Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత వారమూ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు..
- ప్రభావం చూపిన కర్నాటకం, చమురు
- ఆజ్యం పోసిన దేశీయ సూక్ష్మ గణాంకాలు
- 687పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
- 210 పాయింట్లు కుంగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ వారంలో తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అనిశ్చితి ఏర్పడడం, దేశ పారిశ్రామిక ప్రగతి అయిదు నెలల కనిష్టానికి దిగజారడం, టోకు ద్రవ్యోల్బణం, రిటైల్ ద్రవ్యోల్బణం రెండు పెరగడంతో పాటు బాండ్ల మార్కెట్లలో ఒడుదొడుకుల దేశీయంగా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. మరోవైపు అంతర్జాతీయంగా చూస్తే పీపా ముడి చమురు ధరల 80 డాలర్లకు చేరడం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు, కొరియా ద్వీపకల్పంలో ఏర్పడిన ఉద్రికత పరిస్థితలు తదితర అంశాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ గత వారం దాదాపు 687.49 పాయింట్ల మేర కుంగి కీలక మద్దతు స్థాయి అయిన 35,000 పాయింట్ల దిగువకు పడిపోయి 34,848 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా 210.10 పాయింట్ల మేర పడిపోయి 10,594 పాయింట్ల కీలక మద్దతు స్థాయి అయిన 10,600 పాయింట్ల దిగువకు చేరి 10,596.40 పాయింట్ల వద్ద ముగిసింది. రోజుకో రకంగా మారుతూ వచ్చిన కర్నాటక రాజకీయం మార్కెట్లపై వారం మొత్తం ప్రభావం చూపింది.
మూడో వారము అదే సీను..
గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ గరిష్టం 35,555.83 పాయింట్ల వారపు గరిష్టాన్ని తాకింది. వారం మొత్తంలో ఈ సూచీ 34,821-35,993.53 పాయింట్ల మధ్య కదలాడింది. అనంతరం వారాంతంలో 34,848.62 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంగా చూస్తే గత వారం ఈ సూచీ 1.93 శాతం కుంగి 687.49 పాయింట్ల మేర కుంగింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 10,815.15 పాయింట్ల వారపు గరిష్టాన్ని నమోదు చేసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,929-10,589.10 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 1.94 పాయింట్ల మేర కుంగి 210.10 పాయింట్ల మేర నష్టపోయింది. దీంతో బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లలో వరుసగా మూడోవారం కూడా భారీ అమ్మకాలు నమోదయ్యాయి. గత వారంలో ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు మాత్రం లాభాల్లో నడిచాయి. అత్యధికంగా అమ్ముడైన స్టాక్స్లో యంత్ర పరికరాలు, ఆటో, పీఎస్యూ, లోహ, చమురు మరియు గ్యాస్, ఆరోగ్య సంరక్షణ, ఐపీవో, విద్యుత్తు, స్థిరాస్తి, టెక్నాలజీ రంగ స్టాక్ నిలిచాయి. కర్నాటకలో బీజేపీ వైఫల్యం నేపథ్యంలో మార్కెట్లు వచ్చే వారం మరింతగా పతనమయ్యే అవకాశాలున్నాయి.