Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతన్న నేపథ్యంలో దేశ చమురు దిగుమతి బిల్లు మరో 50 బిలియన్ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు. అంతర్జాతీయంగా పీపా ముడి చమురు ధర నవంబరు 2014 నాటి స్థాయిని తాకి 80 డాలర్లు పలుకుతున్నప్పటికీ.. ఇది దేశ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే చమురు ధరల పెరగుదల వల్ల కరెంటు ఖాతా లోటు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కెట్లో చమురు ధరలు అంతకంతకు పెరుగుతున్నప్పటికీ పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని ఇప్పటికిప్పుడు తగ్గించే ప్రస్తావనేది లేదని ఆయన తేల్చి చెప్పారు. సుంకాన్ని తగ్గించే విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్నట్టుగా ఆయన తెలిపారు. పెరుగుతున్న ముడి చమురు ధరలు ఖజానాపై 25 బిలియన్ల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు అదనపు భారాన్ని మోపే అవకాశం ఉందన్నారు. గత ఏడాది చమురు దిగుమతలకు గాను దేశం 72 బిలియన్ డాలర్లను వెచ్చించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పెరిగిన బిల్లు మూలంగా కరెంటు ఖాతా లోటు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు పెరిగే అవకాశం లేకపోవచ్చని అన్నారు. వ్యవస్థలో కరెన్సీ పంపిణీ తిరిగి సాధారణ స్థాయికి చేరుకున్నట్టుగా ఆయన వివరించారు. ఈక్విటీ మార్కెట్లు, బాండ్లు నుంచి అధిక మొత్తంలో నగదు బయటకు వెళుతున్నప్పటికీ అది ప్రమాదకర స్థాయిలో మాత్రం లేదని ఆయన అన్నారు. కేవలం పక్షం రోజుల్లోనే 4-5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు బయటకు పోవడం ఆలోచించాల్సిన అంశం కాదని అన్నారు.