Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ ఎత్తుకు కుదేలైన స్టాక్ మార్కెట్లు..
- ఒక్కసారిగా వెల్లువెత్తిన అమ్మకాలు
- (+)400 నుంచి (-) 12కు కుంగిన సెన్సెక్స్
- కొన్ని గంటల్లోనే మదుపరులకు భారీ నష్టాలు
- డాలరుతో భారీగా పతనమైన రూపాయి
- మోడీ సర్కారుపై సన్నగిల్లిన విశ్వాసం..!
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం పాలపొంగులా ఒకేసారి ఎగిసి చప్పున చల్లబడిపోయాయి. వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలకు ప్రీఫైనల్స్గా అభివర్ణిస్తున్న కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలు మదు పరులకు చుక్కలను చూపించాయి. ఎంతో రసవత్తరంగా సాగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల లెక్కింపును అనుసరించి స్టాక్ మార్కెట్లు మంగళవారం కదలాడాయి.. తొలత భాజపా ఆధిక్యత నేపథ్యంలో ట్రేడింగ్ తొలి గంటలో సూచీలు అమాంతం ఎగబాకాయి. ఆ తర్వాత కర్నాటకలో నిడిచిన రాజీకీయ ఎత్తుగడలతో స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తూ జర్రున కిందకు జారాయి. ట్రేడింగ్ ముగిసే సమాయానికి ఆరంభ లాభాలన్నీ ఆవిరై.. స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి. దేశ ప్రజల్లో భాజపా, మోడీ చరిష్మా సన్నగిల్లుతోందనడానికి కర్నాటక ఫలితాలే నిదర్శనమన్న వార్తలు, రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయన్న విశ్లేషణల మధ్య మదుపరుల్లో విశ్వాసం సన్నగిల్లింది. కర్నాటక ఫలితాల నేపథ్యంలో మోడీ సర్కారు సంస్కరణలను పక్కన బెట్టనుందని.. ప్రజాకర్షక పథకాలను చేపట్టనుందన్న విశ్లేషణలు కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
లాభాలతో ప్రారంభమైన సూచీలు
మంగళవారం నాటి ట్రేడింగ్లో మదుపరులు ఎక్కువగా కర్నాటక ఫలితాలపై దృష్టి సారించారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంట సమయంలో భాజపా ఆధిక్యత కనిపించడంతో సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాసేపటికే భాజపా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో సూచీలు జోరందుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయ్యింది. అయితే ఆ జోరు ఎంతోసేపు నిలవలేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అధిక ధరల వద్ద మదుపర్ల లాభాల స్వీకరణకు దిగడంతో మధ్యాహ్ననికి సూచీలు ఆరంభ లాభాల్లో కొంత కోల్పోయాయి. సెన్సెక్స్ 200 పాయింట్ల లాభాన్ని కోల్పోయింది. నిఫ్టీ కూడా స్వల్ప లాభంతో కదలాడింది.
మధ్యాహ్నానికి మారిన సీన్..!
ఇక మధ్యాహ్నం 1 గంటల తర్వాత కర్నాటకలో రాజకీయ పరిస్థితులు మరింత రసకందాయంగా మారాయి. భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. స్పష్టమైన మెజార్టీకి కాస్త దూరంలో ఆగిపోయింది. దీంతో జేడీఎస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ చర్చల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. ఈ నేపథ్యంలో ఆరంభ లాభాలను పూర్తిగా కోల్పోయిన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఫలితంగా మధ్యాహ్నం 3గంటల ప్రాంతలో సూచీలు స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 13 పాయింట్లు కోల్పోయి 35,544 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 10,802 వద్ద స్థిర టపడ్డాయి. సెన్సెక్స్లో టాటా మోటార్స్ 4.29 శాతం, కోల్ ఇండియా 2.11 శాతం, ఎన్బీ ఐఎన్ 1.87 శాతం, సన్ ఫార్మా 1.22 శాతం, ఐటీసీ 0.93 శాతం, ఎన్టీపీసీ 0.79 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూశాయి. మరోవైపు టాటా స్టీల్ 2.29 శాతం, పవర్ గ్రిడ్ 2.27 శాతం, టీసీఎస్ 1.33 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.89 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 0.85 శాతం చొప్పున రాణించి మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. బీఎస్ఈలో రంగాల వారిగా లోహ సూచీ 1.53 శాతం, బ్యాంకింగ్ 1.39 శాతం, మౌలిక వసతులు 1.19 శాతం, కాపిటల్ గూడ్స్ 1.19 శాతం, ఐటి 1.04 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1 శాతం చొప్పున పెరిగాయి.