Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకుల వద్ద ఉందని ఆర్బీఐ వెల్లడి
బెంగళూరు: బ్యాంకుల వద్ద రూ. 11,300 కోట్ల అన్క్లెయిమ్డ్ డబ్బు ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బీఐ) తెలిపింది. కాగా, బ్యాంక్ ఖాతాదారులకు చెందిన ఈ డబ్బు అంతా 64 బ్యాంకుల్లోని 3కోట్ల ఖాతాల్లో ఉన్నదని వివరించింది. ఇందులో అధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వద్ద రూ.1,262 కోట్లు ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) వద్ద రూ.1,250 కోట్లు ఉన్నాయి. వీటితో పాటు ఇతర జాతీయ బ్యాంకుల్లో రూ. 7,040 కోట్లు ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. 'అన్క్లెయిమ్డ్' డబ్బులో చాలా డిపాజిట్లు మృతి చెందిన ఖాతాదారులవి, అనేక బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నవారివేనని ఆర్బీఐ మాజీ ఉన్నతాధికారి బి. చరణ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటిలో బినామీ ఖాతాలూ ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని సెక్షన్-26 ప్రకారం పదేండ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతాల వివరాలను అన్ని బ్యాంకులు ఆర్బీఐకి సమర్పించాలి. అయితే సెక్షన్-26ఏ ప్రకారం పదేండ్లు దాటినా కూడా ఖాతా రద్దు కాకుండా క్రియాశీలకంగా ఉండటంతో పాటు ఖాతాదారు లేదా నామినీలకు బ్యాంకింగ్ కంపెనీలు డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంకింగ్ చట్టం-2012 ప్రకారం సుదీర్ఘ లావాదేవీలు జరపని బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో నిల్వ చేస్తారు. యాక్సిస్, డీసీబీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, కోటక్ మహీంద్ర, ఎస్బ్యాంక్ వంటి ఏడు ప్రయివేటు బ్యాంకుల్లో రూ. 824 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉండగా, పన్నెండు ఇతర ప్రయివేటు బ్యాంకుల్లో రూ. 592 కోట్లు ఉన్నాయి. దీంతో ప్రయివేటు బ్యాంకుల్లో మొత్తం రూ. 1,416 కోట్ల అన్క్లెయిమ్డ్ డబ్బు పోగై ఉందని ఆర్బీఐ తెలిపింది. ఇందులో ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 476 కోట్లతో, కొటక్ మహీంద్ర బాంక్ రూ. 151 కోట్లతో అత్యధికంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు కలిగి ఉన్నాయి. కాగా, విదేశీ బ్యాంకుల్లో రూ. 332 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉండగా హెఎస్బీసీలోనే రూ. 105 కోట్లు ఉండటం గమనార్హం.