చాలా వరకు తగ్గిపోతాయి కావున అత్యధికులు వీటిని ఇష్టపడే అవకాశం ఉందని వారు ఆటో నిపుణులు చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా వెలుస్తోన్న చార్జింగ్ కేంద్రాలు..
ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పరొషన్ (ఐవోసీ) దేశ ఇంధన వనరుల పంపిణీ చరిత్రలో సరికొత్త అధ్యయానికి తెర తీసింది. నాగపూర్లో ఈ చమురు సంస్థ దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహన చార్జీంగ్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. నాగపూర్ నగరంలోని ఒక పెట్రోలు బంకులో ఐవోసి సంస్థ వోలాతో కలిసి ఈ చార్జీంగ్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. కాగా ప్రయివేటు రంగం ఆధ్వర్యంలో ఇప్పటికే చార్జింగ్ స్టేషన్లు వెలయడం మొదలైంది. నాగపూర్లో ఏసీఎమ్ఈ గ్రూపు నాగపూర్లో విద్యుత్తు చార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు టాటా పవర్ సంస్థ గత రెండు నెలల క్రితమే ముంబయిలో తొలి ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్కు శ్రీకారం చుట్టింది. ఈ కేంద్రాలలో బ్యాటరీ చార్జింగ్తో పాటు, బ్యాటరీ పరిస్థితి ఎలాగుందో కూడా తనిఖీ చేసుకోవచ్చు.
రెండేండ్లలో మారుతీ నుంచి..
దేశంలో కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ మరో రెండేండ్లలో భారతీయ మార్కెట్లోకి విద్యుత్తు వాహనాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతీ మాతృ సంస్థ అయిన సుజుకీ ఇందు కోసం టయోటా మోటార్స్తో జట్టుకటింది. అనుకన్న ప్రకారం ప్రణాళికలు అమలైతే రెండేండ్లలోపే మారుతీ నుంచి ఈ-వాహనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మారుతీ నుంచి ఈ-వాహనం అందుబాటులోకి వస్తే.. అది మార్కెట్లో కొత్త అధ్యయనానికి, పోటీకి తెర తీస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఒక్క చార్జింగ్తో 800 కి.మీ.
విత్యుత్తు వాహనాలు అనగానే చాలా మందికి అపోహలు కలగడం సహజమే. ప్రధానంగా పెట్రోలు, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఈ వాహనాలు పెద్దగా మైలేజీనివ్వవని.. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కాలం నిలవదని.. బ్యాటరీలు అస్తమానం మొరాయిస్తాయన్న అనుమానాలు కలగడం సహజమే.. అయితే దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు ఈ దిశగా పరిశోధనలు జరిపి మేటి బ్యాటరీలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. దీనికి తోడు కేవలం కొన్ని నిమిషాల్లోనే బ్యాటరీలు చార్జింగ్ అయ్యేలా అధునాత సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. షెవర్లే వంటి సంస్థలు అత్యాధునిక బ్యాటరీలతో ఇప్పటికే పలు వాహనాలను మార్కెట్లోకి తీసకురాగా.. ఇజ్రాయెల్కు చెందిన స్టార్డాట్ సంస్థ కేవలం అయిదు నిమిషాల్లో చార్జ్ అయ్యే ప్లాష్ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లిథియం ఆయాన్ బ్యాటరీ కంటే కూడా ఈ బ్యాటరీ ఎన్నో రెట్లు మెరుగైంది. ఈ సూపర్ ఫాస్ట్ బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 480 కి.మి.ల మేర పరుగులు పెడుతుంది. అమెరికా కార్ల కంపెనీ ఫిస్కర్ ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసి నిమిషం చార్జింగ్తో దాదాపు 500 మైళ్లు (800 కి.మీ.) ప్రయాణించగల కారు బ్యాటరీని తాము అందుబాటులోకి తేనున్నట్టుగా ప్రకటించింది. ఈ బ్యాటరీ ఒక్కసారి అందుబాటులోకి వస్తే పరిశ్రమ వర్గాలు దీనిని ఆదర్శంగా తీసుకొని తమ ఉత్పత్తులను రూపొందించి మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాయన్నది కాదనలేని సత్యం.