Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గత నాలుగేండ్ల కాలంలో ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాల్ని ఎగవేయటం పెరిగిపోయింది. ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంకునే తీసుకుంటే, 8 నెలల కాలంలో ఉద్దేశకపూర్వక భారీ రుణ ఎగవేతలు (రూ.25లక్షలకుపైన రుణం తీసుకున్న కేసులు) రూ.11,400 కోట్ల నుంచి 14,593కోట్లకు పెరిగింది. కేవలం 8నెలల కాలంలో 23 శాతం రుణాల ఎగవేత పెరిగింది. ఈ నాలుగేండ్లలో పీఎన్బీ రుణ ఎగవేతలు 95 శాతం వృద్ధి చెందాయి. మొత్తం జాతీయ బ్యాంకుల్లో ఉద్దేశపూర్వక ఎగవేతల మొత్తం ప్రతీ ఏటా 41 శాతం వృద్ధి చెందుతోంది. 'సిబిల్' విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ప్రతీ ఏటా బ్యాంకింగ్ రంగంలోని ఆర్థిక మోసాల్ని ఇది ప్రతిబింబింస్తోంది. బడా రుణ ఎగవేతదారుల దెబ్బకు జాతీయ బ్యాంకులు విలవిల్లాడుతున్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్రంలోని మోడీ సర్కార్కు చీమ కుట్టినట్టయినా లేదు.
ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాల్ని ఎగవేయటం పెరుగుతోందన్న విషయం పాలకుల్ని ఏమాత్రమూ ఆందోళనకు గురిచేయటం లేదు. కాబట్టే నియంత్రణగానీ, అడ్డుకునే చర్యలుగానీ చేపట్టడం లేదు. 'నీరవ్ మోడీ' ఉదంతం తర్వాత ప్రభుత్వ బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఒక కుట్రపూరిత ఆలోచనతో కావాలనే (ఉద్దేశపూర్వక ఎగవేతలు) బ్యాంకు రుణాలు ఎగ్గొట్టడం పెరిగిపోయింది.
నోటీసులు జారీ చేశారు..అయితే ఏంటి ?
భారత ఆర్థిక వ్యవస్థ ఎంతవేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతేవేగంగా ఆర్థిక మోసాలూ పెరుగుతున్నాయి. బ్యాంకుల వద్ద 2013, సెప్టెంబర్నాటికి ఉద్దేశపూర్వక ఎగవేతలు రూ.28,416 కోట్లు ఉంటే, 2017, సెప్టెంబర్ నాటికి రుణ ఎగవేతలు రూ.లక్షా 11వేల కోట్లకు చేరుకుంది. రూ.25లక్షలకు పైన రుణాలు పొంది ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన ఖాతాల్ని 'సిబిల్' పరిగణలోకి తీసుకొని ఈ గణాంకాల్ని విడుదల చేసింది. వీటన్నింటిపైనా బ్యాంకులు న్యాయపరమైన చర్యల్ని చేపట్టాయని సిబిల్ తెలిపింది. సంబధిత రుణ ఎగవేతదారులకు నోటీసులు జారీ చేశారు. కానీ ఏం లాభం, రుణాల్ని బ్యాంకులు వసూలు చేసుకోలేకపోతున్నాయి. గత నాలుగేండ్లలో అన్ని జాతీయ బ్యాంకుల్లోని రుణ ఎగవేతల ఖాతాల సంఖ్య 58.7 శాతానికి పెరిగిందని సిబిల్ హెచ్చరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), దాని అనుబంధ బ్యాంకుల్లో రుణ ఎగవేతలు ప్రతి ఏటా 25.07 శాతం పెరిగాయి. అదే ప్రైవేట్ బ్యాంకుల విషయంలో 25.67 శాతం నమోదైంది. ఇక దేశంలోని విదేశీ బ్యాంకులకు రుణాల ఎగవేత బెడద పెద్దగా లేదనే చెప్పాలి.