Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా 'డోనర్' తెగదెంపులు
- రుణం లభించకపోవడంతో వెనక్కి..!
- కార్మైకెల్ ప్రాజెక్టుపై నీలినీడలు
ముంబయి : ఆస్ట్రేలియాలోని బొగ్గు గని ప్రాజెక్టు విషయంలో అదానీ గ్రూపు తీవ్ర భంగపాటును ఎదుర్కొందని తెలుస్తోంది. ఈ దేశం క్వీన్స్లాండ్లోని కార్మైకేల్ గనికి విత్త సంస్థల నుంచి అప్పులు పుట్టకపోవడంతో ప్రాజెక్టు పురోగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఈ ప్రాజెక్టుకు అక్కడి ప్రజలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. గౌతమ్ అదానికి చెందిన ఈ ప్రాజెక్టు కోసం 2014లో అదానీ గ్రూపు కార్మైకెల్ గనుల నిర్వహణను ఆస్ట్రేలియా కంపెనీ డోనర్కు అప్పగించింది. ఇందుకోసం ఆ కంపెనీకి 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.13,000 కోట్లు) ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
తాజాగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు ఇరు కంపెనీలు ప్రకటించాయి. కాగా 2018 మార్చి 31 వరకు మాత్రం డోనర్ తన మద్దతును కొనసాగించనుంది. ఒప్పందం నుంచి డోనర్ వైదొలిగినప్పటికీ అదానీ తిరిగి ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్టు విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ రద్దు తమ అంకిత భావాన్ని దెబ్బతీయలేదని అదానీ గ్రూపు పేర్కొంది. ఇది కేవలం యాజమాన్య మార్పు మాత్రమేనని తెలిపింది. ఈ గని అభివృద్ధిని కొనసాగిస్తామని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి కూడా తీవ్ర వివాదం అవుతుంది. దీని వల్ల ఆ ప్రాంత పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని చాలా కాలం నుంచి అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెరిటేజీ దెబ్బతింటుందని వారి వాదన. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 800 మందిని తీసుకుంది. అయినప్పటికీ ఇది కష్టాల్లో ఉంది. ఎన్ని సవాళ్లు వచ్చినప్పటికీ భారత్, ఆస్ట్రేలియా ప్రభుత్వాల మద్దతుతో 2020 కల్లా ఉత్పత్తి సాధిస్తామని గత అక్టోబర్లో ఆ కంపెనీ ప్రకటించింది. ఏడాదికి ఈ ప్రాజెక్టుతో 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని అదానీ లక్ష్యంగా పెట్టుకుంది.
కార్మైకెల్ ప్రాజెక్టుకు రుణాలు ఇవ్వడానికి అంతర్జాతీయ విత్త సంస్థలు వెనక్కి తగ్గాయి. ముందుగా ఎస్బీఐ నుంచి బిలియన్ డాలర్ల అప్పు పొందడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం దీనిపై వివాదాలు తలెత్తడంతో ఆ రుణం కూడా పెండింగ్లో పడిపోయిందని తెలుస్తోంది. చైనాకు చెందిన రెండు ప్రభుత్వ బ్యాంకులను అదానీ గ్రూపు రుణం కోసం అభ్యర్థించగా, తొలుత ముందుకు వచ్చినప్పటికీ తాజాగా అవి కూడా వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం అప్పులు పుట్టక, ఈ ప్రాజెక్టు తీవ్ర ఒత్తిడిలో ఉందని తెలుస్తోంది. అయినా అదానీ గ్రూపు ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తామని విశ్వాసం వ్యక్తం చేయటం గమనార్హం.