Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకుల్లో అనామతు డిపాజిట్లు
- నాలుగేండ్లలో అప్రకటిత ఖాతాలు రెట్టింపు
- చిరునామా లేని 2.63 కోట్ల ఎకౌంట్లు
- ఎస్బీఐలో మూలుగుతున్న రూ.1,036 కోట్లు : భారతీయ రిజర్వు బ్యాంకు నివేదిక
నవతెలంగాణ- వాణిజ్యవిభాగం
బ్యాంకుల్లో నుంచి తిరిగి తీసుకోని, ఎవరికి చెందినవో సరైన సమాచారం లేని బ్యాంకు డిపాజిట్లు రూ.8,000 కోట్లకు చేరాయి. దాదాపుగా 2.63 కోట్ల ఖాతాలకు దిక్కెవరూ లేరన్నట్లు ఉంది. ఆ బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన వ్యక్తులు లేదా వారసులకు సంబంధించిన వివరాలేవీ బ్యాంకు అధికారుల వద్ద లేవు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రిపోర్టు ప్రకారం గత డిసెంబర్ 16 నాటికి రూ.8,864 కోట్ల విలువ చేసే అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే ఇలాంటి అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు రెట్టింపు అయ్యాయి. 2012-2016 మధ్య కాలంలో ఇలాంటి డిపాజిట్ల విలువతో పాటు ఖాతాలు కూడా రెట్టింపయ్యాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి ఆ తర్వాత ఏళ్ల తరబడి వాటిని తీసుకోవడానికి ఎవరూ రాకపోవడం లేదా ఆ డిపాజిట్దారులకు సంబంధించిన పూర్తి సమాచారం లేకపోతే వాటిని అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తారు.
దేశంలో 2012 నాటికి 1.32 కోట్ల అన్క్లెయిమ్డ్ ఖాతాలు నమోదయ్యాయి. కాగా 2016 నాటికి ఈ సంఖ్య రెట్టింపై 2.63కోట్లకు చేరింది. కాగా ఇదే సమయంలో వారి డిపాజిట్లు కూడా రూ.3,598కోట్ల నుంచి రూ.8,864.6కోట్లకు పెరిగాయి. మరోవైపు ఈ డిపాజిట్లపై బ్యాంకు ఇచ్చే వడ్డీతో ఆ నగదు మరింత పెరుగుతూ వస్తోంది.
పదేండ్లు దాటితే అంతే..
కనీసం 10 సంవత్సరాల పాటు ఒక్క సారి కూడా లావాదేవీ జరపని ఖాతాలను అప్రకటిత డిపాజిట్లుగా పరిగణిస్తారు. పదేండ్ల పాటు ఫిక్సుడ్ డిపాజిట్లు, సేవింగ్, కరెంట్ ఎకౌంట్స్ ఖాతాలను బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు పంపిస్తారు.
కాగా వ్యక్తిగత బ్యాంకుల్లో పదేళ్ల పాటు నిర్వహణలోని ఖాతాలను ఏడాది ముగిసిన తర్వాత 30 రోజుల్లోగా ఆర్బీఐకి సమర్పించాల్సి ఉంటుంది.
వెబ్సైట్లలో వివరాలు..
అన్క్లెయిమ్డ్ బ్యాంకు డిపాజిట్దారుల వివరాలను బ్యాంకు అధికారులు తమ బ్యాంకు అధికారిక వెబ్సైట్లలో ఉంచాల్సిందిగా ఆర్బీఐ సూచించింది. ఈ జాబితాలో తప్పకుండా ఆ డిపాజిట్ చేసిన ఖాతాదారుని పూర్తి పేరు, వివరాలు పొందుపరచాల్సిందిగా ఆర్బీఐ ఆదేశించింది. అలా చేయడం వల్ల వారి వారసులు వివరాలను తెలుసుకోవడం చాలా సులభమవుతోందని ఆర్బీఐ ఉద్దేశ్యం.
స్టేట్ బ్యాంకులో 47 లక్షల ఖాతాలు..
దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థగా ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో అత్యధికంగా 47 లక్షల అన్క్లెయిమ్డ్ ఖాతాలు ఉన్నాయి. వీటి విలువ రూ.1,036 కోట్లుగా ఉంది. అదే విధంగా కెనరా బ్యాంకులో కూడా 47 లక్షల ఇన్యాక్టివ్ ఖాతాల్లో రూ.995కోట్ల నగదు ఉంది. కాగా దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ తరహా 23 లక్షల ఖాతాలు నమోదయ్యాయి. వీటి విలువ రూ.829కోట్లుగా ఉన్నాయి.
ఉచితమేమీ కాదు..
ఇలాంటి అప్రకటిత ఖాతాల్లోని నగదు బ్యాంకులకేమీ ఉచిత సొమ్ము కాదు. సేవింగ్ ఖాతాలపై వడ్డీని ఆ ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. ఫిక్సుడ్ డిపాజిట్లు మ్యాచుర్ అయిన తర్వాత ఖాతాదారు తీసుకోకపోతే ఆ మొత్తాలపై కూడా సేవింగ్ ఖాతాలపై ఇస్తున్న వడ్డీ రేటును అమలు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ మొత్తాలపై ఆర్బీఐకి నగదు నిల్వల నిష్పత్తి కింద 4 శాతం సొమ్మును జమ చేయాల్సి ఉంటుంది. నిర్వహణలోని ఖాతాలపై సరైన ఆడిట్ ఉండాలని 2015లో బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. అయితే ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ఖాతాదారులకు చెల్లించేంత వరకు ఆ నిధులను మాత్రం ఆర్ధిక అక్షరాస్యతకు ఉపయోగించుకోవడానికి వీలుంది. అదే విధంగా డిపాజిట్లపై చైతన్యం, విద్యా ఫండ్ కోసం వాడుకోవచ్చు.