Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియంత్రణలో 'మా' పరిధి పరిమితమే
- మోసాల్ని ముందస్తుగా నిరోధించలేం..
- బ్యాంక్ మోసాలతో బాధ కలుగుతోంది...
- పీఎన్బీ వంటి స్కామ్ల్ని ఉపేక్షించేది లేదు
- ఆర్బీఐకి మరింతగా వెసులుబాటివ్వాలి..
- పీఎస్బీలకు ఎక్కువ అధికారాలివ్వాల్సిందే : ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్
గాంధీనగర్: దేశంలోని బ్యాంకుల్లో వెలుగు చూస్తున్న మోసాలను నియంత్రించడంలో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విఫలమవుతోందన్న ఆరోపణలపై ఆ బ్యాంకు అధినేత ఉర్జిత్ పటేల్ ఘాటుగా స్పందించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో (పీఎన్బీలో) వెలుగు చూసిన భారీ కుంభకోణంపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మౌనం వీడుతూ.. దేశంలోని ఏ బ్యాంకులో మోసం జరిగినా అందుకు ఆర్బీఐ వైఫల్యమే కారణమని భావిస్తుండడం సాధారణమైపోయిందని అన్నారు. ఆర్బీఐ పర్యవేక్షణ బృందం నిరంతరంగా పని చేస్తూ మోసాలను గుర్తించలేకపోవడం వల్లే.. స్కామ్ జరిగినట్టుగా భావిస్తుంటారని.. అయితే వాస్తవాల్లోకి వెళితే ప్రభుత్వ రంగ బ్యాంకుల నియంత్రణలో ఆర్బీఐ పాత్ర పరిమితమైందేనని అన్నారు. బ్యాంకుల్లో తరుచూ కొన్ని కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయని.. ఆర్బీఐ వాటన్నింటి మూలాల్లోకి వెళ్లి వాటిని నియంత్రించేంత యంత్రాంగం లేదని ఆయన వివరించారు. స్థానిక 'గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ'లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పీఎన్బీలో జరిగిన భారీ స్కామ్పై రెగ్యులేటరీ పాత్రపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకున్న మోసాలు, అక్రమాలపై ఆర్బీఐ కూడా చాలా కోపంగా, ఒకింత బాధతో ఉందని తెలిపారు. ఇలాంటి మోసపూరిత కేసులను ఆర్బీఐ అసలు ఉపేక్షించదన్నారు. బ్యాంకుల్లో ప్రస్తుతం ఉన్న నియంత్రణ ముందస్తుగా అనూహ్య మోసాల్ని గుర్తించి, నిరోధించే స్థాయిలో లేదన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) రెగ్యులేటరింగ్లో సర్కారు పాత్రే అధికమని ఆయన వివరణనిచ్చారు. ప్రస్తుతం బ్యాంకింగ్లో ద్వంద్వ నియంత్రణ విధానం అమలులో ఉన్నట్టు ఆయన వివరించారు. ఇందులో ఒకటి ఆర్థిక మంత్రుత్వ శాఖది కాగా.. రెండోది ఆర్బీఐది అని తెలిపారు. ఈ విధానాల వల్ల పటిష్టమైన నియంత్రణ విధానంలో లోటుపాట్లు జరగుతున్నాయని... దీనిని వల్లే పీఎన్బీ వంటి కుంభకోణాలు సంభవిస్తున్నట్టుగా ఆయన వివరించారు. ఇలాంటి వాటిని బ్యాంకింగ్ రెగ్యులేటరీ కూడా ఆపలేదన్నారు.
ప్రభుత్వ నియంత్రణే ఎక్కువ ..
ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వహించడంలో ఆర్బీఐ రెగ్యులేటరీ చాలా పరిమిత స్థాయిలో ప్రాధికారికతను కలిగి ఉంటుందని ఉర్జిత్ వెల్లడించారు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డైరెక్టర్లను, మేనేజ్మెంట్ను తొలగించే అధికారం ఆర్బీఐకి లేదన్నారు. అన్ని బ్యాంకులను ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల నియంత్రణ ఎక్కువగా సర్కారు వద్దే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ చట్టంలో సవరణలు చేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ అధికారాలు ఆర్బీఐకి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
గరళం మింగుతున్నాం..
బ్యాంకింగ్ రంగంలోని ప్రతీ వైఫల్యాల్ని ఆర్బీఐకి అంటగడుతున్నారని.. వాటన్నింటిని పెద్ద బ్యాంక్గా తాము బరిస్తూ వస్తున్నామన్నారు. నీలకంఠుడు విషాన్ని గొంతులో దాచుకొని లోకాన్ని రక్షించినట్టే.. తాము కూడా మోసాల నుంచి కలిగే దుష్ ప్రభావాల్ని సర్దుబాటు చేసుకొంటూ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగకుండా చర్యలు చేపడుతున్నట్టుగా ఆయన వివరించారు. బ్యాంకుల్లో మోసాలకు కేవలం ఆర్బీఐనే ముద్దాయిని చేయడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ మోసం నుంచి కొత్త పాఠాలు నేర్చుకొంటూ అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన వివరించారు. ప్రయివేటు బ్యాంకుల నియంత్రణ విషయంలో ఆర్బీఐకున్న వెసులుబాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో కొరవడిందని ఆయన అన్నారు. ఇందుకు పలు చట్టపరమైన అవరోధాలున్నట్టుగా ఆయన వివరించారు. వీటని సడలిస్తూ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు.