Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటా 1.2 కోట్ల మేర కొలువులు కావాలి
- 10 శాతం వృద్ధితోనే కొత్త ఉద్యోగాలు
- మౌలికం, ఈవోడీలపై దృష్టి పెట్టాలి
- దేశంలో సంస్కరణల వేగం పెరగాలి: రాజన్
హాంకాంగ్: భారత్ నమోదు చేస్తూ వస్తున్న వృద్ధి రేటు భవిష్యత్తు అవసరాలకు సరిపోదని భారతీయ రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ప్రతియేటా ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్న 1.2 కోట్ల మంది అవసరాలను తీర్చేందుకు.. భారత్ ప్రస్తుతం నమోదు చేస్తున్న 7.5 వృద్ధి సరిపోదని ఆయన అన్నారు. ఇందుకోసం భారత్ కనీసం 10 శాతం మేర వృద్ధిని నమోదు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. క్రెడిట్ సూయిస్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో పాల్గొన్న ఆయన అనంతరం సీఎన్బీసీకి ఇంటర్వ్యూనిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. భారత్ రానున్న 10 నుంచి 20 సంవత్సరాల గురించి ఆలోచిస్తూవుంటే.. అందులోఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుందని అన్నారు. ఆర్బీఐ అధినేత పదివికి రాజీనామా చేసిన అనంతరం రాజన్ ప్రస్తుతం షికాగో విశ్వవిద్యాలయంలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో అధ్యాపక బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. భారీ స్థాయిలో మౌలిక వసతుల కల్పన, దేశంలో అధికంగా కంపెనీలు వచ్చేలా చర్యలు చేపట్టడంతో పాటు.. భారత్లో కంపెనీల వ్యాపార నిర్వహణను మరింత సులభతరం(ఈవోడీ) చేయడం, నాణ్యమైన మానవ మూలధానాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా భారత్ 10 శాతం వృద్ధిని నమోదు చేయగలదని ఆయన అన్నారు. భారత్లో మెరుగైన సంస్కరణలు వస్తున్నప్పటికీ.. అనుకున్న దానికంటే కూడా చాలా నెమ్మదిగా ఇది తెరపైకి వస్తుండడం పట్ల రఘురామ్ రాజన్ కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. యువ జనాభా భారత్కు గొప్ప సంపదని ఆయన అన్నారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇక భారత్లో సంస్కరణల పర్వం కొన్ని రోజులు పక్కనపడే అవకాశం ఉందని అన్నారు. ఎన్నికలు ముగిసి కొత్త సర్కారు కొలువుదీరిన తరువాత సంస్కరణలు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపారు. భూసేకరణ, విద్యుత్తు రంగంలో సంస్కరణలు వంటి చర్యల వల్ల పరిశ్రమ వర్గాల్లో విశ్వాసం పెరుగుతుందని అన్నారు.