Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పబ్లిక్ ఇష్యూకు భారీగా పన్నాగం
- సన్నాహక కార్యక్రమాలు పూర్తి
- 'ఫలితాలు' బాగోలేక వెనకడుగు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) భారీ మోసం కేసులో ప్రధాన నిందితులు నీరవ్ మోడీ, మేహుల్ చోస్కీలు తమ సామ్రాజ్య విస్తరణకు గాను స్టాక్ మార్కెట్లను కొల్లగొట్లాలని ప్రణాళికలు రచించినట్టుగా తెలుస్తోంది. తమకు సంబంధించిన కంపెనీలను పబ్లిక్ ఇష్యూకు తీసుకురావడం ద్వారా నిధుల సమీకరణ జరిపి.. అనంతరం వాటిని స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయాలని వారు భావించినట్టుగా విచారణ ఏజెన్సీల ద్వారా తెలుస్తోంది. అనుకున్న ప్లాన్ వర్కవుట్ అయితే వీరికి సంబంధించిన అనుబంధ సంస్థలు ఈ ఏడాది స్టాక్ మార్కెట్లలోకి అరంగేట్రం చేయాల్సింది. అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారు కావడంతో ఈ ప్లాన్లు పడకెక్కనున్నాయి.
'లాభం' లేకనే వెనుకడుగా..
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, చోస్కీలు వాస్తవానికి ఈ ఏడాది స్టాక్ మార్కెట్లలో అడుగుపెట్టి నిధులను సమీకరిద్దామని అనుకున్నప్పటికీ.. ఆయా సంస్థలు గత ఏడాది కాలంగా అనుకున్న రీతిలో రాణించక పోవడం వల్లే వారు పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనలను వాయిదా వేస్తూ వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధాన వ్యాపార సంస్థల ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే ఇదే విషయం అవగతమ వుతోంది. నీరవ్ మోడీ ప్రధాన వ్యాపార సంస్థ అయిన ఫైర్స్టార్ ఇంటర్నేషనల్ 2015-16 ఆర్థిక సంవత్స రానికి రూ.455 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 27% అధికం. కంపెనీ నెట్వర్త్ మొత్తం రూ.2,808 కోట్లుగా నమోదు అయింది. ఇదే సమయంలో సంస్థ అమ్మకాలు 21 శాతం పెరిగి రూ.12,511 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో ముడి సరుకు విలువే రూ.11,569 కోట్లుగా ఉండడం విశేషం.
పీఎన్బీ రుణ రికవరీ కష్టమే..
మరోవైపు గీతాంజలి జెమ్స్ సంస్థ ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఈ సంస్థ లాభం రూ.595 కోట్లుగా నమోదు అయింది. 2013లో సంస్థ లాభం రూ.166 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో సంస్థ రుణ భారం రూ.5,239 కోట్లుగా నమోదు అయింది.
కంపెనీ అమ్మకాల టర్నోవర్ రూ.16,571 కోట్లుగా ఉన్నప్పటికీ, ముడి సరకు విలువ దాదాపుగా రూ.16,616 కోట్లుగా ఉంది. దీంతో సంస్థ ఆర్థిక పనితీరు బాగులేదని భావించిన మోడీ, చోస్కీలు ఐపీవో ప్లాన్లను పక్కనబెట్టినట్టు సమాచారం.
ఇరు సంస్థల ఆర్థిక పరిస్థితి బయటకు కనిపించినంత ఆరోగ్యకరంగా లేదని ఈ సంస్థల లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఎన్బీకి వజ్రాల వ్యాపారులు చేసిన మొత్తం రుణాలు తిరిగి వసూలు కావడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.