Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5.21 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
- 17 నెలల గరిష్టానికి చేరిక
- జీఎస్టీ తర్వాత వరుస పెరుగుదల
- కొనుగోలు శక్తికి దెబ్బ..వడ్డీ రేట్ల తగ్గింపునకు అడ్డంకి
- బడ్జెట్కు ముందు ధరాఘాతం
నవతెలంగాణ - బిజినెస్ డెస్క్
ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో ధరల రాకాసి కోరలు తెరుస్తోంది.కేంద్ర బడ్జెట్కు ముందు ధరాఘాతంలా తగిలినట్టయింది. కాగా ఆహారోత్పత్తులు, చమురు ధరలు అమాంతం పెరగడంతో క్రితం డిసెంబర్లో వినియోగదారుల రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) అమాంతం 5.21 శాతానికి ఎగిసిందని శుక్రవారం కేంద్ర గణంకాల శాఖ స్వయంగా వెల్లడించింది. దీంతో ద్రవ్యోల్బణం సూచీ 17 మాసాల గరిష్ట స్తాయికి చేరినట్లయింది. కాగా 2017 నవంబర్లో సీపీఐ 4.88 శాతంగా నమోదయ్యింది. 2016 ఇదే డిసెంబర్లో 1.37 శాతంగా ఉంది. గత నెలలో కూరగాయలు, గుడ్లు, పండ్ల ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయి. గత డిసెంబర్లో కూరగాయాల ధరలు ఏకంగా 29.13 శాతం పెరిగాయి. ఇంతక్రితం నెలలో 22.48 శాతం ప్రియమయ్యాయి. పప్పుల ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.
ఒకే దేశం ఒకే పన్ను జీఎస్టీతో ధరలు దిగివస్తాయని పదే పదే చెప్పిన మోడీ సర్కార్కు చెంపదెబ్బల ద్రవ్యోల్బణం ఎగిసిపడుతోంది. నోట్ల దెబ్బతో ధరలు పెరగడానికి తోడు జులై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరీ భయానకంగా తయారయ్యింది. జూన్లో 1.54 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ క్రమంగా పెరుగుతూ డిసెంబర్ నెలలో ఏకంగా 5.21 శాతానికి ఎగిసింది. జులై 2016 తర్వాత అత్యధికంగా నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటికే పెరిగిన ధరలు ప్రజల కొనుగోలు శక్తిని హరిస్తున్నాయి. మరింత పెరగడంతో భవిష్యత్తులో ఆర్ధిక వ్యవస్థలో మరిన్ని ప్రతికూల పరిణామాలు చోటు చేసుకోనున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
డిసెంబర్ సీపీఐ 5.10 శాతానికి చేరొచ్చని రాయిటర్స్ పోల్లో అంచనా వేసింది. అంతకంటే ఇంకా ఎక్కువగానే నమోదు కావడం విశేషం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి కాలంలో ద్రవ్యోల్బణం సూచీ 4.3 శాతం నుంచి 4.7 శాతం మధ్య ఉంటుందని రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. మధ్యస్థ కాలానికి స్థూలంగా 4 శాతంగా అంచనా వేసింది. తాజాగా పెరిగిన సిపిఐతో వడ్డీ రేట్ల తగ్గింపునకు ప్రధాన అడ్డంకి కానుంది. వచ్చే ఫిబ్రవరి 7న రిజర్వు బ్యాంకు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. ఇందులో వడ్డీ రేట్లపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
పెరిగిన పారిశ్రామికోత్పత్తి..
గతేడాది నవంబర్లో పారిశ్రామికోత్పత్తి 8.4 శాతానికి పెరిగి 17 మాసాల గరిష్ట స్థాయికి చేరింది. 2016 నవంబర్లో 5.1 శాతం వృద్ధి నమోదయ్యింది. కాగా అక్టోబర్ ఐఐపీని 2 శాతంగా సవరించింది. ఇంతక్రితం దీన్ని 2.2 శాతంగా పేర్కొంది. ఐఐపీలో 77.63 శాతంగా ఉన్న తయారీ రంగం గత నవంబర్లో ఏకంగా 10.2 శాతం వృద్ధిని కనబర్చి, పారిశ్రామికోత్తత్తికి ప్రధాన మద్దతునిచ్చింది. 2016 నవంబర్లో ఐఐపీ వృద్ధి 4 శాతంగా నమోదయ్యింది.
రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ..
జూన్లో 1.54 శాతం
జులైలో 2.36 శాతం
ఆగస్టులో 3.36 శాతం
సెప్టెంబర్లో 3.28 శాతం
అక్టోబర్లో 3.58 శాతం
నవంబర్లో 4.88 శాతం
డిసెంబర్లో 5.21 శాతం