Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా సంస్థలు మేటి పనితీరు కనబరిచి అత్యధిక లాభాలను ఆర్జించిన ప్రభుత్వ రంగ సంస్థలుగా (పీఎస్యూ) నిలిచినట్టు సర్కారు ఒక సర్వేలో తేలింది. మంగళవారం పార్లమెంట్కు ప్రభుత్వం సమర్పించిన 'పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వే' ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్, ఎయిరిండియా, ఎంటీఎన్ఎల్లు అత్యధికంగా నష్టాలను నమోదు చేసిన పీఎస్యూలుగా నిలిచినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న దాదాపు 257 సంస్థల పని తీరును విశ్లేషించి సర్కారు ఈ సర్వే నివేదికను రూపొందించింది. అత్యధికంగా నష్టాలను నమోదు చేసిన సంస్థల్లో వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్, ఎస్టీసీఎల్, ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్, బ్రహ్మపుత్ర క్రాకర్స్, పాలిమర్ సంస్థలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ రంగంలోని 82 సంస్థలు నమోదు చేసిన నష్టాల్లో దాదాపు 83.82 శాతం నష్టాలు పై పది సంస్థల్లోనే నమోదు అయినట్టుగా సర్కారు తెలిపింది.
బీఎస్ఎన్ఎల్, ఎయిరిండియా, ఎంటీఎన్ఎల్ సంస్థల నష్టం మొత్తం సర్కారు సంస్థల నష్టాల్లో 55.66 శాతంగా నమోదయ్యాయి. ప్రభుత్వం సంస్థలు మొత్తంగా సాధించిన లాభాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అయిల్ అండ్ నేచురల్ గ్యాస్, కోల్ ఇండియా సంస్థల లాభాలు వరుసగా 19.69%, 18.45%, 14.94 శాతంగా ఉన్నట్టుగా సర్వే వెల్లడించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నడుస్తున్న మొత్తం 257 సంస్థలు 2016-17 సంవత్సరానికి గాను రూ.1,27,602 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయని ఇది అంతకు ముందు ఏడాది సదరు సంస్థల లాభం రూ.1,14,239 కోట్లుతో పోలిస్తే దాదాపు 11.7 శాతం అధికమని వివరించింది.