Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గీతాంజలికి ఇద్దరు ఉన్నతాధికారులు గుడ్బై
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంపై నిఘా సంస్థల ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో ఆయా సంస్థల్లోని కీలక ఉద్యోగులు క్రమంగా జారుకుంటున్నారు. కుంభకోణం వెలుగులోకి వచ్చి వారం కూడా కాక ముందే గీతాంజలి జెమ్స్ సంస్థ నుంచి ఇద్దరు కీలక అధికారులు తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. సంస్థ కాంప్లియన్స్ అధికారి పంఖురీ వరేంజ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ చంద్రకాంత్ కర్కరే తమ పదవులకు రాజీనామా చేసినట్లు గీతాంజలి జెమ్స్ స్టాక్మార్కెట్ ఫైలింగ్లో వెల్లడించింది. పీఎన్బీ కుంభకోణం.. దానికి సంబంధించిన దర్యాప్తు నేపథ్యంలో ఈ సంస్థలో కొనసాగేందుకు తన మనసాక్షి ఒప్పుకోవడం లేదని పంఖురి చెప్పారు.
'ఓ కాంప్లియన్స్ అధికారిగా సంస్థ వాటాదారుల పట్ల నాపై కొన్ని బాధ్యతలున్నాయి. ఇటీవల మా సంస్థలో చోటుచేసుకున్న పరిమాణాల వల్ల 2013 కంపెనీల చట్టం, 2015 సెబీ నిబంధనల ప్రకారం మా సంస్థ కొన్ని విషయాలను వెల్లడించాల్సి ఉంది. వీటిని బహిర్గత పరచాలని నేను యాజమాన్యానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాను. కానీ అది జరగలేదు. ఈ కారణాల వల్ల కంపెనీలో కొనసాగేందుకు నా మనస్సాక్షి అంగీకరించట్లేదు. అందుకే నా పదవులకు వెంటనే రాజీనామా చేస్తున్నాను' అని పంఖురి తన రాజీనామాలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. చంద్రకాంత్ కర్కరే మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పారు. 'ఇటీవలే నా భార్యకు మేజర్ సర్జరీ జరిగింది. అయితే ఆ ఆపరేషన్ వల్ల కూడా నా భార్య పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి సమయంలో నేను సీఎఫ్వోగా కొనసాగలేను. అందుకే రాజీనామా చేస్తున్నాను' అని చంద్రకాంత్ పేర్కొన్నారు.