Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: వరుస లాభాలతో రికార్డు స్థాయిలను తాకిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలు చవి చూశాయి. గతేడాది డిసెంబర్లో భారత వాణిజ్య లోటు 14.88 బిలియన్ డాలర్లకు చేరిందన్న గణంకాలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. 2016 ఇదే మాసంలో 10.54 బిలియన్ డాలర్ల లోటు చేసుకుంది. లోటు భయాలకు తోడు వరుసగా పెరిగిన సూచీల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 72.46 పాయింట్లు తగ్గి 34771.05కు పడిపోయింది. ఇంట్రా ట్రేడింగ్లో 34,936-34,735 మధ్య కదలాడింది. బీఎస్ఈలో రంగాల వారిగా రియాల్టీ 3.51 శాతం, లోహ 2.83 శాతం, పీఎస్యూ 2.26 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.84 శాతం చొప్పున విలువ కోల్పోయి మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. మరోవైపు ఐటీ సూచీ 3.32 శాతం, టెక్ 2.45 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్్లో విప్రో 4.88 శాతం, ఇన్ఫోసిస్ 3.93 శాతం, టీసీఎస్ 3.77 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.43 శాతం, డాక్టర్ రెడ్డీస్ 1.38 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు కోల్ ఇండియా 4.57 శాతం, రిలయన్స్ 2.54 శాతం, టాటా మోటార్స్ 2.3 శాతం, టాటా స్టీల్ 2.16 శాతం, ఐటీసీ 2.06 శాతం చొప్పున అధికంగా అమ్మకాలకు గురైయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం సోమవారం సెషన్లో విదేశీ మదుపర్లు రూ.32.92 కోట్ల ఈక్విటీలు, దేశీయ మదుపర్లు రూ.173.28 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు.
కుంగిన రూపాయి విలువ
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ వెలవెల పోతోంది. క్రితం డిసెంబర్లో భారత వాణిజ్య లోటు మూడు సంవత్సరాల గరిష్టానికి చేరడంతో మంగళవారం రూపాయి విలువ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ నేపథ్యంలోనే డాలర్తో రూపాయి మారకం విలువ 54 పైసలు కోల్పోయి 64.04కు దిగజారింది. ఓ దశలో 60 పైసలు పతనమై 64.09 వద్ద ట్రేడింగ్ అయ్యింది. దేశ కరెంట్ అకౌంట్ లోటు కూడా జీడీపీలో 2 శాతానికి చేరిందని విదేశీ బ్రోకరేజీ సంస్థ నోమురా పేర్కొంది. ఈ ప్రభావం రూపాయిపై ఒత్తిడి పెంచిందని విశ్లేషించింది.