Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తృతీయ త్రైమాసిక లాభాల్లో 38% వృద్ధి
- రూ.17,794 కోట్లకు రెవెన్యూ
- ఏప్రిల్లో రోడ్ మ్యాప్: కొత్త సీఈవో సలీల్ వెల్లడి
బెంగళూరు: దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో భళా అనిపించింది. మార్కెట్ వర్గాల అంచనాలకు మించి లాభాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో ఇన్ఫీ 37.6 శాతం వృద్ధితో రూ.5,129 కోట్లు సాధించింది. రూ.3800 కోట్లకు అటు, ఇటూగా లాభాలు ఆర్జించవచ్చని విశ్లేషకులు తొలుత అంచనా వేశారు. కాగా సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ.3,726 కోట్ల లాభాలు నమోదు చేసింది. గత క్యూ3లో కంపెనీ రెవెన్యూ 3 శాతం పెరిగి రూ.17,794 కోట్లకు చేరింది. 2017-18లో ఈ కంపెనీ రెవెన్యూలో 5.5-6.5 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో తాము పటిష్ట వృద్ధిని సాధించామని ఇన్ఫోసిస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. గతేడాది ఇదే త్రైమాసికం ఫలితాలతో పోల్చితే 8 శాతం వృద్ధి చోటు చేసుకుందన్నారు. ఆపరేటింగ్ మార్జిన్లలో ఏకంగా 24.3 శాతం పెరుగుదల ఉందన్నారు. వచ్చే ఏప్రిల్లో కంపెనీ ప్రాధాన్యతలపై రోడ్మ్యాప్ను ప్రకటించనున్నామని సలీల్ చెప్పారు. ఇందులో ఖాతాదారులు, ఉద్యోగుల బలోపేతానికి ప్రణాళికలు ప్రకటించనున్నామన్నారు. అదే విధంగా కంపెనీకి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టనున్నామన్నారు. శుక్రవారం బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్ విలువ 0.26 శాతం పెరిగి రూ.1,078.40 వద్ద ముగిసింది.
1200 చేరువలో క్లయింట్లు..
డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ నికరంగా 3,251 మంది ఉద్యోగులను తీసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2.01 లక్షలకు చేరింది. గత మూడో త్రైమాసికంలో కొత్తగా 100 మిలియన్ డాలర్ల విలువ చేసే ఒక క్లయింట్ను పొందింది. 75 మిలియన్ల విలువ చేసే మూడు క్లయింట్లు, 50 మిలియన్ల కేటగిరీలో ఒక్క ఖాతాదారున్ని పొందింది. అదే విధంగా 25 మిలియన్ల కేటగిరీలో 1, 12 మిలియన్ల కేటగిరీలో 12 మంది, 5 మిలియన్ల కేటిగిరీల్లో నలుగురు చొప్పున నమోదు చేసింది. మొత్తంగా సెప్టెంబర్ నాటికి ఉన్న 1,173 కీలక ఖాతాదారులు డిసెంబర్ ముగింపు నాటికి 1,191కి చేరారు.