Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాతాల్లో కనీస నిల్వల చార్జీల తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో దేశంలోని అదిపెద్ద బ్యాంకింగ్ సంస్థ 'భారతీయ స్టేట్ బ్యాంక్' (ఎస్బీఐ) ఖాతాల్లో కనీస నిల్వలు లేకపోతే వసూలు చేసే చార్జీలను దాదాపు 75 శాతం మేర తగ్గించింది. ప్రస్తుతం మెట్రో, అర్బన్ కేంద్రాల్లోని ఎస్బీఐ పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు లేని ఖాతాదారుల నుంచి నెలకు రూ.50 (జీఎస్టీ కాకుండా) చొప్పున, సెమీ- అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారుల నుంచి నెలకు రూ.40 (జీఎస్టీ కాకుండా) వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఛార్జీలను 75శాతం వరకు తగ్గించింది. దీంతో ఇకపై మెట్రో, అర్బన్ కేంద్రాల్లోని పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు లేకపోతే రూ.15(జీఎస్టీ కాకుండా), సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ.12(జీఎస్టీ కాకుండా), గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాలకైతే రూ.10(జీఎస్టీ లేకుండా) చొప్పున వసూలు చేయనున్నట్లు ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. సవరించిన ఈ చార్జీలు ఏప్రిల్ 1, 2018 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.
41 లక్షల ఖాతాలు రద్దు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి పది నెలల్లో ఎస్బీఐ 41 లక్షలకు పైగా వివిధ ఖాతాలను మూసివేసింది. తమ ఖాతాల్లో కనీస నిల్వలను నిర్వహించని ఖాతాదారులకు సదరు అకౌంట్ల రద్దు రూపంలో ఎస్బీఐ షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐ కింద రాబట్టిన సమాచారంతో ఈ విషయం వెలుగుచూసింది. ఫిబ్రవరి 28న ఎస్బీఐ ఈ మేరకు దరఖాస్తుదారుకు లిఖితపూర్వకంగా వివరాలు అందించినట్టు ప్రభాత్ ఖబర్ పేర్కొంది.