Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై ఏర్పిడిన ప్రతిష్టంభన, కొరియా ద్వీపంలో తాజాగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారమూ నష్టాల్లో నడిచాయి. కాంగ్రెస్-జేడీ (ఎస్) పొత్తు నేపథ్యంలో కర్ణాటకం రసవత్తరంగా మారడం, భాజపాపై విశ్వాసం సన్నగిల్లడం తదితర ప్రతికూలతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం నుంచే నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి వరకు ఏ దశలోనూ మార్కెట్లు కోలుకోకపోవడం విశేషం. బీఎస్ఈ సెన్సెక్స్ 166 పాయింట్ల నష్టంతో 35,377.69వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ కూడా 54.20 పాయింట్ల నష్టంతో 10747.70పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఉదయం 9.40 సమయానికి సెన్సెక్స్ 242 పాయింట్ల నష్టంతో 35301.94 పాయింట్ల వద్ద ట్రేడయింది. సెన్సెక్స్ 156 పాయింట్లు కిందకి పడిపోయి 35,388 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 61 పాయింట్లు దిగజారి 10,800 మార్కుకు కింద 10,741 వద్ద స్థిరపడింది. ఐటీసీ ఫలితాల దన్నుతో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ రాణించడం, ఎంపిక చేసిన టెక్నాలజీ స్టాక్స్ పెరగడం, బ్యాంకింగ్ స్టాక్స్ లాభపడడం, రూపాయి కొంత కోలుకోవడం, ముడి చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టడం వంటి అనుకూల అంశాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి బయటపడ్డాయి. కన్నడ నాట ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు తీవ్ర ఉత్కంఠను రేపుతుండటం మార్కెట్లను మరింత ప్రభావం చేస్తోంది. బుధవారం నాటి ట్రేడింగ్లో రిలయన్స్ ఇండిస్టీస్, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా, గెయిల్, హెచ్పీసీఎల్, హిందాల్కోలు ఒత్తిడిని ఎదుర్కొనగా.. ఐటీసీ, హెచ్యూఎల్, విప్రో, టీసీఎస్లు 4 శాతం మేర లాభాలు పొందాయి. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ 14 పాయింట్లు కుంగింది. పీఎన్బీ, సిండికేట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీ ట్రాన్స్మిషన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, శక్తి పంప్స్ భారీగా క్షీణించాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 28 పైసల లాభంలో 67.82 వద్ద నమోదైంది.