Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు
- 10,788 పాయింట్లకు ఎన్ఎస్ఈ నిఫ్టీ
- 'అదనపు అప్పు'ల్లో కోత మద్దతు
- బ్యాంకింగ్ షేర్ల దన్ను
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన రికార్డులను చేరాయి. సెన్సెక్స్ చరిత్రలోనే తొలిసారి 35వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రభుత్వం అప్పుల సమీకరణ ప్రణాళికలను తగ్గించుకుంటున్నట్టు ప్రకటించడంతో బుధవారం మార్కెట్లు పరుగులు పెట్టాయి. మార్కెట్ బాండ్ల నుంచి అదనంగా రూ.50వేల కోట్లు సమీకరించనున్నట్టు ఇది వరకు ప్రకటించిన ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.20,000 కోట్లకు తగ్గించుకుంటున్నట్టు వెల్లడించింది. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఐటీ షేర్లకు డిమాండ్ నెలకొంది. మరోవైపు క్రితం డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తుండటంతో మార్కెట్లపై ఆశలు మరింత పెరిగాయి. దీంతో విదేశీ, స్వదేశీ మదుపర్లు భారీగా కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ పరిణామాల మధ్య బీఎస్ఈ సెన్సెక్స్ 310.77 పాయింట్లు పెరిగి 35,081కు చేరింది. 34,753 వద్ద మొదలైన సూచీ ఇంట్రా ట్రేడింగ్లో 34,700 కనిష్ట స్థాయిని తాకి అనంతరం కొనుగోళ్ల మద్దతుతో 35,118.61 గరష్ట స్థాయిని తాకింది. జనవరి 15న ఈ సూచీ 34,843.51 గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 88.1 పాయింట్లు పెరిగి 10,788.55కు చేరింది. ఇంట్రా ట్రేడింగ్లో 10,803-10,783 మధ్య నమోదయ్యింది.
రంగాలన్నీ...
బీఎస్ఈలో అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్ సూచీ అత్యధికంగా 1.59 శాతం పెరిగింది. ఇదే క్రమంలో బ్యాంకింగ్ 1.55 శాతం, పీఎస్యూ 1.41 శాతం, ఐటీ 1.28 శాతం చొప్పున రాణించి మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్లో యాక్సిస్ బ్యాంకు 4.65 శాతం, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 3.44 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 2.68 శాతం, ఇన్ఫోసిస్ 2.61 శాతం, యెస్ బ్యాంకు 2.58 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు విప్రో 1.85 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 0.88 శాతం, హీరో మోటో కార్ప్ 0.8 శాతం, ఓఎన్జీసీ 0.74 శాతం, హెచ్యూఎల్ 0.68 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
ఎఫ్ఐఐల కొనుగోళ్లు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయనే అంచనాల్లో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఇంతక్రితం సెషన్లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.693.17 కోట్ల విలువ చేసే ఈక్విటీలు కొనుగోలు చేశారు. కాగా దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.246.38 కోట్ల విలువ చేసే ఈక్విటీలు సొంత చేసుకున్నారు. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 25 పైసల మేర పుంజుకుంది. గతేడాది డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో పెద్ద నోట్లు రద్దు చేయడంతో అప్పుడు చాలా వరకూ కార్పొరేట్ కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆ త్రైమాసికంతో పోల్చితే క్రితం డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండనున్నాయనే సంకేతాలు కలిసి వచ్చాయి.
ఐటీ షేర్ల పరుగు..
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ తగ్గడంతో ఐటీ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో ఐటీ సూచీ వరుసగా ఎనిమిదో సెషన్లోనూ పెరిగింది. ఇన్ఫోసిస్ 3.5 శాతం ర్యాలీ చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2.6 శాతం పెరిగింది. దీంతో ఐటీ సూచీ 1.8 శాతం రాణించింది. ఎన్ఎస్ఈ బ్యాంకింగ్ సూచీలో పీఎన్బీ 6.61 శాతం, బీవోబీ 5.38 శాతం, కెనరా బ్యాంకు 4.49 శాతం, ఎస్బీఐ 4.04 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3 శాతం, యాక్సిస్ బ్యాంకు 2 శాతం చొప్పున రాణించాయి.