Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల అండతో రూ.445 కోట్ల టోపీ
- కిసాన్ క్రెడిట్ కార్డు, చేపల సాగు పేరిట ఘరానా మోసం
- సీబీఐకి ఫిర్యాదు చేసిన ఐడీబీఐ బ్యాంక్ వర్గాలు..
- జీఎంతో పాటు 222 రుణగ్రహితలపై కేసు
- రంగంలోకి సీబీఐ దర్యాప్తు బృందాలు
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి: తెలుగు రాష్ట్రాల్లో మరో భారీ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చేపల సాగు పేరుతో ఐడీబీఐ బ్యాంకునకు దాదాపు రూ.193 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టిన ఉదంతం తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయమై ఐడీబీఐ బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేయడంతో కేంద్ర దర్యాప్తు సంఘం కేసు నమోదు చేసింది. మోసపూరిత ధోరణిలో భ్యాంకు అధికారుల అండతో కిసాన్ క్రేడిట్కార్డు, ఫీషికల్చర్తో పాటు ఇతర రుణాల పేరిట 22 అగ్రిగేటర్లు, 222 మంది రుణగ్రహీతలు తప్పుడు డాక్యుమెంట్లు, తక్కువ విలువ ఉన్న ఆస్తులను ఎక్కువ విలువ గలవిగా చూపించడం, లేని ఆస్తులు ఉన్నట్టుగా చూపించడం వంటి మోసాలకు పాల్పడి రుణాలను పొంది వాటిని తమ వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసుకున్నట్టగా ఐడీబీఐ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ మూడేండ్ల కాలంలో పొందిన రూ.192.98కోట్ల రుణాలను సకాలంలో చెలించకపోవడం, వడ్డీ కట్టకపోవడం మూలాన ప్రస్తుతం ఈ రుణం విలువ మొత్తం రూ.445.32 కోట్లకు చేరిందని ఐడీబీఐ వివరించారు. ఐడీబీఐ బ్యాంకు జనరల్ మేనేజర్లతో సహా 22 మంది అగ్రిగేటర్లు, 222 మంది రుణగ్రహితలు ఈ కుంభకోణంలో పాలుపంచుకున్నారని బ్యాంక్ వెల్లడించింది.
మూడేండ్లు యథేచ్ఛగా రుణాలు..
ఐడీబీఐ బ్యాంకుకు చెందిన తెలంగాణ, విశాఖ, చెన్నై బ్రాంచ్లలో రూ. 192.98 కోట్ల రూపాయల మోసం జరిగిందని, కిసాన్ క్రెడిట్కార్డు, ఫిషీకల్చర్లతో పాటు ఇతర రుణాల పేరిట ఈ మోసం 2009-10, 2010-11,2011-12 సంవత్సరాలలో జరిగినట్లు సీబీఐ వివరించింది. మోసానికి పాల్పడిన వారిలో ఐడీబీఐ బ్యాంకు బషీర్బాగ్ బ్రాంచ్ అప్పటి జనరల్ మేనేజర్ దత్తు రామారావు, చెన్నై సౌత్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్.దామోదరన్లతో పాటు 22 మంది అగ్రిగేటర్లు 222 మంది రుణ గ్రహీతలు, 7గురు బ్యాంకు వ్యాలుటర్లు మోసానికి పాల్పడినట్టుగా తెలుస్తోందని సీబీఐ తెలిపింది. రుణగ్రహితలు తాము తీసుకున్న రుణమంజూరు పత్రాలలో పేర్కొన్నట్లుగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణ, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆయా భూములలో ఎలాంటి చేపల పెంపకం జరగడం లేదని కూడా ఐడీబీఐ బ్యాంక్ విచారణలో తేలిందని సీబీఐ వివరించింది. ఐడీబీఐ బషీర్బాగ్, హబ్సీగూడ, విశాఖలోని సిరిపురం బ్రాంచ్లలో ఈ కుంభకోణం చోటు చేసుకుందని బ్యాంక్ జనరల్ మేనేజర్ మంజునాథ్ పారు తెలిపారని సీబీఐ వెల్లడించింది. నిందుతులపై సీఆర్పీసీలోని 420,120బీ, 409,468, 471 లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(2), 13(1)(సీ)(డీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీబీఐ.. హైదరాబాద్ డీఐజీ చంద్రశేఖర్ నేతృత్వంలో కేసు దర్యాప్తు మొదలుపెట్టింది.