Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబానీ బ్రదర్స్ డీల్కు చుక్కెదురు
- స్టే కొనసాగించిన సుప్రీం
- వచ్చే నెలలో తదుపరి విచారణ
- పడిపోయిన షేర్ విలువ
న్యూఢిల్లీ: అంబానీ అన్నదమ్ములకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్)కు చెందిన ఆస్తులను ముఖేష్ అంబానీ కొనుగోలు చేయాలని గతేడాది నిర్ణయించారు. ఆర్కామ్ ఆస్తులను రిలయన్స్ జియోకు విక్రయించకుండా బాంబే హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం గురువారం నిరాకరించింది. దీనిపై మళ్లీ విచారణ జరిపేంత వరకు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు కొనసాగుతుందని స్పష్టం చేసింది. తద్వారా తన అనుమతిలేనిదే ఈ డీల్ను పూర్తి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 5కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ పరిణామంతో బిఎస్ఇలో ఆర్కామ్ షేర్ 5.36 శాతం పతనమై రూ.23.85కు పడిపోయింది.
తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఆర్కామ్ ఆ భారాన్ని తగ్గించుకునేందుకు తన ఆస్తులను ముఖేష్ అంబానీకి చెందిన జియో ఇన్ఫోకామ్కు విక్రయిస్తున్నట్లు గతేడాది డిసెంబరులో ప్రకటించింది. సుమారు రూ.39వేల కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా తన వైర్లెస్ స్పెక్ట్రం, టవర్, ఫైబర్, మీడియా కన్వర్జెన్స్ నోడ్ (ఎంసిఎన్) ఆస్తులను జియోకు విక్రయించనున్నట్టు ఆర్కాం ప్రకటించింది. ఈ మేరకు అంబానీ సోదరులు అనిల్, ముఖేశ్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే దీనిపై ఎరిక్సన్ సంస్థ ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్లింది. తమ బకాయిలు చెల్లించకుండా ఆస్తులు విక్రయిస్తున్నారని ఆరోపించింది. ఆర్కాం నుంచి తమకు రూ.1,000 కోట్లకు పైగా బకాయి రావాల్సి ఉందని ఎరిక్సన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. దీంతో అనుమతులు లేకుండా రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులు అమ్మరాదని ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశించింది. దీంతో ఆర్బిట్రేషన్ తీర్పుపై ఆర్కామ్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా ఆ కోర్టులోనూ ఆస్తులు విక్రయించకుండా స్టే విధించింది.
కాగా ఆర్కామ్కు మద్దతుగా నిలిచిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ట్రిబ్యునల్ ఆర్డర్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆస్తుల అమ్మకానికి అనుమతి నివ్వాల్సిందిగా కోరింది. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయ స్థానం ముంబై హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ సుప్రీం ధర్మాసనం ఎకె గోయల్, ఆర్ఎఫ్ నారిమన్, యుయు లలీత్ తాజా ఆదేశాలిచ్చింది. దీంతో ఆర్కామ్ మళ్లీ చిక్కుల్లో పడినట్లయ్యింది. ఎస్బిఐ కన్సోరియంలోని బిఒబి, బిఒఐ, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, పిఎన్బి, ఐడిబిఐ బ్యాంకు, యూకో బ్యాంకు, ఐఒబి, దేనా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, యూనైటెడ్ బ్యాంకు, ఎల్ఐసి, బార్క్లేస్ బ్యాంకు తదితర 24 విత్త సంస్థలు ఆర్కామ్కు అప్పులిచ్చిన వాటిలో ఉన్నాయి.
ఆర్కామ్కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, మీడియా కన్వర్జన్స్ నోడ్స్ను (ఎంసిఎన్) జియో ఇన్ఫోకామ్ కొనుగోలు చేయాలని గతేడాది ముగింపులో నిర్ణయించింది. ఆ సమయంలో ఇరు కంపెనీలు ఒక ఒప్పందానికి వచ్చాయి. కాగా డీల్ ఆర్థిక వివరాలను వెల్లడించనప్పటికీ, దీని విలువ రూ.24,000-25,000 కోట్ల శ్రేణిలో బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ ఆస్తుల విక్రయం రూ.45,000 కోట్ల రుణ భారంతో కుదేలైన ఆర్కామ్కు ఊరట లభిస్తుందని భావించాయి. 2018 మార్చి ముగింపు నాటికి ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాలని ఇరు సంస్థలు నిర్ధేశించుకున్నాయి. తాజాగా కోర్టుల ఉత్తర్వుల వల్ల మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.