Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ ప్రవేశపెట్టిన కొత్త రూ.500 నోట్ల ముద్రణకు భారీ ఎత్తునే ఖర్చు అయ్యిందని ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పి రాధా క్రిష్ణన్ తెలిపారు. ఈ నోట్ల ప్రింటింగ్కు రూ.5000 కోట్ల వరకు ఖర్చు అయిందని మంత్రి అన్నారు. డిసెంబర్ 8 వరకు 1,695.7 కోట్ల రూ.500 డినామినేషన్ నోట్లను ప్రింట్ చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ నోట్ల మొత్తానికి రూ.4,968.84 కోట్ల వరకు ఖర్చు అయ్యిందన్నారు. అదేవిధంగా 365.4 కోట్ల రూ.2000 నోట్లను ఆర్బీఐ ప్రింట్ చేసిందన్నారు. వీటి కోసం రూ.1,293.6 కోట్లను ఖర్చు చేసినట్టు తెలిపారు.
రూ.7961 కోట్ల అప్రకటిత ఆదాయం..
డీమానిటైజేషన్ తర్వాత ఆదాయపు పన్ను విభాగం (ఐటీ శాఖ) భారీగా అప్రకటిత ఆదాయాన్ని గుర్తించినట్టు సోమవారం ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది నవంబర్ నుంచి మార్చి వరకు దేశవ్యాప్తంగా రూ.7,961 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని ఐటీ శాఖ బట్టబయలు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి.రాధాకృష్ణన్ లోక్సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
గతేడాది రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ దాదాపు 900 మంది వ్యక్తులు, సంస్థలపై దాడులు నిర్వహించినట్టు మంత్రి వివరించారు. ఈ సోదాల్లో రూ.900 కోట్ల విలువ చేసే ఆస్తులను స్వాధీనం చేసుకోగా..రూ.7,961 కోట్లు బయటకు వెల్లడించిన ఆదాయాన్ని గుర్తించినట్టు తెలిపారు.