Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరుంధతి భట్టాచార్య..
దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి 208 ఏళ్ల చరిత్ర కలిగిన అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ 'భారతీయ స్టేట్ బ్యాంక్' (ఎస్బీఐ) ఛైర్మన్. ప్రస్తుతం దేశంలో బ్యాంకింగ్ సంచలనం. కాలంతో పాటు వస్తున్న మార్పులకు అనుగుణంగా బ్యాంకింగ్ సేవలకు టెక్నాలజీని జోడిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలను పొందుతున్న అతి శక్తిమంతమైన మహిళ. జనరల్ ఇన్ష్యూరెన్స్, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, టచ్ టెక్నాలజీ, కియోక్కీ విధానంతో క్యాష్లెస్ బ్రాంచీ ద్వారా బ్యాంక్ ఖాతా తెరిచే సౌలభ్యాలతో ఖాతాదారు మనసును దొచుకోవడంతో పాటు పేద ప్రజలకు కూడా వాటిని చేరువ చేసేందుకు విశేషంగా కృషి చేస్తున్న ఘనాపాటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ బ్యాంకింగ్ సేవలను దేశంలో అందుబాటులోకి తేవడంతో పాటు వాటిని మన దేశీయ పరిస్థితులకు తగ్గట్టుగా మార్చి.. మన ప్రజలకు అందుబాటులోకి తేవడంలో అరుంధతి భట్టాచార్య చేస్తున్న కృషిని దేశీయంగానే కాకుండా విదేశాలు మెచ్చుకుంటున్నాయి. ఏ విషయాన్ని అయినా నిక్కచ్చిగా చెప్పే భట్టాచార్య 'బ్యాంకు లాభాలలో మూడు శాతాన్ని ఉద్యోగులకు ఇవ్వలంటూ' ప్రభుత్వానికి సిఫారసులు చేసి సంచలనంగా నిలిచారు . స్కూల్ స్థాయిలో యావరేజ్ స్టూడెంట్గా ఉన్న అరుంధతి, నేడు ప్రపంచంలో అతి శక్తిమంతమైన మహిళగానూ.. ప్రభావశీల వ్యక్తిగానూ.. మంచి అమ్మగానూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది.
చదువు విలువ తెలుసుకొని..
బెంగాళీ కుటుంబంలో పుట్టిన బట్టాచార్య బాల్యం బొకారలో గడిచింది. ఉన్నత విద్య కోసం ఆమెను కోలకతాకు మార్చారు. అయిదో తరగతి వరకు యావరేజ్ స్టూడెంట్గానే ఉన్న తన జీవితం సెయింట్ క్సావియర్ పాఠశాలలో చేరిన తరువాత పూర్తిగా మారిపోయిందని ఆమె అంటారు. ఒక క్రమ పద్దతిలో ఎదగడం అనేది.. చదువు విలువను ఆ పాఠశాలే తనకు నేర్పిందని భట్టాచార్య చెబుతారు. తండ్రి బిలాయి ఉక్కు కర్మాగారంలో ఇంజినీర్గా ఉన్న తండ్రి తనను ఎప్పుడూ ఇంజినీర్ కావాలని ఒత్తిడి తేలేదని ఫలితంగానే తాను ఈ ఉన్నత స్థాయికి చేరగలిగినట్లు అరుధంతి అంటారు.
అనుకోకుండానే బ్యాంకింగ్ రంగంలోకి..
ఉన్నత చదువులు చదువుతున్న సమయంలోనే తాను స్నేహితులతో కలిసి హాస్టల్లో ఉండేదానినని ఇక ఉద్యోగ వేట మొదలు పెడుదామని నిర్ణయించుకున్న సమయంలో స్నేహితుల ద్వారా ఎస్బీఐలో ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని సమకాలీన విషయాలపై అవగాహన కోసం ఒక చిన్న జీకే బుక్ చదివి ఉద్యోగ పరీక్షకు సన్నద్ధమైంది. అప్పట్లో బ్యాంకింగ్ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేందుకు ఎలాంటి ఇన్స్టిట్యూట్లు, విద్యా సంస్థలు లేవు. పరీక్ష బాగే చేసి అనుకన్నుట్లుగానే గ్రూపు డిస్కషన్స్, ఇంటర్వ్యూలను బాగా ఎటెంప్ట్ చేసి ప్రొహబీషనరీ ఆఫీసర్గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. తనకు జీవితంలో అదే మొదటి ఉద్యోగమని.. బహుశా అదే చివరిది కూడా కావచ్చని ఆమె నవ్వుతూ చెబుతారు. ఎంఏ ఇంగ్లీషు చదివిన తాను మొదట ప్రింగ్ జర్నలిస్ట్ కావాలని కనీసం ఒక పుస్తకమైనా రాయాలన్న జీవితాశయంగా ఉండేదని భట్టాచార్య చెబుతారు. అనుకోకుండా తాను ఈ రంగంలోకి అడుగు పెట్టానని అయితే మనం చేపట్టే ఏ పనైనా దానాని పూర్తి నిబద్దతతో పూర్తి చేసేందుకు శ్రమించాలని ఆమె యువతకు సూచిస్తారు. ఇదే సూత్రంతో 1977లో ఎస్బీఐలో బ్యాంకు ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన అరుంధతి భట్టాచార్య తన 37 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో చేపట్టిన ప్రతి హోదాలోనూ తన కంటూ ఒక ప్రత్యేకతను చూపుతూ.. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం 208 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన 'భారతీయ స్టేట్ బ్యాంక్' (ఎస్బీఐ) పగ్గాలను చేపట్టి దానిని సమర్థమంతంగా ముందుకు నడిపిస్తున్నారు.
పుస్తక పఠనం అంటే ఇష్టం..
ప్రపంచ మేటి కంపెనీలలో ఒకటిగా ఫార్చూన్ ఎంపిక చేసిన సంస్థకు అధినేత్రిగా నిత్యం బిజీగా ఉండే ఎస్బీఐ ఛైర్మన్కు, తీరిక దొరికే సమయం చాలా తక్కువే. అయితే వీలు దొరికనప్పుడు మాత్రం పుస్తకాలు చదవడం, మంచి సంగీతం వినడం ద్వారా అరుంధతి కొంత స్వేద దీరుతారు. పుస్తక పఠనం అంటే ఇష్టపడే భట్టాచార్య వీలు దొరికితే ఒక్కోసారి రెండు, మూడు పుస్తకాలను చదివేస్తారు. బ్యాంకు ఉన్నతాధికారిగా దేశం మొత్తం పర్యటించే ఎస్బీఐ ఛైర్మన్ తనకంటూ ఏ వంటకంపైనా మక్కువ పెంచుకోలేదు. అయితే ఏ ప్రాంతం వెళ్లినా అక్కడ ప్రత్యేక వంటకాలను మాత్రం రుచి చూస్తారు.
కుటుంబ ప్రోత్సాహం అవసరమే..
జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకొనేందుకు కుంటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా అవరమని భట్టాచార్య అంటారు. తాను ఒక మహిళగా కుటంబం, ఉద్యోగ జీవితాలలో రాణించేందుకు ఒకప్పుడు విశేషంగా కృషి చేసే దానినని.. ఇప్పుడు కుటుంబంతో కలిసి గడిపేందుకు వీలు కుదరడం లేదని అరుంధతి ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అయితే వారు ఎప్పుడు తనను ఈ విషయంలో తప్పుబట్టరని, నా పరిస్థితి అర్థ చేసుకొని ఎప్పుడు ప్రోత్సహిస్తుంటారని చెబుతారు. తన కూతరుతో గడిపేందుకు కావాల్సిన సమయాన్ని కల్పించుకొనేందుకు తాను పనితో యుద్ధం చేస్తుంటనని భట్టాచార్య చెప్పుకొస్తారు. ఎంత ఎస్బీఐ అధినేత్రి అయినా తాను అమ్మె కదా..!
- నవతెలంగాణ, వాణిజ్య విభాగం
ప్రాధాన్యతను ఎంచుకోవడంలోనే గెలుపు..
అతిపెద్ద బ్యాంకు అధినేత్రిగా తాను రోజువారీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తూ ముందుకు వెళతానని గొప్పగా భావిస్తుంటారని, అయితే మన ముందు ఉన్న పనులను లక్ష్యాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో అమర్చుకొని నిర్విరామంగా కృషి చేయడమే తన విజయ రహస్యం అని అరుంధతి భట్టాచార్య అంటారు.చాలా మంది తాను బిజీ అంటూ కొన్ని విషయాలపై దృష్టి కేంద్రీకరించి, మిగతా విషయాలను వదిలేస్తుంటరని సంపూర్ణ విజయానికి ఇది సబబు కాదని అంటారు భట్టాచార్య. తానూ అందరిలాగానే పని చేస్తానని.. అయితే మనకున్న భాధ్యతలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేసుకుంటూ ముందుకు వెళితే విజయం సొంతం చేసుకోవడం కష్టం కాదన్నంది ఎస్బీఐ అధినేత్రి మాట. వాస్తవంగా నువ్వు ఏం చేయాలి..? ఎలా చేయాలి అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని అరుంధతి సూచిస్తారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తమకే సొంతమైన కొన్ని ప్రమాణాలు ఉంటాయని వాటికి తగ్గట్లుగానే జీవించాలి తప్ప సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడి మేరకు కాదని ఆమె చెబుతారు.