Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రియాల్టీని కూడా చేర్చే అవకాశం
- శ్లాబు రేట్లు దిగిరావొచ్చు
- 28% పన్నులో మార్పులకు ఛాన్స్..
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గత జులై నుంచి ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులు కూడా రావొచ్చని బిహార్ ఆర్ధిక శాఖ మంత్రి సుశీల్ మోడీ అన్నారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్, రియల్ ఎస్టేట్, స్టాంప్ డ్యూటీ, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీలో భాగం కావొచ్చన్నారు. ఇది తమ జీఎస్టీ కౌన్సిల్ భావనగా కూడా ఉందన్నారు. అయితే ఎప్పటి కల్లా ఇవి జీఎస్టీ పరిధిలోకి వస్తాయే ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. చట్టాన్ని మార్చకుండానే ఈ ఉత్పత్తులను జీఎస్టీలో భాగం చేయడానికి వీలుందన్నారు.
ఒక వేళ పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకువస్తే అధిక పన్ను శ్లాబులోకి రావొచ్చన్నారు. అదే విధంగా రాష్ట్రాలు తమ స్వతంత్రతను, రెవెన్యూను కాపాడుకోవడానికి ప్రత్యేకంగా లెవీ సెస్లను ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కూడా ఉండొచ్చన్నారు. ప్రస్తుతం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెట్రోలియం నుంచి 40 శాతం వరకు రెవెన్యూ ఆర్జిస్తున్నాయి. ప్రస్తుత పన్ను వసూళ్లు స్థిరత్వంలోకి వస్తే శ్లాబులను కూడా తగ్గించే అవకాశం ఉందని ప్రధానీ మోడీ ఇది వరకే సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు జీఎస్టీలో 0 శాతం, 5, 12, 18, 28 శాతం చొప్పున ఐదు శ్లాబులు అమల్లో ఉన్నాయి. కొన్ని ఉత్పత్తులపై అదనంగా జీఎస్టీ సెస్ను కూడా విధిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ పన్ను రేట్లలో మార్పులు, చేర్పులపై తుది నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్దేనని సుశీల్ పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణంలో అధిక పన్ను శ్లాబు 28 శాతాన్ని 25 శాతానికి తగ్గించే అవకాశాలు ఉన్నాయన్నారు. అదే విధంగా 12 శాతం, 18 శాతం పన్ను రేట్లను విలీనం చేసి ఒక్కటిగా కూడా మార్చే యోచన ఉందన్నారు. ప్రస్తుతం జీఎస్టీ నెట్వర్క్ను ఇన్ఫోసిస్ రూపొందించడంతో పాటుగా ఆ కంపెనీనే నిర్వహిస్తుంది.
ఈ ఎంపిక సరైందేనని, ఇన్ఫోసిస్ బెస్ట్ కంపెనీ అని అభిప్రాయపడ్డారు. ఈ మధ్య కాలంలో జీఎస్టీ నిర్వహణలో చాలా లోపాలు తలెత్తాయి. కొన్ని సార్లు రిటర్నింగ్ గడువు సమయంలో విఫలమైంది. దీంతో సుశీల్ ఇన్ఫోసిస్ను సమర్థిస్తు ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీఎన్ సామర్థ్యంలో ఇప్పటి వరకు కేవలం 30 శాతాన్ని మాత్రమే ఉపయోగించుకున్నామన్నారు. జీఎస్టీ అమలు, నిర్వహణ ప్రాథమిక దశలోనే ఉన్నందున దీని పనితన విచక్షణను నిర్ధారించలేమని జమ్మూ, కాశ్మీర్ ఆర్ధిక శాఖ మంత్రి హసీబ్ డ్రబు పేర్కొన్నారు. గత నాలుగు నెలల్లో 3.20 లక్షల రిటర్న్స్ ఫైల్ అయ్యాయన్నారు. దీన్ని మరింత సులభతరం చేయాలన్నారు. అదే విధంగా రిఫండ్, ఇన్పుట్ ట్యాక్స్లను వెంటవెంటనే అందించాలన్నారు. గత కొన్ని నెలలుగా రెవెన్యూలో పెద్ద పెరుగుదల లేదన్నారు. కాగా ఈ లావాదేవీలు పెద్ద అనుకున్న స్థాయిలో, ప్రపంచీకరణ, సరళీకరణకు సరిపోయే విధంగా లేవన్నారు. కాని కొంత ఆర్థిక వ్యవస్థను హేతుబద్ధీకరించే విధంగా ఉందన్నారు.