Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 216 పాయింట్లు ర్యాలీ
ముంబయి : గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం దక్కనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు శుక్రవారం స్టాక్ మార్కెట్లకు ఊపునిచ్చాయి. హిమాచల్ప్రదేశ్లోనూ బీజేపీ గెలుపొందవచ్చన్న అంచనాలతో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపరు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 216.27 పాయింట్లు పెరిగి 33,462.27కు చేరింది. ఈ సూచీ ఇంట్రా ట్రేడింగ్లో 33,621 నుంచి 33,406 మధ్య కదలాడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 81.15 పాయింట్లు ర్యాలీతో 10,333.25 వద్ద ముగిసింది. బీఎస్ఈలో రంగాల వారిగా లోహ సూచీ 2.82 శాతం, రియాల్టీ 1.96 శాతం, కన్సూమర్ డ్యూరెబుల్స్ 1.66 శాతం, ఆటో 1.33 శాతం చొప్పున రాణించి మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. ఎంఅండ్ఎం 3.27 శాతం, బజాజ్ ఆటో 2.81 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 2.06 శాతం, అదానీ పోర్ట్సు 1.84 శాతం, కోల్ ఇండియా 1.81 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. హెచ్యూఎల్ 0.9 శాతం, సిప్లా 0.84 శాతం, ఓఎన్జీసీ 0.62 శాతం, ఎన్టీపీసీ 0.45 శాతం, ఏషిియన్ పెయింట్స్ 0.39 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్లో ఉన్నాయి.
పసిడి ధర డౌన్..
బంగారం ధరలు వరుసగా పది రోజుల నష్టాల అనంతరం గురువారం ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ పరిస్థితులు, యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల నేపథ్యంలో శుక్రవారం నాటి బులియన్ ట్రేడింగ్లో పసిడి ధర మరోసారి పడిపోయింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.155 తగ్గి రూ.29,510కి చేరింది. ఆభరణాల తయారీదారులు, అంతర్జాతీయ పరిస్థితులు బంగారం ధర క్షీణతకు కారణమయ్యాయని బులియన్ ట్రేడింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క వెండి ధర భారీగా కుంగింది. కిలో వెండి రూ.480 తగ్గి రూ.37,800లకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ పరిస్థితులు, యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లను పెంచటంతో బులియన్ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసిందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 0.22శాతం తగ్గి 1,252.70 డాలర్లకు పరిమితమైంది. వెండి కూడా ఔన్సు 1.06శాతం తగ్గడం ద్వారా 15.80 డాలర్లకు చేరింది.