Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్న దర్యాప్తులో పెద్ద విషయం
- ఫిర్యాదు చేసిన యాక్సిస్ బ్యాంక్
ముంబయి: బూటకపు కంపెనీల పేర్లతో మోసపూరితమైన నకిలీ ఇన్వాయిస్లు, బిల్లులను సృష్టించి బ్యాంకులకు దాదాపు రూ.4000 కోట్ల మేర టోపీ పెట్టిన మరో భారీ స్కామ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబయికి చెందిన పరేఖ్ అల్యూమినిక్స్ లిమిటెట్ (పీఏఎల్) సంస్థ యాజమాన్యం, ప్రమోటర్లు ఈ స్కామ్కు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. గతంలో నమోదైన రూ.250 కోట్ల బ్యాంకింగ్ కుంభకోణం ఆరోపణలపై పరేఖ్ అల్యూ మినిక్స్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ దర్యాప్తులో భాగంగా సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్ట్ చేసి విచారణ జరపుతుండగా.. స్కామ్లో కొత్త కోణం వెలుగు లోకి వచ్చింది. రూ.250 కోట్ల స్కామ్ విలువ మరింతగా విస్తరించి దాదాపు రూ.4000 కోట్లకు చేరువలో ఉన్నట్టుగా దర్యాప్తు సంస్థల అధికారులు గుర్తించారు. ఈ స్కామ్ మొత్తం విలువ రూ.4,000 కోట్ల వరకు ఉంటుందంటూ యాక్సిస్ బ్యాంకు తన తాజా ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. ఇరవైకి పైగా బ్యాంకుల కన్సార్టియంను పీఏఎల్ మోసం చేసినట్టుగా సమాచారం. బూటకపు కంపెనీల పేరుతో మోసపూరితమైన నకిలీ ఇన్వాయిస్లు, బిల్లులతో కుంభకోణానికి పాల్పడ్డారని బ్యాంకు ఆరోపించింది. దీంతో ఫోర్జరీ, నిబంధనల ఉల్లంఘన, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భవార్లాల్ భండారి, ప్రేమల్ గోరఖ్నాథ్, కమేలష్ కనుగోలను పోలీసులు అరెస్టు చేశారు.ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నప్పటికీ ఈ విషయంలో పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. పరేఖ్ అల్యూమినిక్స్ ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సహా ప్రభుత్వ బ్యాంకులనుంచి ఆరోపణల నెదుర్కొంటోంది. ఇప్పటికే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.