Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2700 స్మార్ట్ ఫోన్ .. రూ.500కే ఇచ్చే యోచన
- కస్టమర్లను తిప్పుకొని, మార్కెట్ వాటాను సొంతం చేసుకోవడమే లక్ష్యం!
- రీచార్జ్ ప్లాన్తో సబ్సిడీ సొమ్ము రికవరీకి యత్నాలు..
- మూడేండ్ల పాటు ఒకే ఆపరేటర్ ను కస్టమర్ వాడుతాడా?
- అంచనా తప్పితే, పరిశ్రమకు పాతిక వేల కోట్లు నష్టం..
దేశంలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో 2జీ కనెక్టివిటీ కూడా సరిగ్గా లేదు. 3జీ నెట్ వర్క్ ద్వితీయ శ్రేణి మొదలు పైపెచ్చు నగరాలకే పరిమితం. ఇక 4జీ సేవలు అన్ని పట్టణాల్లో పూర్తి స్థాయిలో విస్తరించనూ లేదు. ఐతే, జియో అరంగేట్రం చేసినప్పటి నుంచి భారత టెలికాం రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉచితంగా అన్ లిమిటెడ్ ఫోన్కాల్స్, మెసేజ్లతో పాటు పలు ఆఫర్లను జియో సంస్థ ప్రకటించడమే గాక, రూ.1500 సెక్యూరిటీ బాండ్తో పూర్తి ఉచితంగా 4జీ ఫీచర్ ఫోన్ను సైతం అందిస్తున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో.. భారత్లో టాప్ ఆపరేటర్లు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ తదితర సంస్థలు ఫీచర్ ఫోన్ల కన్నా తక్కువ ధరకే ( ఈ ధర రూ.500గా ఉండొచ్చు) 4జీ స్మార్ట్ ఫోన్లను అందించేందుకు హ్యాండ్సెట్ కంపెనీలతో చర్చిస్తుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
ఐతే, ఇప్పటికే, ఆర్థికంగా పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయిన టెలికాం పరిశ్రమను ఈ చర్య ఎక్కడికి తీసుకుపోతుందోనని నిపుణులు
ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఐదింతల తక్కువ రేటుకే..
డిసెంబర్, 2017 ట్రారు లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా దాదాపు 119 కోట్ల టెలికాం సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇందులో ఎంతలేదన్నా 78 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వాడుతున్నట్టు తేలింది. మొత్తం వినియోగదారుల్లో సుమారు 65శాతం వాటా కలిగిన ఫీచర్ ఫోన్ వినియోగదారులకు స్మార్ట్ ఫోన్ అనుభవాన్ని కల్పిస్తూ.. తమ వైపు తిప్పుకోవాలన్న ఉద్దేశంతో.. దేశంలోని వివిధ టెలికాం ఆపరేటర్లు రూ.500 కన్నా తక్కువ ధరకే 4జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నాయి. మార్కెట్ లెక్కల ప్రకారం.. ఎంట్రీ-లెవల్ 4జీ ఎనాబుల్డ్ స్మార్ట్ ఫోన్ను తయారు చేయడానికి ఎంతలేదన్నా సగటున 3వేల రూపాయల మేర ఖర్చు అవుతుంది. ఒకవేళ, ఎక్కువ మొత్తంలో బల్క్ గా ఆర్డర్ చేస్తే.. దీని ఖర్చు మరో మూడొందలు తగ్గి రూ.2700గా ఉండే అవకాశం ఉన్నది. కానీ దీని కంటే ఐదింతల తక్కువ రేటుకు అంటే 500 రూపాయలకే 4జీ స్మార్ట్ ఫోన్ను వినియోగదారులకు ఆఫర్ చేస్తామని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. ఐతే, ఇంత తక్కువలో ఫోన్లను అందిస్తే, సంస్థలపై అసలెంత భారం పడుతుందోనన్న విషయాలను ఆయా కంపెనీలు అంచనా వేశాయో లేదోనన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
రికవరీ కాకపోతే.. ఇక, అంతే!
ముందు ప్రకటించినట్టు ఒకవేళ కంపెనీలు వినియోగ దారులకు 500 రూపాయలకే స్మార్ట్ ఫోన్లను అందించడం వల్ల ఆయా మొబైల్ కంపెనీలు దాదాపు 26వేల కోట్ల భారాన్ని భరించాల్సి ఉంటుందని టెలికాం రంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారాన్ని కొంత తగ్గించుకునే ఉద్దేశంతో.. నెలకు 60 రూపాయల రీచార్జ్ ప్లాన్తో ఈ డివైజ్లను టెలి కాం కంపెనీలు ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తున్న ప్పటికీ, మొత్తం సబ్సిడీ సొమ్ము రికవరీ చేసుకోవాలంటే దాదాపు మూడేండ్లకు పైగా ఆయా సంస్థలు వేచి చూడాలి. ఐతే, ఒక కస్టమర్ మాతృ సంస్థ(మొబైల్ ను సబ్సిడీకి అందించిన కంపెనీ) ఆపరేటర్ను చివరివరకు వాడతాడన్న గ్యారెంటీ లేదు. ఒకవేళ, ఇది ఆచరణలో ఏమాత్రం బెడిసికొట్టినా సదరు టెలికాం కంపెనీలు పాతికవేల కోట్ల నష్టాలను చవిచూసే ప్రమాదమున్నది.
చౌక స్మార్ట్ ఫోన్ - ఆసక్తికర అంశాలు
- మోడీ 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి మద్దతుగా.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన(రూ. 251) స్మార్ట్ ఫోన్ అంటూ.. తెరపైకి వచ్చిన 'ఫ్రీడమ్ 251' ఫోన్ ఆదిలోనే బొక్కబోర్లా పడటం విదితమే!
- స్మార్ట్ ఫోన్లను రూ.2వేల లోపు ధరల్లో అందించడం సాధ్యం కాదన్న కంపెనీలు.. ప్రస్తుత మార్కెట్ పోటీ దృష్ట్యా రూ. 500 కంటే తక్కువ ధరకే అందిస్తుండటం విశేషం.
- ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్.. 5జీ టెక్నాలజీతో పనిచేసే ఓ నూతన తరహా స్మార్ట్ ఫోన్ మోడెమ్ను తాజాగా లాంచ్ చేసింది. దీన్ని బట్టి 2019లోనే 5జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లభించే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.