Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోం మంత్రిత్వ శాఖ ఆందోళన
న్యూఢిల్లీ: డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈ-వాలెట్ వంటి డిజిటల్ చెల్లింపులతో మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని కేంద్ర హోం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి మోసాలు అడ్డుకోవడానికి రాష్ట్రాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఇలాంటి మోసపూరిత కేసుల్లో విచారణ సులభతరం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయానికి ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)ను నోడల్ ఏజెన్సీగా హోం శాఖ నియమించింది. మొబైల్ ఫోన్లు, ఈ-వాలెట్లతో కూడిన ఆర్థికమోసాలకు మోసగాళ్లు వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారని హోంశాఖ తెలియజేసింది. డిజిటల్ పేమెంట్ల పెరుగదలతో ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయని స్పష్టం చేసింది. మోసాల పై ఎప్పటికప్పుడు సమీక్షిం చడానికి హోం శాఖ పరిధిలో అంతర్గత మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అన్ని ఈ-వాలెట్ ప్రొవైడర్లు చట్ట అమలు సంస్థలతో సమన్వయంతో ఉండాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సూచించింది. కాగా ఫోన్ మోసాలకు చెక్ పెట్టడానికి వివిధ ఏజెన్సీలతో సమన్వయం కోసం అన్ని రాష్ట్రాల్లో అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించుకోవాలని గతంలో హోంశాఖ సూచించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సమాచార మార్పిడి వ్యవస్థను బలపరుచుకోవాలని సూచించింది. కాగా, ఫోన్ మోసాలు ఎక్కువగా జరిగే గ్రామాలు, పట్టణాల్లో సమన్వయ సంస్థలు తమ కార్యకలాపాలు జరుపుతాయని తెలిపింది