Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతి నైపుణ్యత ఉద్యోగాలకూ ఎసరే..
- కొలువుల పునర్ నిర్మాణం జరగొచ్చు..
- మిగిలేవి అధిక మేథ, సృజనాత్మక కొలువులే..
- యంత్రాలు మానషికి ప్రత్యామ్నాయం కాలేవు..: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
కొచ్చి: కృత్రిమ మేథస్సు(ఏఐ), అత్యాధునిక మెషన లర్నింగ్, రోబోటిక్స్ వంటి కొత్త టెక్నాలజీల కారణంగా రానున్న ఉద్యోగాలకు ఎసరు వచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్రాజన్ అన్నారు. కేరళ ప్రభుత్వ ఏర్పాటు చేసిన 'ఫ్యూచర్ ఆఫ్ గ్లోబర్ డిజిటల్ సమిట్' అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టెక్నాలజీలో వస్తున్న కొత్త పోకడల కారణంగా ఎక్కువ నైపుణ్యతతో కూడిన కొలువులతో పాటు నైపుణ్యత అంతగా అవసరం లేని ఉద్యోగాలకు కూడా ఎసరురానుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ మూలంగా వైద్యం వంటి రంగాలతో పాటు అంతగా నైపుణ్యత అవసరం లేని మిఠాయి దుకాణాల నిర్వహణ వంటి ఉద్యోగాలకు కూడా ఎసరు రానుందని తెలిపారు. టెక్నాలజీ రాక కారణంగా రానున్న 10-15 ఏండ్ల కాలంలో ఎక్కువ మేథస్సుతో కూడిన కొలువులు, మేటి సృజనాత్మకత జోడించిన ఉద్యోగాలతో పాటు టెక్నాలజీ నిర్వహణకు సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే మిగిలే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో యువత ఆ దిశగా దృష్టి సారిస్తూ కొత్త టెక్నాలజీలతో అందుబాటులోకి వచ్చే కొలువుల అధిక భాగాన్ని సొంతం చేసుకొనేందుకు కృషి చేయాలని అన్నారు. 'కృత్రిమ మేధా..ఉద్యోగాలను హరిస్తుంది, నిజమే.. కానీ ప్రస్తుతం భారత్ సాంకేతికతను ఆహ్వానించాల్సిందేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పష్టం చేశారు. భారత్ ఇప్పుడే కృత్రిమ మేధస్సుతో భయపడాల్సిన అవసరం లేదని, కృత్రిమ మేధను ఉపయోగించుకునే దశకు మనం చాలా దూరంలో ఉన్నాం' అని వివరించారు. పాశ్చాత్య దేశాల్లాగా కృత్రిమ మేధస్సుతో ఉద్యోగాలు పోతాయని మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర ఉద్యోగాలే లేవు కదా అని అన్నారు. ఈ భయాలకు పోయేముందు ఉద్యోగాల సృష్టి జరగాలని తెలిపారు. ఈ టెక్నాలజీ దేశంలో రూపాంతరీకరణ చెందడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. డిజిటల్ ఇండియా అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం..అధికారిక ఫైల్ పనులన్నీ డిజిటల్గా చేయలేకపోతున్నదని విమర్శించారు.
అయితే టెక్నాలజీ పూర్తిగా మానవ వనరులకు ప్రత్యామ్నాయం మాత్రం కాబోదని రాజన్ వివరించారు. టెక్నాలజీ అనువర్తన దశలో ఉన్న భారత్లో రానున్న రోజుల్లో జాబ్ మార్కెట్ నందు అనూహ్య మార్పులు రానున్నట్టుగా తెలిపారు. కొత్త టెక్నాలజీతో కూడిన యంత్రాలు మానవులకు ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతాయన్న భయం పారిశ్రామిక విప్లవం రోజుల నుంచి ఉన్నాయని అన్నారు. గత రెండు వందల సంవత్సరాలుగా ఈ భయం కొనసాగుతున్నప్పటికీ.. ఈ నాటికి మానవుల అవసరంతో కూడిన ఉద్యోగాలు పుట్టుకొస్తూనే ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం ఉన్న ప్రతీ ఉద్యోగం తీరుతెన్నలు టెక్నాలజీ రాకతో కొత్తరూపంలో పునర్ నిర్మాణంతో పాటు సృజనాత్మకతను అందిపుచ్చుకోనున్నాయని వివరించారు.