Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాటుకు సమ్మతి తెలిపిన క్యాబినెట్
- 2020 నాటికి సర్కారుకు సిఫారసులు
న్యూఢిల్లీ: దేశంలో 15వ ఆర్థిక సంఘం (ఫైనాన్షియల్ కమీషన్) ఏర్పాటుకు గాను కేంద్ర క్యాబినెట్ బుధవారం పచ్చజెండా ఊపింది. దేశంలో పన్ను ఆదాయ వనరులను అధ్యయనం చేయడంతో పాటు.. వచ్చిన ఆదాయాన్ని ఏ దామాషా పద్ధతిలో రాష్ట్రాల మధ్య పంపిణీ జరపాలనే అంశంపై సిఫారసులు చేసేందుకు ఆర్థిక సంఘం ప్రధానంగా పని చేయనుంది. ఆర్థిక సంఘం సభ్యుల వివరాలను రానున్న రోజుల్లో వెల్లడించనున్నట్టుగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ క్యాబినెట్ సమావేశం అనంతరం ఇక్కడ వెల్లడించారు. 2020 ఏప్రిల్ నాటికి 15వ ఆర్థిక సంఘం తన సిఫారసులను అంజేస్తుందని ఆయన వివరించారు. రాజ్యంగంలోని 280 అధికరణ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్ను ఆదాయం పంపిణీకిగా ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం తప్పని సరి. దేశ వ్యాప్తంగా కొత్తగా జీఎస్టీని అములోకి వచ్చిన నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం ఏర్పాటు కావడం విశేషం. జీఎస్టీలో పన్ను ఆదాయం పంపిణీ విధానాన్ని పరిగణనలోకి తీసుకొంటూ..కొత్తగా అందుబాటులోకి రానున్న ఆర్థిక సంఘం తన సిఫారసులను రూపొందించాల్సి ఉంటుంది. 2013 జనవరి 2న ఏర్పాటైన 14వ ఆర్థిక సంఘం 2015 ఏప్రిల్ - 2020 మార్చి మధ్య కాలానికి పన్ను వనరులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్ను ఆదాయ వనరుల పంపిణీకి సంబంధించిన సిఫారసులు చేసింది.
దివాలా చట్ట సవరణకు ఆర్డినెన్స్..
దివాలా చట్టంలో పలు సవరణలు చేసేందుకు గాను సర్కారు త్వరలోనే ఒక ఆర్డినెన్స్ను తీసుకురానున్నట్టుగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. డిసెంబరులో అమలులోకి వచ్చిన ఈ కోడ్లో పలు లోటుపాట్లను గుర్తించిన సర్కారు వీటిని సమర్థంగా ఎదుర్కొన్ని చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను పలు సవరణలు చేయాలని నిర్ణయించిందని.. వీటికి క్యాబినెట్ బుధవారం సమ్మతి తెలిపినట్టుగా ఆయన వివరించారు. ఆర్డినెన్స్ తెచ్చేందుకు కూడా సర్కారు తన అంగీకారం తెలిపినట్టుగా వెల్లడించారు.
ఐరోపా బ్యాంకులో సభ్యత్వానికి ఓకే..
ఐరోపా అభివృద్ధి- పునర్నిర్మాణ బ్యాంకులో భారత్ సభ్యత్వాన్ని పొందేందుకు కూడా కేంద్ర క్యాబినెట్ సమ్మతి తెలిపింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి జైట్లీ ఇక్కడ వెల్లడించారు. దీనికి తోడు న్యాయమూర్తుల వేతన సవరణతో పాటు పలు అంశాలకు క్యాబినెట్ ఓకే చెప్పింది.
షరతులతో వేతన సవరణలకు సై!
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈ) పని చేస్తున్న శ్రామికుల (వర్క్మెన్) వేతన సవరణకు సంబంధించిన తాజా విధివిధా నాలకు క్యాబినెట్ బుధవారం సమ్మతి తెలిపింది. దీంతో దేశంలో దాదాపు 9.35 లక్షల మంది శ్రామికులకు లబ్ది కలిగేలా వేతన సవరణ చర్చలు మొదలు పెట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే ఇందులో సర్కారు పలు మెలికలు పెట్టింది. వేతన సవరణకు సంబంధించి జరపనున్న ఎనిమిదో దశ చర్చలకు సమ్మతి నిస్తున్నామని ప్రకటిస్తూనే.. మరోవైపు ఇందుకు ఎలాంటి బడ్జెట్ కేటాయింపులుండవని తేల్చి చెప్పింది. వీటికి సంబంధించిన ఆర్థిక భారాన్ని మొత్తం ఉత్పత్తి వ్యయంపై భారం పడకుండా ఆయా సంస్థలే అంతర్గత సమీకరించుకోవాలని తెలిపింది. అనుమతి పొందిన పునర్నిర్మాణం, పునరుద్ధరణ ప్రణాళికల ఆధారంగానే కొత్త వేతన సరవణ చర్చలు జరగాలని సూచించింది. మరోవైపు సవరణలు సంబంధిత సంస్థల అధికారుల, ఎగ్జిక్యూటివ్లు, సంఘటిత సూపర్వైజర్ల వేతనాలకు మించి ఉండకూడదనే నిబంధననూ పెట్టింది.