Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ తరువాత మొబైల్ ఫోన్ బిల్లుల భారం గణనీయంగా తగ్గిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గత ఆరు నెలల్లో సగటు నెలవారీ మొబైల్ బిల్లులు సగటున 30నుంచి 40శాతం మేర దిగివచ్చినట్టుగా తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే ఇకపై అలా ఉండబోదట.. భవిష్యత్లో ఫోన్ బిల్లులు మరింత తగ్గే అవకాశాలు కన్పించడం లేదని కౌంటర్పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసర్చ్ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. జియో మార్కెట్లోకి అడుగుపెట్టడంతో ఎయిర్టెల్, ఐడియా సహా పలు టెలికాం సంస్థలు టారిఫ్లను తగ్గించాయి. దీంతో సామాన్య వినియోగదారుడికి ధరలు అందుబాటులోకి వచ్చాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు టెలికాం సంస్థలు తక్కువ ధరలోనే డేటా ఆఫర్లను అందిస్తున్నాయి. అయితే దీని వల్ల టెలికాం సంస్థల ఆదాయానికి భారీగా గండిపడినట్లు తెలుస్తోంది. 2016 జూన్ నుంచి 2017 డిసెంబరు మధ్య టెలికాం కంపెనీలు దాదాపు 9.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయాయని ఇటీవల నివేదికలో తేలింది. ఈ నేపథ్యంలో భవిష్యత్లో ఫోన్ బిల్లులు మరింత తగ్గే అవకాశాలు కన్పించడం లేదని కౌంటర్పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసర్చ్ వెల్లడించింది. భవిష్యత్లో తమ టారిఫ్లను మరింతగా తగ్గించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే వినియోగదారులు చేజారకుండా ఆయా సంస్థలు ఉన్న టారిఫ్లలోనే ఎక్కువ డేటా, మరిన్ని ఉచిత సదుపాయాలను వినియోగదారులకు అందించే అవకాశాలున్నాయని సమాచారం.