Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత ప్రభుత్వాల వైపరీత్యాలను.. ఇకపై సాగనివ్వం
- బ్యాంకులు కోలుకునేలా అన్ని చర్యలు
- అవసరమైన అన్ని చర్యలు చేపడుతాం
- పీసీఏ బ్యాంకులకు దన్నగా ఉంటాం: ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు తిరిగి నిలదొక్కుకొనేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నట్టుగా ఆర్థికశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గురువారం ఆయన 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) చెందిన ఉన్నతాధికారులతో విస్తృత సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బ్యాంకింగ్లో వారసత్వంగా జరిగిన పరిణామాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడకు విఘాతం కలుగుతూ వచ్చిందని అన్నారు. దీనిని ఫుల్స్టాప్ పెట్టేందుకు గాను తమ సర్కారు అధికారంలోకి వచ్చాక చర్యలు ప్రారంభించిందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను తిరిగి నిలబెట్టేందుకు గాను అన్ని ప్రయత్నాలను కొనసాగించనున్నట్టుగా వివరించారు. గత ప్రభుత్వాల పాలనలో విచక్షణ లేకుండా విద్యుత్తు, స్టీల్ తదితర రంగాలకు భారీగా రుణాలను అందజేసినట్టుగా ఆయన వివరించారు. ఈ వారసత్వాన్ని ఒకపై చెక్ పెట్టనున్నట్టుగా వివరించారు.
పీసీఏ బ్యాంకులకు చేయూత..
ఆర్థికంగా కొంత ప్రతికూలతను ఎదుర్కొంటున్న బ్యాంకులు తిరిగి గాడిన పడేసేందుకు గాను భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించిన 'ప్రాంప్ట్ కరెక్టీవ్ యాక్షన్' (పీసీఏ) కింద ఆంక్షలను ఎదుర్కొంటోన్న పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా బలోపేతం చేసేందుకు గాను ప్రభుత్వం తగిన చేయూతనందించనుందని గోయల్ హామీ ఇచ్చారు. దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ట్ర తదితర బ్యాంకులు ప్రస్తుతం ఆర్బీఐ విధించిన పీసీఏ ఆంక్షల్లో ఉన్నాయి. పీసీఏ కింద ఆయా బ్యాంకులు డివిడెండ్లను పంచడం, లాభాలను జమ చేయడం, కొత్త శాఖలను తెరవడం, మొండి బాకీలకు గాను అధిక మొత్తంలో కేటాయింపులు జరపాల్సి రావడం, యాజమాన్యానికి పరిహారం, డైరెక్టర్లకు పీజుల చెల్లింపు వంటి విషయాలపై నిషేధం ఉంటుంది.
వీలైన సాయం అందిస్తాం..
పీసీఏ ఛట్రంలో ఇరుక్కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్న బ్యాంకులు ఆర్బీఐ ఆంక్షల పరిధి నుంచి బయట పడేందుకు గాను రానున్న రొజుల్లో అవసరమైన అన్ని రకాల చేయూతను అందించనున్నట్టుగా గోయల్ వివరించారు. గడిచిన 12-13 ఏండ్ల కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాయన్న విషయాన్ని అర్థం చేసుకొనేందుకు గాను బ్యాంకర్లతో సమావేశం బాగా దోహదం చేసిందని ఆయన అన్నారు. 11 బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు వాస్తవ పరిస్థితిని సర్కారు దృష్టికి తీసుకువచ్చారని.. దీని నుంచి బయట పడేందుకు గాను అవసరమైన సలహాలను కూడా వారు సూచించారని అన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని తక్షణం గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఈ దిశగానే తన కృషి ఉంటుందని వివరించారు.
జైట్లీ కోలుకుంటున్నారు..
కిడ్నీ మార్పిడీ శస్త్రచికిత్స చేయించుకున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైటీ ఆరోగ్యం క్రమంగా కుదురుకుంటోందని గోయల్ సమావేశంలో వెల్లడించారు. అంతకుముందు రోజు తాను జైట్లీతో సమావేశమయ్యానని వివరించారు. ఆర్థిక శాఖలో నెలకొన్న కొన్ని సమస్యలపై జైట్లీ తనుకు స్పష్టతనిచ్చారని అన్నారు. వాటి పరిష్కారానికి తాను కృషి చేస్తున్నానన్నారు. జైట్లీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖను ప్రభుత్వం తాత్కాలికంగా గోయల్కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన రైల్వేశాఖతో పాటు బొగ్గు శాఖను నిర్వహిస్తున్నారు. స్వతహాగా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన గోయల్ తనదైన పనితీరుతో ఆర్థిక శాఖలో కీలక మార్పులు తేగలడన్న అంచనాల నేపథ్యంలో గురువారం బ్యాంకర్ల సమావేశం జరగడం విశేషం. గోయల్ వ్యక్తిగతంగా జైట్లీకి చాలా సన్నిహితుడు. జైట్లీ తిరిగి వచ్చే అక్టోబరులో బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.