Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
- వడ్డీ రేట్ల తగ్గింపునకు అడ్డంకి
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్ధిక వ్యవస్థకు సవాళ్లను విసురనుంది. ప్రజల కొనుగోలు శక్తి హరించనుందని, పెట్టుబడులు కూడా పడిపోనున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తు న్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ఇతర పరిణామాలు దేశంలో ధరలకు ఆజ్యం పోస్తోన్నాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఏడాది నవంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 4.88 శాతానికి చేరి 15 మాసాల గరిష్టానికి ఎగిసింది. ఇంతక్రితం మాసంలో ఇది 3.58 శాతంగా ఉంది. గుడ్లు, కూరగాయల ధరలు నవంబర్ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయి. కోడి గుడ్డు ధరలు 7.95 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 22.48 శాతం ప్రియమయ్యాయి. కాగా ఇంధన ధరలు కూడా 6.36 శాతం నుంచి 7.92 శాతానికి చేరాయి. క్రితం నాలుగైదు మాసాల నుంచి ధరలు వరుసగా పెరుగుతున్నాయి.
అంత సులభం కాదు..
సమీప రోజుల్లో అహారోత్పత్తుల ధరలు తగ్గేలా పరిస్థితి కానరావడం లేదు. అక్టోబర్లో కురిసిన అకాల వర్షాలు అహోరోత్పత్తుల ఉత్పత్తిని దెబ్బతీశాయి. ముఖ్యంగా ఉల్లి, టమాటాల దిగుబడి దెబ్బతినిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా 2015 నుంచి గత ఆగస్టు కాలంలో రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను 200 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. ఇంకా తగ్గించడం అంత సులభం కాకపో వచ్చని విశ్లేషిస్తున్నారు.
విత్త లోటు భయాలు..
అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు ప్రభుత్వాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో సెప్టెంబర్ ముగింపు నాటికే విత్త లోటు రూ.5.25 లక్షల కోట్లకు చేరింది. 2017-18 గాను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించుకున్న దానికి 96 శాతానికి ఇది సమానంగా ఉంది. ఎగుమతులు పడిపోవడం, దిగుమతులు పెరగడంతో పాటు ఇతర దేశీయ పరిణామాలు ద్రవ్యలోటును అమాంతం పెంచుతున్నాయి. కాగా ద్రవ్యోల్బణం పెరుగుదలతో బాండ్లపై పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణాలపై భారం పెరిగితే అంతిమంగా ఆర్ధిక వ్యవస్థపై ఒత్తిడి నెలకొననుంది.