Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 91 మంది దేశం దాటేసే అవకాశం
- బడామోసగాళ్ల పేర్లతో జాబితా సిద్ధం
- ఇక విదేశాలకు తరలిపోకుండా చర్యలు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో (పీఎన్బీ) అతిపెద్ద స్కామ్ వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్టు కనిపిస్తోంది. భారీ ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలను తీసుకొని.. వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు మకాం మారుస్తున్న నీరవ్ మోడీ లాంటి ఘరానా బాబులకు చెక్ పెట్టేలా కఠిన చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బ్యాంకు మోసాలకు పాల్పడేవారు దేశం విడిచి వెళ్లిపోకుండా ఆంక్షలు తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే దేశం విడిచి పారిపోతారు అని భావిస్తున్న 91 మందితో జాబితాను తయారుచేసినట్టుగా సమాచారం. వీరంతా బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన, మోసపూరిత లావాదేవీలకు పాల్పడిన కేసుల్లో నిందితులు లేదా ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులే. ఈ విషయాన్ని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి ఈ విషయాలను వెల్లడించారు. ఇలాంటి కేసులకు సంబంధించి మొత్తం 400 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదార్లను గుర్తించగా.. అందులో 91 మందితో ప్రభుత్వం విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్న వారి జాబితాను తయారుచేసినట్లు తెలుస్తోంది. వీరు దేశం విడిచి వెళ్లకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా.. ఇప్పటికే రూ. 50కోట్లకు పైబడి బ్యాంకు రుణాలు ఇవ్వాలంటే ఆ ఖాతాదారుల పాస్పోర్టు వివరాలను ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ ఆ ఖాతాదారులు మోసానికి పాల్పడినట్లు తేలితే సదరు వ్యక్తి పాస్పోర్టు వివరాలను బ్యాంకులు విదేశాంగ శాఖకు అందిస్తాయి. అప్పుడు వారు దేశం విడిచి వెళ్లకుండా విదేశాంగ శాఖ నిఘా పెడుతుంది అని సదరు అధికారి తెలిపారు.
ఇప్పటికే 31 మంది దేశం దాటారు..
వివిధ రకాల ఆర్థిక నేరాలకు పాల్పడి.. విచారణను తప్పించుకునేందుకు గాను విదేశాలకు తరలి వెళ్లిన బడాబాబుల సంఖ్య 31కి చేరిందని సర్కారు గురువారం అధికారికంగా వెల్లడించింది. ఇలా విదేశాలకు పారిపోయిన 31 మంది వ్యాపారవేత్తల వివరాలను ప్రభుత్వం గురువారం లోక్సభలో వెల్లడించింది. ఈడీ, సీబీఐలు విచారణ చేపట్టిన పీఎన్బీ స్కాం నిందితులు నీరవ్, మెహుల్ చోక్సి సహా ఆర్థిక నేరాలకు పాల్పడిన 31 మంది విదేశాల్లో తలదాచుకుటున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ జాబితాలో నీరవ్ మోదీ, ఆయన భార్య అమీ, కుమారుడు నిషాల్, లిక్కర్ కింగ్ విజరు మాల్యా, లలిత్ మోదీ, ఆయుధ వ్యాపారి సంజరు భండారీ, సౌమిత్ జెనా, విజరుకుమార్ రెవాభారు పటేల్, సునీల్ రమేష్ రూపాని, సురేందర్ సింగ్, ఆనంద్ సింగ్, హర్సాహిబ్ సింగ్, హర్లీన్ కౌర్, జతిన్ మెహతా, చేతన్ జయంతిలాల్ సందేశర, దీప్తి చేతన్, నితిన్ జయంతిలాల్, సవ్యసేథ్, నీలేష్ పరేఖ్, ఉమేష్ పరేఖ్, హేమంత్ గాంధీ, ఈశ్వర్భారు భట్, ఎంజీ చంద్రశేఖర్, చెరియా వనరక్కల్ సుధీర్, నౌషా కదీజత్, చెరియా విటీల్ సాధిక్ తదితరులున్నారు. ఇందులో విజరు మాల్యా, అశిష్ జబన్పుత్ర, పుశ్పేష్ కుమార్ వైద్, సంజరు కల్రా, వర్షా కల్రా, ఆర్తి కల్రాల అప్పగింత విషయమై సీబీఐ నుంచి వినతులందాయని మంత్రి చెప్పారు.