Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జహీరాబాద్ నిమ్జ్లో ఏర్పాటు
- శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రభుత్వం ఒప్పందం
- మౌలిక వసతుల యంత్ర పరికరాల తయారీకి ప్రత్యేక పార్కు
- వచ్చే పదేండ్లలో పదివేల ఉద్యోగాల కల్పనకు అవకాశం : తయారీదారులతో బెంగళూరులో మంత్రి కేటీఆర్ భేటీ
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: తెలంగాణలో మౌలిక వసతుల యంత్ర పరికరాల తయారీ పార్కు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈక్విప్మెంట్ మ్యాన్యుఫాక్చరింగ్ పార్కు) ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. భవన నిర్మాణాలు, ప్రాజెక్టులు, మైనింగ్ వంటి మౌళిక వసతుల పనుల్లో ఉపయోగించే పరికరాల తయారీకి ప్రత్యేకంగా ఒక పార్కును దేశంలోనే మొదటిసారి తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ పార్కు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ (ఒట్టివో ఎకానమిక్్ జోన్స్)తో ఒక అవగాహన ఒప్పందాన్ని బుధవారం కుదుర్చుకున్నట్టు వివరించారు. బెంగళూరులో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్, మ్యాన్యుఫాక్చరింగ్ జోన్లో ఈ తయారీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ యంత్ర పరికరాల తయారీ యూనిట్ల కోసం పార్కు ఏర్పాటు చేస్తారని మంత్రి తెలిపారు. కాగా ఈ రంగంలో పేరుగాంచిన ఒరిజినల్ ఈక్విప్మెంట్ మేకర్స్ (ఓఈఎమ్) దీంట్లో తయారీ యూనిట్లను నెలకొల్పుతాయని ఆయన వివరించారు. ప్రభుత్వం, శ్రేయి ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు అయ్యే ఈ పార్కులో పెట్టుబడిదారులు, కార్మికులు, కస్టమర్లకు అవసరమైన (వర్క్ టు ప్లే పద్ధతిన ఏర్పాటయ్యే ఈ పార్కులో) అన్ని సౌకర్యాలు ఉంటాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పార్కు ద్వారా రానున్న పదేండ్లలో ప్రత్యేక, పరోక్షంగా కలిపి సూమారు 10 వేల ఉద్యోగాలు కల్పించే వీలుంటుందన్నారు. మరోపక్క ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ పార్కులో పెట్టుబడులతో వచ్చే తొలి 5 యాంకర్ పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇచ్చే సాధారణ రాయితీలకు అదనంగా మరిన్ని ప్రోత్సాహాకాలు అందిస్తామన్నారు. ఇప్పటికేే ఈ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయన్న మంత్రి ఈ నేపథ్యంలో రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా పార్కుకు సంబంధించిన భూసేకరణ పూర్తయిందని త్వరలోనే ఈ తయారీ పార్కును లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉపాధ్యక్షులు సునీల్ కనోరియా మాట్లాడుతు గత రెండున్నర దశాబ్దాలుగా తమ కంపెనీ మౌలిక వసతుల రంగంలో అనేక పెట్టుబడులు పెడుతోందన్నారు. విప్లవాత్మకమైన పాలసీలతో ముందుకు వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఈ పార్క్ ఏర్పాటు చేయటం పట్ల కనోరియా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మౌలిక వసతుల యంత్ర పరికరాల తయారీదారులతో భేటీ ఆయ్యారు. ఈ సందర్భంగా యంత్ర పరికరాల తయారీని ఇక్కడే చేపడితే అన్ని విధాల కలిసి వస్తుందని మంత్రి కేటీఆర్ తయారీదారులకు సూచించారు. కాగా వీటి కొనుగోలులో తెలంగాణ ప్రముఖ స్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు.
మౌలిక వసతుల కల్పనతోనే దేశాభివృద్ధి..
మౌలిక వసతుల కల్పన ద్వారా మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి కెటి రామారావు అన్నారు. బుధవారం జరిగిన ఎక్స్కాన్-2017 సదస్సులో భాగంగా నిర్వహించిన నెక్ట్స్జెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారానే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. రానున్న ఎక్స్ కాన్ సదస్సును హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి నిర్వాహకులను కోరారు.