Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశాలకు జై కొడుతున్న సంపన్నులు
- మూడేండ్లలో 23,000 మంది వలస
- గతేడాదే దాదాపు 7,000 మంది 'ఔట్'
- 'స్వర్గసీమ' దేశాలపై బడాబాబుల ఆసక్తి
- వ్యాపారాలిక్కడ.. మకాం మాత్రం అక్కడ
- కఠిన చట్టాలు, పన్నులే కారణం!
న్యూఢిల్లీ: నల్లధన నియంత్రణలో భాగంగా కఠినమైన చట్టాలు, సంస్కరణలను అమలులోకి వస్తున్న నేపథ్యంలో దేశం నుంచి పెద్ద సంఖ్యలో సంపన్నులు తమ మకాం మార్చేస్తున్నారు. గడిచిన మూడేండ్ల కాలంలో దేశం నుంచి అధిక సంఖ్యలో సంపన్నులు విదేశాలకు వలసపోయారని ఒక అధ్యయనంలో తేలింది. 2014 నుంచి ఇప్పటి వరకు రూ.65 లక్షలు అంతకంటే ఎక్కువ సంపద కలిగిన సంపన్నులు దాదాపు 23,000 మంది దేశం వదిలి సంపన్నుల స్వర్గసీమగా నిలిచే దేశాలకు మకాం మార్చినట్టుగా మోర్గాన్ స్టాన్లీ ఇన్వెష్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ రుచిర్ శర్మ నేతృత్వంలోని బృందం లెక్క తేల్చింది. ఒక్క 2017లోనే దాదాపు 7000 మంది సంపన్నులు దేశం దాటేసినట్టుగా ఈ అధ్యయనం తెలిపింది. 23,000 మంది బడా బాబులు దేశం దాటేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ వివిధ రూపాల్లో నష్టపోతోందని బృందం వివరించింది. మొత్తం దేశంలో ఉన్న సంపన్నుల్లో వలస పోయిన వారి సంఖ్య 2.1 శాతానికి సమానమని ఈ అద్యయనం తెలిపింది. దీంతో ప్రపంచంలోనే మరే ఇతర దేశాల్లోనూ వలసపోనంతంగా బడా బాబులు భారత్ను వదిలేస్తున్నట్ట గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1,50,000 మంది సంపన్నుల కదలికలను అధ్యయనం చేసి ఈ మోర్గాన్ స్టాన్లీ ఈ వివరాలను తెలిపింది. దేశం వదిలి ఆరు నెలలు అంతకంటే ఎక్కువ కాలం తిరిగి స్వదేశానికి రాకుండా.. అక్కడి నుంచి తమతమ దేశాల్లో వ్యాపారాలను చక్కబెడుతున్న వారి వివరాలను, కదలికలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాక శర్మా బృందం ఈ వివరాలను వెల్లడించింది. పన్నులు కఠినతరం చేయడం, నల్లధన నియంత్రణ చర్యలకు పదను, మోసాల వెలికితీత పెరగడం, నిరర్థ ఆస్తులు, ఆర్థిక మోసాలపై నిఘా పెరగడంతో చాలా మంది సంపన్నులు భారత్ వదిలి విదేశాలకు వలస వెలుతున్నట్టుగా తెలుస్తోందని అధ్యయనం వెల్లడించింది.
బ్రిటన్, దుబారు, సింగపూర్ హాట్ గురు..
భారత్కు బైబై చెబుతున్న బడాబాబులు ఎక్కువగా బ్రిటన్, దుబారు, సింగపూర్లకు తమ మకాం ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా అధ్యయనం తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇతర దేశాల వారు ఎక్కువగా ఆక్లాండ్, దుబారు, మోట్రియల్, టెల్ అవైవ్, టొరంటోలలో తమ నివాసాలను మార్చు తున్నట్టుగా తెలుస్తోంది. భారత్తో పాటుగా అధిక పన్నుల మూలంగా ఫ్రాన్స్లో కూడా సంపన్నుల వలసలు అధికంగా ఉన్నట్టుగా ఈ అధ్యయనం వెల్లడించింది. బ్రెగ్జిట్ నేపథ్యంలో గత ఏడాది బ్రిటన్ నుంచి కూడా అత్యధికంగా సంపన్నులు ఇతర ఐరోపా దేశాకు తరలి పోయినట్టుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది. 2014 నుంచి ఇప్పటి వరకు చైనా నుంచి దాదాపు 38,000 మంది సంపన్నులు దేశం దాటేసినట్టుగా అధ్యయనం లెక్క తేల్చింది.