Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్రవ్యోల్బణ సూచీల గందరగోళం
- ఎగిసిన రిటైల్ ధరలు
- దిగివచ్చిన టోకు సూచీలు
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదలపై కేంద్ర గణంకాల శాఖ (సీఎస్వో) పొంతన లేని లెక్కలు ప్రకటిస్తుంది. ఇందుకు నిదర్శనం గత డిసెంబర్ ద్రవ్యోల్బణ సూచీలే నిదర్శనం. ఒక వైపు రిటైల్ ధరలు ఎగిసి పడుతుంటే, మరోవైపు టోకు ద్రవ్యోల్బణం దిగివచ్చిందని వెల్లడించింది. 2017 డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపీఐ) 3.58 శాతానికి తగ్గి మూడు మాసాల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. కాగా ఇదే మాసంలో వినియోగదారుల రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) సూచీ ఏకంగా 5.21 శాతానికి ఎగిసి 17 మాసాల గరిష్ట స్థాయిని తాకింది. కాగా గత మాసంలో రిటైల్ కూరగాయలు, ఇంధన ధరలు అమాంతం పెరిగాయని తొలుత ప్రకటించిన సీఎస్వో ఆ తర్వాత రెండు రోజులకే వెల్లడించిన టోకు ద్రవ్యోల్బణం సూచీలో ఈ ఉత్పత్తుల ధరలు దిగివచ్చాయని పేర్కొంది. టోకు ధరలు దిగివస్తే రిటైల్ ధరలు ఎలా పెరుగుతాయని విశ్లేషకుల సందిగ్దం. వాస్తవానికి టోకు ధరలు పెరగడం వల్లనే రిటైల్ ధరాఘాతం చోటు చేసుకుంటుందనేది అందరికీ తెలిసిన విషయం. కాని మోడీ ప్రభుత్వం ధరలపై తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి టోకు ధరలను తగ్గించి చూపిస్తుందనే విమర్శలు పెరుగుతున్నాయి.
పెరిగిన రిటైల్
క్రితం డిసెంబర్లో వినియోగదారుల రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) అమాంతం 5.21 శాతానికి ఎగిసిందని శుక్రవారం కేంద్ర గణంకాల శాఖ స్వయంగా వెల్లడించింది. 2016 ఇదే డిసెంబర్లో 1.37 శాతంగా ఉంది. గత నెలలో ముఖ్యంగా కోడి గుడ్ల ధరలు అమాంతం పెరగడంతో పాటు కూరగాయల ధరలు ఎగిసిపడి రిటైల్ ధరలకు ఆజ్యం పోశాయి. కూరగాయల ధరలు ఏకంగా 29.13 శాతం పెరిగాయి. ఇంతక్రితం నెలలో 22.48 శాతం ప్రియమయ్యాయి. ఒకే దేశం ఒకే పన్ను జీఎస్టీతో ధరలు దిగివస్తాయని పదే పదే చెప్పిన మోడీ సర్కార్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచే ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గత జూన్లో 1.54 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ క్రమంగా పెరుగుతూ డిసెంబర్ నెలలో ఏకంగా 5.21 శాతానికి ఎగిసింది.
తగ్గిన టోకు..
గతేడాది డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం సూచీ 3.58 శాతానికి తగ్గి, మూడు నెలల కనిష్టానికి దిగివచ్చిందని సోమవారం సీఎస్వో వెల్లడించింది. కూరగాయలు, ఇంధన ధరలు దిగివచ్చాయని దీంతో టోకు ధరలు తగ్గాయని తెలిపింది. ఈ మాసంలో ఉల్లి ధరలు ఏకంగా 197.05 శాతం పెరిగాయి. పండ్ల ధరలు 11.99 శాతం ప్రియమయ్యాయి. అహారోత్పత్తుల ధరలు 6.06 శాతం నుంచి 4.72 శాతానికి తగ్గాయి. ధరల పెరుగుదల అంతిమంగా ప్రజల కొనుగోలు శక్తిని హరిస్తుంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే వడ్డీ రేట్లు తగ్గడానికి, పెట్టుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుందని సూచిస్తున్నారు.