Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందులో ప్రభుత్వ బ్యాంకుల వాటానే అత్యధికం
- ప్రతీ ఏటా పెరుగుతున్న 'రైట్ ఆఫ్'ధోరణి
భారతదేశంలో బ్యాంకుల తీరు ఎంతో ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు గత 5ఏండ్లలో రూ.3.68 లక్షల కోట్లను 'రైట్ ఆఫ్' చేసిపారేశాయి. అంటే...రూ.3.68 లక్షల కోట్ల విలువైన రుణాలు వసూలు చేసుకోలేకపోయామని అధికారికంగా ఒప్పుకొని, రుణ ఖాతాను మూసేయటం. బ్యాంకుల్లో ఈ ధోరణి ప్రతి ఏటా పెరుగుతూ రావటం పట్ల ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాలన్స్ షీట్ను (రాబడి, వ్యయం, పరపతి) మెరుగుపర్చుకోవటం కోసమే 'రైట్ ఆఫ్' చేస్తున్నామని బ్యాంకులు సమర్థించుకుంటున్నాయి. కానీ ఇందులో కనిపించని కుట్రలు, ఆర్థిక మోసాలు దాగి ఉన్నాయన్నది ఆర్థిక రంగ నిపుణుల అంచనా. విజరు మాల్యా కేసే ఇందుకు పక్కా ఉదాహరణ.
న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు 'రైట్ ఆఫ్' చేసిన రుణాల విషయంలో సమాచార హక్కు ద్వారా ఆర్బీఐను ప్రశ్నిస్తే, వచ్చిన సమాధానం '2012-13 నుంచి సెప్టెంబరు 2017 నాటికి రైట్ ఆఫ్ చేసిన రుణాలు రూ.3,67,765 కోట్లు''. కార్పొరేట్ కంపెనీలతో రాజీ ఒప్పందం కుదుర్చుకొని 'రైట్ ఆఫ్' చేసిన మొత్తం కూడా ఇందులోనే ఉంది. రుణాల్ని రైట్ ఆఫ్ అని ప్రకటించటమంటే, వసూలు చేసుకోలేని స్థితి లేదా రుణాలు ఎగ్గొట్టటం.
ఇందులో ఒక్కొక్క కేసు ఒక్కోలా ఉంటుంది. కొన్ని కేసుల్లో రుణ గ్రహీతలతో రాజీ ఒప్పందం కుదురుతుంది. ''మా దగ్గర ఇంతే ఉంది. దీంతో ముగించేయండి'' అంటూ చెప్పేస్తారు. ఆస్తి తనఖా పెడితే...బ్యాంకు దాన్ని వేలం వేసి రుణం కింద జమకడుతుంది. కానీ కింగ్ ఫిషర్ యజమాని విజరు మాల్యా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. రూ.9 వేల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు అప్పులు ఇచ్చాయి. ముంబయిలో అతని స్థిరాస్థుల్ని అమ్మడానికి చూస్తే కొనేనాథుడు లేడు. బ్యాంకులు ఇచ్చినదానికి...వేలం ద్వారా అందుతున్నదానికి పొంతనే లేదు.
ప్రతి ఏటా పెరుగుతున్న 'రైట్ ఆఫ్'లు
'రైట్ ఆఫ్' ఖాతాల వివరాలు తెలపండి' అంటూ...సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్బీఐను సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ కోరారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ బయటపెట్టిన లెక్కలు చూస్తే, ప్రతీ ఏటా బ్యాంకులు చేస్తున్న 'రైట్ ఆఫ్' మొత్తాలు పెరుగుతున్నాయన్న విషయం బయటకొచ్చింది. 2012-13లో రూ.32,127 కోట్లు, 2013-14లో రూ.40,870 కోట్లు, 2014-15లో రూ.56,144 కోట్లు, 2015-16లో రూ.69,210 కోట్లు, 2017-18 తొలి 6నెలల్లో రూ.66,162 కోట్లు...రుణాల్ని పరస్పర ఒప్పందంతో బ్యాంకులు 'రైట్ ఆఫ్' చేశాయి.
అత్యధికం ప్రభుత్వ బ్యాంకులవే...
ఆర్బీఐ ఇచ్చిన సమాచారంలో మరో ఆందోళనకరమైన విషయం, ప్రభుత్వ రంగ బ్యాంకులే అత్యధిక మొత్తంలో రుణాల్ని రైట్ ఆఫ్ చేశాయి. గత 5ఏండ్ల కాలంలో ప్రయివేటు రంగ బ్యాంకులు రూ.64,187 కోట్లు రైట్ ఆఫ్ చేస్తే, ప్రభుత్వ రంగ బ్యాంకులు చేసినవి రూ.3,03,578 కోట్లు. బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం, సహజంగా బ్యాంకులు ఆస్తుల్ని తనఖా పెట్టుకొని రుణాలు ఇస్తాయి. మరి రుణాన్ని చెల్లించకపోతే తనఖా ఆస్తిని అమ్మేసి సొమ్మును రాబట్టుకోవచ్చు కదా ! అంటే ఇక్కడో కిటుకు ఉంది. అదేంటంటే... ముఖ్యంగా బడా కార్పొరేట్ ప్రముఖులు పొందే రుణాల్లో ఆస్థి తనఖా, ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. అయితే ఈ ఆస్తిని విలువ కట్టడంలో 'అతి అంచనా' ఉంటుంది. రాజకీయ, అధికార వర్గాల ఒత్తిడితో విజరు మాల్యా లాంటి వ్యక్తుల ఆస్తి, వ్యాపార విలువ వేల కోట్లలో లెక్కగట్టి రుణాల్ని అందజేశారు. తీరా ఇప్పుడు అమ్మబోతే ఏం జరుగుతోంది. అందులో పదో వంతు కూడా రావటం లేదు.
ఉదాహరణకు ఒక బడా వ్యాపారవేత్త రూ.1000 కోట్లు రుణాల్ని పొంది, చేతులెత్తేశాడు అనుకుందాం. అతని తనఖా ఆస్తిని బ్యాంకు వేలం వేస్తుంది, కానీ అప్పుడు ఆ ఆస్తి, వ్యాపార విలువ రూ.300 కోట్లు చేసిందన్న నిజం బయటపడుతుంది. మరి మిగతా రూ.700 కోట్లు మాటేంటి ? దీనిని ఏదో విధంగా రాబట్టుకోవడానికి బ్యాంకులు అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తాయి. అంటే క్రిమినల్, చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈడీ, సీబీఐ దాడులు చేపడతాయి. కానీ ఏం లాభం. బ్యాంక్ రుణాలు తిరిగి వస్తాయన్న భరోసా ఉండదు.
రూ.700 కోట్లను వసూలు చేసుకోలేక పోయామని బ్యాలన్స్ షీట్లో చూపించుకుంటే సదరు బ్యాంకు పరపతి, వ్యాపారం దెబ్బతింటుంది. షేర్ మార్కె ట్లో స్టాక్ విలువ పడిపోతుంది. దీని నుంచి తప్పిం చుకోవడానికి బ్యాంకులు ఎంచుకున్న మార్గమే 'రైట్ ఆఫ్'. అంటే భౌతికంగా బ్యాలన్స్ షీట్లో ఆ రూ.700 కోట్లను చూపించవు. కానీ అందుకోసం ఏ రాజీ ఒప్పందమో, చట్టపరమైన చర్యలో కొనసాగుతున్నాయని బ్యాంక్ యాజ మాన్యం ప్రకటిస్తుంది. ఇంతటితో ఈ 'రైట్ ఆఫ్' కథను ముగిస్తుంది.
ఈ ధోరణి మంచిది కాదు..
బ్యాంకులు ఇలా రుణ ఖాతాల్ని 'రైట్ ఆఫ్' చేయటం మంచి ధోరణి కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బ్యాంక్ వినియోగదారులకు ఒక తప్పుడు సందేశం అందుతోందని, ఒకనాటికి మొత్తం బ్యాంకు దివాలా తీస్తుం దనివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'రైట్ ఆఫ్' పొంది న వ్యక్తులు, ప్రయివేటు సంస్థలు మరో కొత్త కంపెనీ ఎలా ప్రారంభిస్తున్నారని ఆర్థిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ మోసం, కుట్రం దాగి ఉన్నాయన్న విషయం అర్థమ వుతోందని వారు చెబుతున్నారు. బడా బాబులకు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పులివ్వటం ఎందుకు ? ఇచ్చాక, వసూలు చేసుకోలేక చతికిలపడటమెందుకు ? అన్నది సగటు భారతీయుడికి అర్థం కాని విషయంగా మారింది.