Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ జోక్యం మారుతున్న రిపోర్టులు
- సోషలిస్ట్పార్టీకి చెందిన చిలీ అధ్యక్షురాలి పాలనలో డూయింగ్ బిజినెస్ ర్యాంక్ 25నుంచి 57కు
- వాస్తవ పరిస్థితులు అలా లేవు
- నాలుగేండ్ల ర్యాంకులను మళ్లీ లెక్కిస్తాం: ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ పౌల్ రోమర్
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంకు విడుదలచేసే ప్రధాన నివేదికల్లో డూయింగ్ బిజినెస్ ర్యాంకు ఒకటి. అది ప్రకటించే ఆర్థిక నివేదికలకోసం ప్రపంచవ్యాప్త దేశాలు, మీడియా ఆతృతగా ఎదురుచూస్తుంటాయి. వారి ర్యాంకులను మెరుగుపర్చుకుంటే చాలు అభివృద్ధిని సాధించినట్టే అని ఆలోచించే దేశాలూ ఉన్నాయి. ఈ ఆర్థిక నివేదిక కూర్పు పద్ధతుల్లో కొన్నేండ్ల నుంచి చోటుచేసుకుంటున్న అనేక మార్పుల వల్ల దాని ప్రధాన లక్ష్యమే నీరుగారిపోతోందని ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త పౌల్ రోమర్ వాపోయారు. అసమగ్రత, తప్పుదోవ పట్టించే నివేదిక ఇచ్చినందుకు ఆయన క్షమాపణలు కోరారు. అయితే, ఈ తప్పిదానికి రాజకీయ జోక్యం కూడా దోహదం చేసిందన్నారు. వివిధ దేశాల మధ్య వ్యాపారాల్లో పోటీనేర్పరిచేందుకు విడుదల చేసే 'డూయింగ్ బిజినెస్'(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంక్లను పున్ణప్రక్షాళన గావిస్తామని తెలిపారు. కనీసం నాలుగేండ్ల ర్యాంకులను మళ్లీ గణిస్తామని, దీంతో, అన్ని దేశాల ర్యాంకులు ప్రభావితమవుతాయని ఆయన వాల్స్ట్రీట్ జర్నల్ పత్రికకు వెల్లడించారు. పౌల్ రోమర్ నూతనంగా(2016లో) ప్రపంచబ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రకటనపై ప్రపంచబ్యాంకు వ్యాఖ్యానించబోదని ఆ బ్యాంక్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ నివేదికలకు బాధ్యత వహించాల్సిన మాజీ డైరెక్టర్ లోపేజ్ క్లారోస్ అందుబాటులోకి రాలేదు. 2018 ఏడాదికిగాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులో మన దేశానికి 100వ స్థానం వచ్చిన విషయం తెలిసిందే. 100స్థానాల జాబితాలోకి మనదేశం మొదటిసారి చేరింది. ఈ ర్యాంకు సాధించి నందుకు దేశవ్యాప్తంగా పలువురు హర్షించారు. కేంద్ర ప్రభుత్వ సంస్కరణలతో ఈ ర్యాంకును సాధించామని కొందరు అభిప్రాయపడిందీ విదితమే. ర్యాంకును నిర్ణయించే అంశాలు వేరు కావడం వల్ల గత ర్యాంకులను పోల్చలేం. కానీ, ఒకసారి గమనిస్తే 2016కు 130, 2017కు 130 స్థానాలను సాధించిన భారత్ 2018కి ఏకంగా 30 స్థానాలు ఎగబాకి 100వ స్థానానికి చేరింది. సోషలిస్టు పార్టీకి చెందిన మిషెల్లీ బ్యాచ్లెట్ 2014లో చిలీ దేశ అధ్యక్షురాలుగా పదవిలోకి వచ్చినప్పటినుంచి ఈ పక్షపాత నివేదికలు చిలీ దేశ ర్యాంకును తీవ్రంగా ప్రభావితం చేశాయి. అయితే, ఈ నివేదికలకు బాధ్యత వహించాల్సిన లోపెజ్ కార్లోస్కూడా చిలీ దేశస్థుడు కావడం గమనార్హం. చిలీస్థానం ర్యాంకు మదింపు పద్ధతిలో చోటుచేసుకున్న మార్పుల వల్ల మారింది. కానీ, ఆ దేశంలో వాస్తవ వ్యాపార అనుకూలతకు సంబంధించిన మార్పు కాదని రోమర్ విశ్లేషించారు. చిలీ ర్యాంకు దిగజారడంవెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ర్యాంకులు చెబుతున్నట్టు బ్యాచ్లెట్ పాలనలో వ్యాపార పరిస్థితులేం క్షీణించలేదని ఆయన తెలిపారు. తాను తగిన శ్రద్ధ పెట్టలేదని, ఈ ర్యాంకులు సమగ్రంగా లేవని స్పష్టం చేశారు. ర్యాంకులను మళ్లీ లెక్కించాలన్న తన నిర్ణయంతో ప్రపంచ బ్యాంక్పై పలు సందేహాలకు తెరలేపారు.
డూయింగ్ బిజినెస్ ర్యాంకు గణింపులో ఎలాంటి మార్పులు సంభవించాయి?
ఒక దేశంలో వ్యాపారం నిర్వహించడానికి మెరుగైన అవకాశాలను బట్టి ప్రపంచ బ్యాంకు డూయింగ్ బిజినెస్ ర్యాంకును రూపొందిస్తుంది. ఉదాహరణకు ఒక దేశంలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఎన్ని రోజులు పడుతుంది? వ్యాపార నిర్వహణ ఆమోదపత్రాలకు అయ్యే వ్యయమెంత? లాంటి అంశాలపై ఆధారపడి ఈ ర్యాంకును నిర్ణయిస్తుంది. ఒక వేళ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం కల్పించలేకపోతే ఆ దేశ ర్యాంకు దిగజారుతుంది. అయితే, ఈ ర్యాంకు లెక్కింపులో ప్రపంచ బ్యాంకు మార్పులు చేస్తోంది. ర్యాంకు నిర్ణయించేందుకు కొత్త అంశాలు చేరుస్తున్నది. ఉదాహరణకు నిర్మాణ పనుల ఆమోదం అంశంలో విద్యుత్ సరఫరా, విద్యుత్చార్జీలు, షేర్హోల్డర్లకు అందించే న్యాయ సేవల నాణ్యత, పన్నుల పద్ధతి లాంటివి చేర్చింది. ఈ అంశాల్లోని ర్యాంకులతో తుది ర్యాంకును నిర్ణయిస్తుంది. సరళతర పన్ను విధానం అనే అంశంలో 2015లో చిలీ దేశం 33వ ర్యాంకును పొందగా, అదే అంశానికి కొత్తగా పన్ను ఫైల్ చేశాక ఎన్నిరోజులు పడుతోందనే విషయాన్ని చేర్చింది. దీంతో, ఈ అంశంలో ఆ దేశ ర్యాంకు 2016లో అత్యల్పంగా 120వ స్థానానికి పడిపోయింది.